గురుజాడ వేంకట అప్పారావు
సంగ్రహ ఆంధ్ర
అటుతరువాత కొంతకాలము చీపురుపల్లిలో గూడ విద్యాభ్యాసము జరిగినది. 1872 వ సంవత్సరమున వేంకట అప్పారావుగారు విజయనగరం మహారాజావారి ఆంగ్ల కళాశాలకు చెందిన ఉన్నత పాఠశాలలో ప్రవేశించిరి. వీరికి కీ. శే. గిడుగు రామమూర్తిపంతులుగారు సహాధ్యాయులుగ నుండిరి.
మెట్రిక్యులేషన్లో ఉండగనే అప్పారావుగారు ఆంగ్లమున కవిత్వము రచించి ఆనంద గజపతుల నాకర్షించిరి. మహారాజావారి ఆంగ్ల కళాశాలా ప్రధానాధ్యాపకులైన చంద్రశేఖరశాస్త్రిగారి మన్ననలను బొంది వారి ఇంటనే, వారి చెంతనే భాషాసారస్వతములను జీర్ణించుకొనిరి.
చంద్రశేఖరశాస్త్రిగారు అప్పారావుగారిని గూర్చి తమ అభిప్రాయము నిట్లు చాటిరి. "అఖండ మేధాసంపత్తిగల కొద్దిమంది విద్యార్థులలో అప్పారావొకడు. విద్యార్థిగా ఉంటూ గురువుల మన్ననలను పొందిన యువకుడు. నిరంతర సాహిత్య వ్యాసంగము అతని వ్యసనము. సహజ ప్రేరేపణవలన కలిగిన అతని కవితాశక్తి అపారమైనది. సాధనవల్ల అది ప్రకాశవంతమై ఎప్పటికిని మనం మరువ లేని కవుల స్థానమును అప్పారావుకు ప్రసాదిస్తుంది. ఇందుకు సందేహము లేదు. వినయము, సౌశీల్యము, అతని సహజగుణములు. జీవితమున అతను అన్నిటా ఔన్నత్యమును పొందవలెనని నా అభిలాష. అతని ఔన్నత్యమే నాఔన్నత్యము. అతని ఆనందమే నాఆనందము.” పుట్టుకతోడనే పూవు పరిమళించు రీతి పిన్నతనమందే ఇట్టి మన్నన లందుకొన్న మహా పురుషుడు గురుజాడ. మెట్రిక్యులేషన్ పరీక్షలోను, బి.ఎ. పరీక్షలోను (1886) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యెను.
పట్టభద్రులు కాకపూర్వమే 1884 వ సంవత్సరమున కొంతకాలము అప్పారావుగారు హైస్కూలులో ఉపాధ్యాయులుగా నుండిరి. అప్పుడాయనకు లభించిన వేతనము నెలకు 25 రూపాయలు మాత్రమే. ఆ యుద్యోగ మిష్టము లేక వీరు 1887 లో డిప్యూటీ క లెక్టరు కచేరీలో గుమాస్తాపని గూడ చేసినారు. కాని, ఆ యుద్యోగము కూడ వారికి సరిపడలేదు. న్యాయవాదిగా రాణించవలె నను వారి కోర్కి ఆర్థికపు చిక్కులవలన సఫలము కాలేదు. ఆయన ఉపజ్ఞను విద్యాలయములు ఉపయోగించుకొనవలెనని ఆనందగజపతి మహారాజావారు ఆ సంవత్సరమే (1887), తమ కళాశాలలో ఆతనిని నాలుగవ ఉపన్యాసకునిగ నెలకు నూరురూపాయల జీతముపై నియమించిరి. ఉపన్యాసకులుగా నుండి అప్పారావుగారు మహా రాజావారికి వార్తాపత్రికలు చదివి వినిపించు ఉద్యోగము కూడ చేయుచుండిరి. అందుకై రాజాగారు వారికి ఏబది రూపాయలు అదనముగా ఇచ్చుచుండిరి. 1891 లో అప్పారావుగారు మూడవ ఉపన్యాసకులుగా ప్రమోషను పొందిరి. వారు ఎఫ్. ఏ., బి.ఏ. తరగతులకు తత్త్వశాస్త్రము, ఆంగ్లము, సంస్కృతసాహిత్య చరిత్రము, అనువాదము, వ్యాకరణము, గ్రీకు, రోమను చరిత్రములను బోధించెడివారు. అనారోగ్యము కారణముగా అప్పారావుగారు ఉపన్యాసక పదవిని విడిచిపెట్టి 1896 లో సంస్థాన శాసన పరిశోధక పదవి నలంకరించిరి. ఆనంద గజపతి మరణానంతరము వారి సోదరి రీవా మహా రాణిగారికి ఆంతరంగిక కార్యదర్శిగా 1898 లో నియుక్తులై, ఆమరణాంతము ఆ యుద్యోగమున నుండియే కావ్య కళాస్రష్టలై వెలుగొందిరి. అప్పారావుగారు 30-11-1915 దివంగతులైనారు.
చిత్రము - 104
కీ. శే. గురుజాడ వేంకట అప్పారావు
దేశభక్తుడుగా, ఉత్తమ కళావేత్తగా, సంస్కారిగా, కవిగా, నాటకరచయితగా, విమర్శకుడుగా, పరిశోధకుడుగా గురుజాడ అప్పారావుగారు చేసిన సేవ అపారము. "దేశమును ప్రేమించుమన్నా" అను దేశభక్తి ప్రబోధక గేయమును 1910 లో రచించి, అప్పారావుగారు మనజాతికి మేలుకొలుపులు పాడినారు. 1887 ప్రాంతము లందే కాంగ్రెసు సభలకు పోయి ఉపన్యాసము లిచ్చిరి. వారు రచించిన ముత్యాలసరములు, పూర్ణమ్మ, కన్యక, కాసులు, లవణరాజు కల, మొదలైన ఖండ కావ్యములు ప్రాతక్రొత్తల మేలుకలయికలును, సంఘసంస్కరణోద్దేశ పూర్వకములునై యున్నవి. గిడుగు రామమూర్తి
394