విజ్ఞానకోశము - 3
గోలకొండ సుల్తానులు
చేరిన ఇతర స్వామిద్రోహులవలె అబ్దుల్లాఖాన్ కూడ మొగలు సైన్యమున చేరియున్న బాగుగ నుండెడిది. కాని అతడు గోలకొండ సైన్యమున నుండి 1686 వ సం. రము 21 సెప్టెంబరునాడు అర్ధరాత్రమందు కోటద్వారములు తెరచి మొగలుసేనలకు స్వాగత మొసగెను. ఈ దాడిఫలితముగ 11/2 శతాబ్దికిపైగా వైభవదశ ననుభవించిన గోలకొండనగరము ఔరంగ జేబు చేజిక్కి తన సౌభాగ్యమును కోల్పోయినది.
గోలకొండ వైభవమును తెలుగుకవులు, ఉర్దూకవులు ఎందరో కీర్తించియున్నారు. మహమ్మద్కులీ వ్రాతల వలన, ప్రణయగీతికలవలన, చరిత్రకారుల అనుభవముల వలన, విదేశీయులు, రాయబారులు వ్రాసిన గ్రంథముల వలన, గోలకొండ వైభవము నేటికిని కన్నుల గట్టినట్లున్నది. పొన్నగంటి తెలగన్న తన యయాతిచరిత్ర కావ్య పీఠికయందు గోలకొండను ఈ విధముగ వర్ణించెను :
"తెఱగంటి దొరఱాల తెగలఁదీఱినకోట
నిగనిగల్ నలుగడల్ నిండియుండఁ
దమ్ముల పాదు రాకొమ్మల దగదగల్
వేలుపుఁ బ్రోలిర్లు విరియఁజేయఁ
గొత్తడంబుల కెంపు క్రొత్తడంబుల రంగు
నింగికిఁ దోపు వన్నియలు నింపఁ
గడలి యోనని చిల్వపడతి చాల గడిత
తెలనీటి నే ప్రొద్దు గలసియుండ
మిసిమి బంగారు మేడలమీఁది యెదల
నిడిన ముత్యాలుఁ జుక్కలుఁ దడవడంగఁ
దెలియకెల్లరు వెఱగంద నలరునెపుడు
మేలు వజ్జీర్లగమికొండ గోలకొండ.
కో. గో.
గోలకొండ సుల్తానులు :
దక్షిణభారత చరిత్రలో గోలకొండ యుగ మొక ప్రత్యేక స్థానమును గడించుకొని యున్నది. ఇది ఒక విధముగ మహమ్మదీయ యుగముగ కీర్తింపబడుచున్నను, సమకాలిక సాంఘిక, రాజకీయ, సారస్వతాది ప్రభావముల వలనను, గోలకొండనవాబులు పాలించిన ప్రాంత మాంధ్రదేశాంతర్గత మగుటవలనను, పాలిత ప్రజ లాంధ్రు లగుటవలనను, కొందరు మహమ్మదీయ ప్రభువుల ప్రాంతీయ దేశ భాషాభిమానము వలనను, గోలకొండ సుల్తానులు ఒక విధముగ ఆంధ్రప్రభువు లనియే నిర్ణయించుట సమంజస మను విషయమున పలువురు చరిత్ర కారులు ఏకాభిప్రాయులై యున్నారు.
ఆంధ్రుల చరిత్రకును గోలకొండ చరిత్రకును విడరాని సంబంధము కలదు. కావున గోలకొండ స్థాపనోదంతమును వివరించు సందర్భమున సమకాలికాంధ్ర రాజకీయముల ప్రసక్తి అత్యవసరము. దక్షిణాపథ చరిత్రలో మహమ్మదీయ యుగము కాకతీయుల కాలమునుండి ప్రారంభమగుచున్నది. ఓరుగల్లు రాజధానిగా పండ్రెండవ శతాబ్ది నుండి పాలించుచున్న కాకతీయ ప్రభువుల ప్రాభవ వైభవములను క్షీణింపజేసి, దక్షిణాపథమును కైవస మొనర్చుకొనుటకై ఉత్తరమునుండి మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైనవి. క్రీ.శ. 14 వ శతాబ్ది ప్రారంభమున ఖిల్జీ, తుఘలకు దండయాత్రలు కాకతీయుల పరిపాలనాంగమును ఛిన్నాభిన్న మొనర్చినవి. మొదటి దశయందు వారి దండయాత్రలు విఫలములైనను తరువాత జయప్రదములై కాకతీయుల పతనమునకు దారితీసినవి (1323). వీరి విజయపరంపరయే బహమనీ రాజ్య స్థాపనకు నాంది యయ్యెను (1347). కాకతీయ సామ్రాజ్య పతనముతో దేశము నిర్జీవమైనది. ప్రోలయనాయకుని అకుంఠిత దేశాభిమానము, వీరుల హృదయమున నుబికిన ప్రగాఢ స్వాతంత్ర్యేచ్ఛ, హైందవ మత ధర్మరక్షణకై పునాదులు వేసినవి. వాటి ఫలితమే విజయనగర సామ్రాజ్యావతరణము (1336). కాని నాటికే సమయము మించిపోయినది. మహమ్మదీయుల కొక చిన్న రాజ్య మేర్పడినది. అదియే బహమనీ రాజ్యము (1347-1512). బహమనీరాజులు కొంత కాలమువరకు దేశీయ ప్రభువుల ధాటిని అడ్డగింపలేకపోయిరి. పరిస్థితుల ప్రోద్బలమువలన బహమనీ రాజ్యము వివిధ రాజకీయ మండలములుగా చీలిపోయినది. క్రీ. శ. 1490 ప్రాంతమున మహమూదుషా కాలమున బిజాపూరు, అహమ్మద్ నగరు, బిరారు ప్రాంతములేర్పడినవి. విజయనగర ప్రభువుల సామ్రాజ్యము బలిష్ఠముగా నుండినను. మహమ్మదీయ మండలాధికారులు రాజకీయ చతురంగమున వివిధములయిన పన్నాగములను పన్ని తమ ఆటలు సాగించుకొను
481