గుణాఢ్యుడు
సంగ్రహ ఆంధ్ర
తరువాత ప్రతిష్ఠాన పురాధీశ్వరుడగు శాతవాహనుని మంత్రియగు శర్వవర్మ సహాయమున గుణాఢ్యునికికూడ ఆ రాజాశ్రయము లభించెను. ఆ యాస్థానమం దతనిని బహు శాస్త్రజ్ఞునిగను, మంత్రిగను గౌరవించుచుండిరి. శాతవాహనునకు మొదట సంస్కృతజ్ఞానము లేకుండెను. అతని పట్టమహిషియగు మలయవతి సంస్కృత పాండిత్యము గలిగి రసజ్ఞురాలై యుండెను. ఒక నాడా రేడు మలయవతితో జలక్రీడలాడుచుండగా, క్రీడావశమున సంభవించు జలతాడనమును ఆమె సహింపజాలక రాజుతో “మోదకైస్తాడయ” (మా, ఉదకైః, తాడయ = నీటితో కొట్ట వలదు) అనెను. సంస్కృతజ్ఞానములేని ఆరాజు మోదకైః తాడయ ( మోదకములతో కొట్టుము) అని అర్థముచేసికొని మోదకములు (లడ్లు) తెమ్మని పరిచారికల నాజ్ఞాపించెను. అంత మలయవతి సమధిక పాండిత్య గర్వము చేత, “రాజా! నీళ్ళలో మోదకముల (లడ్ల) కేమి సంబంధము? ఇంతమాత్రము వ్యాకరణ జ్ఞానము మీకు లేదా?" యని పకపకనవ్వెను. శాతవాహనుడు తన అజ్ఞానమునకు చాల సిగ్గుపడి సభాముఖమును చూడక, పాండిత్యములేని జీవితము రాజ్యమున్నను నిరర్థకమని పరితపించు చుండెను. పరిచారికలవలన ఈ యుదంతమును కనిపెట్టి శర్వవర్మ, గుణాఢ్యుడు రాజసన్నిధి కేగి పరితాప కారణమును అడిగిరి. అంత రాజు తనకు సంస్కృత వ్యాకరణమును త్వరలో నేర్పవలె నని గుణాఢ్యుని కోరెను. ఇతరులకు పండ్రెండు సంవత్సరములలో గాని సాధ్యపడని వ్యాకరణ శాస్త్రమును రాజునకు ఆరు సంవత్సరములలోనే నేర్పగలనని యతడు ప్రత్యుత్తర మొసగెను. అంత శర్వవర్మ, మహారాజు అంత దీర్ఘకాలము శాస్త్ర మభ్యసింప జాలడనియు, తాను ఆరు మాసములలోనే వ్యాకరణమం దాతనికి పరిపూర్ణ జ్ఞాన మేర్పడునట్లు చేయగలననియు చెప్పెను. అట్లొనర్చుట అసాధ్యమనియు, శర్వవర్మ అట్లు చేయగలిగినచో తాను సంస్కృత, ప్రాకృత, దేశభాషలను మూడింటిని సర్వాత్మనా విడిచిపుచ్చి, ఎన్నడు వాటిని ఉచ్చరింపనని ప్రతిన బూనెను. గోదావరీ ప్రాంతమునం దపుడు ఎట్టి దేశభాష యుండి యుండెనో ! శర్వవర్మ తాను ఆరు మాసములలో అట్లు చేయజాలనిచో గుణాఢ్యుని పాదుకలను పండ్రెండేండ్లు శిరస్సుపై వహించెదనని చెప్పి వెడలిపోయెను. ఇట్లు పట్టుదలబూని శర్వవర్మ కార్తికేయుని ఉపాసించి, ఆ దేవుని యనుగ్రహమున 'కాతంత్ర వ్యాకరణము ' లేక 'కాలాప వ్యాకరణము'ను బడసి రాజునకు ఆరు నెలలలో సంస్కృత వ్యాకరణమందు పరిపూర్ణ జ్ఞానము కలుగునట్లు చేసెను. అంత గుణాఢ్యుడు 'ప్రతిజ్ఞా సమయము ననుసరించి, భాషాత్రయముతోపాటు ప్రతిష్ఠానపురమును గూడ విడచి, వింధ్యాటవికిపోయి మౌనముతో తిరుగాడు చుండెను. అచట అతనికి పిశాచజాతితో స్నేహ మేర్పడి ఆ భాషయందు పరిజ్ఞానము కలుగుటచే నతడు మౌనము విడిచి ఆనాలవ భాషయందు మాటాడుటకు, లిఖించుటకు పూనెను.
అప్పటికే వరరుచివలన కాణభూతి ఈశ్వర ప్రోక్తములగు కథల నన్నింటిని విని తాను తిరిగి చెప్పుటకై యెవరు దొరుకునా యని నిరీక్షించుచుండెను. గుణాఢ్యుడు కనిపించినందులకు కాణభూతి సంతసించి, తాను వరరుచివల్ల వినిన కథల నన్నిటిని అతనిని తన పిశాచ భాషయందు వినిపించెను. గుణాఢ్యుడు వాటిని సాకల్యముగా విని, భూర్జపత్రములపై తన రక్తముతో పిశాచ భాషలో ఏడు లక్షల గ్రంథముగా లిఖించెనట. దానికి 'బృహత్కథ' యను పేరిడి శాతవాహనునికి వినిపించ వలసినదిగా తన శిష్యుల కిచ్చి పంపెను. ఆ రాజు ఈ గ్రంథమును సాదరముతో స్వీకరించు నని గుణాఢ్యు డాశపడెను. కాని రక్తముతో పిశాచభాషలో వ్రాయబడి, ఏడు లక్షల పరిమితిగల ఈ బృహత్కథను శాతవాహనుడు ఈసడింపుతో తిరస్కరించెను. అంత గుణాఢ్యుడు విరక్తుడై, ఒక్కొక్క పత్రమును చదివి పశుపక్ష్యాదులకు వినిపించుచు అగ్నిలో వేయదొడగెను. ఇంతలో రాజునకు అనారోగ్యము వలన బలహీనత ఏర్పడగా, వైద్యులు పరీక్షించి, అతడు భుజించుమాంసాహారము నీరసమై యుండుటయే దీనికి కారణమనితెలిపిరి. ఆ మాంసమును తెచ్చు వేటగాండ్రను విచారింపగా, వారు అడవిలోని పశుపక్ష్యాదు లన్నియు ఆహారమును గూడ మాని, గుణాఢ్యునికథలను వినుచున్నవి గనుక, వాటి మాంసము కడు నీరసించి యుండవచ్చునని చెప్పిరి. అంత తాను తిరస్కరించిన గుణాఢ్యుని కథయొక్క మహి
390