Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుణాఢ్యుడు

మను గుర్తించినవాడై, స్వయముగా తానే ఆతని ఆశ్రమము కడకు జని, తనను మన్నించి ఆ గ్రంథమును కాల్చ వలదని వేడుకొనెను. కాని అప్పటికే ఆరులక్షల గ్రంథము దహింపబడెను. మిగిలిన ఒక లక్షగ్రంథము మాత్రమే శాతవాహనునికి దక్కెను. దాని నతడు గుణాఢ్యుని శిష్యుల సహాయమున తిరుగవ్రాసి భద్రపరచెనట ఇదియే మన మనుకొను బృహత్కథాశేషము. గుణాఢ్యు డనబడు మాల్యవంతుడు శాప విముక్తినొంది ఈశ్వర సన్నిధి కేగెను.

సోమదేవుని కథా సరిత్సాగరమందు గుణాఢ్యుని గూర్చిన కథ పై విధముగా నున్నది. జయద్రథుని హర చరిత చింతామణియందు కూడ ఇంచుమించుగా నిట్లే యున్నది. ఈ రెండును కాశ్మీర సంప్రదాయమునకు చెందినవి.

ఇంక, నేపాల మాహాత్మ్యము నందలి కథ ఇట్లుండును: ఈశ్వరుడు పార్వతికి ఈ కథలను చెప్పుచుండగా భృంగి యను ప్రమథుడు ఒక తుమ్మెద రూపముదాల్చి రహస్యముగా ఆ కథలను విని, తన భార్యయగు విజయకు చెప్పెను. శివుడు భృంగిని శపించెను. అంత భృంగి ఆశాపము యొక్క విముక్తిని వేడుకొనెను. 90,00,000 శ్లోకముల గ్రంథముగా ఆ కథను వ్రాయుచో శాపవిముక్తియగు నని శివు డాదేశించెను. మరియు ఆ గ్రంథము శృంగార కావ్యముగను, నాటకమున కనువగు కథాసన్నివేశములు కలదిగను, రససమన్వితముగను ఉండవలెనని నిర్దేశించెను. భృంగియే మధురలో గుణాఢ్యు డను పేర జన్మించి, ఉజ్జయినికిపోయి మదనుడను రాజుయొక్క ఆశ్రయము పొందెను. ఆ రాజుభార్య లీలావతి. శర్వవర్మయను పండితుడుగూడ ఇదివరకే యచట చేరియుండెను. శేషించిన కథ శాతవాహనుని కథయందువలెనే పూర్తియగును.

కేవల మీ కథలయొక్క ప్రచారమునే ఆధారముగా గైకొని గుణాఢ్యుడు కాశ్మీరము వాడనియు, నేపాలములోని హిమవత్ప్రాంతము వాడనియు, కథాసన్ని వేశములనుబట్టి వింధ్యపర్వత ప్రాంతము వాడనియు, ఉజ్జయిని వాడనియు అనేక అభిప్రాయములను విమర్శకులు వెలిబుచ్చుచుండిరి. గుణాఢ్యుని ఒక దైవాంశ సంభూతునిగా అభివర్ణించు ఈ కథలు చరిత్ర కెంతవరకు ఉపకరించునో నిర్ణయింపజాలము. ఇది యిట్లుండగా గాథాసప్తశతి యొక్క ప్రతులలో నొకదానియొక్క సప్తమ శతక సమాప్తియందు “ఇతి శ్రీమత్కుంతల జనపదేశ్వర ప్రతిష్ఠాన పత్తనాధీశ, శతకర్ణోపనామక, ద్వీపి (ప) కర్ణాత్మజ. మలయవతీ ప్రాణప్రియ, కాలాపప్రవర్తక శర్వవర్మధీసఖ, మలయవత్యుపదేశ పండితీభూత, త్యక్తభాషాత్రయ, స్వీకృతపైశాచిక, పండితరాజ గుణాఢ్య నిర్మిత, భస్మీభవద్బృహత్కథావశిష్ట, సప్తమాంశావలోకన ప్రాకృతాది వాక్పంచక ప్రీత, కవివత్సల హాలాద్యుపనామక. శ్రీసాతవాహనరేంద్ర నిర్మితా, వివిధాన్యోక్తిమయ ప్రాకృత గీర్గుంఫితా, శుచిరసప్రధానా, కావ్యోత్తమా, సప్తశత్యవసాన మగాత్" అను గద్యము కానవచ్చుటనుబట్టి బృహత్కథా ప్రణేతయగు గుణాఢ్యుడు ప్రతిష్ఠాన పురాధీశ్వరుడగు హాల శాతవాహన రాజాస్థానములో కాతంత్ర వ్యాకరణ నిర్మాతయగు శర్వవర్మతోబాటు ఉండియున్నట్లు స్పష్టముగా తెలియుచున్నది. కథా సరిత్సాగరములోని కథయు పూర్తిగా దీనినే సమర్థించుచున్నది. ప్రాచీనాంధ్ర రాజవంశమునకు చెందిన అరిష్ట శాతకర్ణి పుత్రుడు హాలుడను నామాంతరము గల సాతవాహనుడు క్రీ. పూ. 490 ప్రాంతమందలివాడని కొందరుచరిత్రకారుల అభిప్రాయమైయున్నది. కాని గుణాఢ్యునినాటి శాతవాహనుడు వేరనియు, అతడే శకకర్తయై శాలివాహనుడను పేర క్రీ.శ 78 నుండి రాజ్యమేలెననియు మరికొందరి మతము. ఇట్లు శాతవాహనుని కాలమునుబట్టి గాని, గుణాఢ్యునికాలము నిర్ణయింప వీలుగాకున్నది. శాతవాహన నామము వంశనామముగా, అనేక రాజులకు చెల్లియున్నట్లు నిదర్శనము లుండుటచేత, గుణాఢ్యుడు క్రీ. పూ. 400 నుండి క్రీ.శ. మొదటి శతాబ్దమువరకుగల కాలములో ఎప్పటివాడో నిర్ణయింప శక్యముగాకున్నది. అయినను క్రీ. పూ. 200-150 సంవత్సరముల ప్రాంతములో ఇతడు ఉండియుండునని పలువురు నిర్ణయించుచుండిరి. బృహత్కథయొక్క సంస్కృతానువాదములగు క్షేమేంద్రుని బృహత్కథామంజరిని బట్టియు, సోమదేవుని కథా సరిత్సాగరమును బట్టియు, గోదావరీతీరమందలి సుప్రతిష్ఠిత నగరమే ఈతని జన్మస్థానమని తెలియుచున్నది. (నేటి ఔరంగాబాదు జిల్లాలోని 'పైఠన్' ఇదియే).

391