Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడివాడ

సంగ్రహ ఆంధ్ర

అచ్చటచ్చట గన్పడును. ఇచట ధర్మమే ప్రధానసూత్రముగాగల హిందూ, మహమ్మదీయులు గలరు. వీరికి పౌరాణికాచారముల పైననే యెక్కువ నమ్మకము. కావుననే ఆధునికయుగ ప్రభావము వారిపై ఎక్కువగ పడలేదు.

ఈ ప్రదేశమున చూడదగు స్థలము లెన్నియో గలవు. భూజ్‌నందు నారాయణాలయము శారదాబాగ్, అను నవియు, మాండవీలో 'దేవాదాండీ' అను కోటయు అంజా యందు బేసల్ తోరల్ యొక్క సమాధియు, ముంద్రాలో షాహమురాదు, పీర్ దర్గా మొదలగు నవియు చూడదగినవి. ఇవియును గాక, జైనతీర్థ స్థలములు గలవు. ఇవి పంచతీర్థములని ప్రసిద్ధి. వీటి పేర్లు మాతానోమడ్, జభౌ, తేరా, నాలయాసుధీర్ అనునవి. ఈ ప్రాంతము ఖనిజ సంపత్తిని గూడ గలిగి యున్నది. ఇందు బొగ్గు, ఇనుము, పెట్రోలియం గనులు గలవు. కావుననే యిచట జనసంఖ్య ఎక్కువైనది.

గుజరాతు, సౌరాష్ట్రము, కఛ్ అను మూడు ప్రదేశములు కలిసియే మహా గుజరాతుగా నేర్పడినది. దీనినే గుజరాతు అని కూడ యందురు. ఇప్పుడు ఈ ప్రాంతము ఇతర ప్రాంతములతో సరిసమానమగు సంపత్తును కలుగ జేసికొనుచున్నది. ఇచ్చటి నాగరికత యందు కూడ నూతనత్వ మంకురించినది. ఇచ్చటి ప్రజలు మూఢనమ్మకములను మాని, యితర ప్రాంతములతో సమాన ప్రతిపత్తిని సంస్కృతిని సంపాదించుకొని, సమగ్ర భారతదేశములో తన బాధ్యతలను నిర్వహింపగలదని ఆశింపవచ్చును.

ర. వి.


గుడివాడ :

ఆంధ్రప్రదేశమునందలి కృష్ణాజిల్లా నందుగల గుడివాడ ఒక ప్రసిద్ధనగరము. గుడివాడ యూనియన్ బోర్డు 1937లో పురపాలక వ్యవస్థగా మార్చబడినది. 1956 ఆగస్టు 1 వ తేదీన ఈ పట్టణము ప్రథమశ్రేణికి చెందిన పురపాలక సంఘముగా గుర్తింపబడినది. సంవత్సరమునకు ఈ 'మునిసిపాలిటీ' ఆదాయము సుమారు 6 లక్షల రూపాయలు. సహకార ప్రణాళికక్రింద ఇటీవల నిర్మింపబడుచున్న 'రాజేంద్రనగర్ ' కాక, మిగిలిన పట్టణమంతయు పూర్వపుపద్ధతిలో కట్టబడిన ఇరుకు సందులతో కూడి యున్నది. ప్రధానమయిన బాటలుమాత్రము విశాలముగా సిమెంటు చేయబడియున్నవి. తాలూకా కేంద్రమే గాక ఈ నగరము రెవెన్యూ డివిజనుకుగూడ ముఖ్యస్థానము. ఈ డివిజనులో కైకలూరు, గుడివాడ తాలూకాలు చేరియున్నవి. ఈ నగరముయొక్క జనసంఖ్య 1951 వ లెక్కలనుబట్టి 32,008

చారిత్రకప్రసిద్ది - శిథిలావశేషములు : తూర్పు చాళుక్యులు వేంగీమండలమును పరిపాలించు రోజులలో, వేంగీ పట్టణమునుండి సముద్రతీరమునకు పోవు వర్తక మార్గములో గుడివాడ ఒక కేంద్రముగా నుండెడిది. అంతే గాక, 'కుదుర' రాజ్యపాలకులకు గుడివాడయే రాజధానిగా నుండెడిది.

గుడివాడకు పశ్చిమముగా - లామపాడుదిబ్బ ప్రాంతములో పూర్వము 99 గుళ్ళు, 99 తటాకములు ఉండెడివని ఇతిహాసములు చెప్పుచున్నవి. ఈ లామపాడునందే శాతవాహనరాజులనాటి నాణెములు, రోమక నాణెములు దొరికినవి.

పాతగుడివాడలో 'లంజదిబ్బ' అను పేరుతో వ్యవహరింపబడు వృత్తాకారముగల దిబ్బఒకటి ఉన్నది. దీనిని కేంద్రప్రభుత్వమువారు పురావస్తు ప్రాముఖ్యముగల స్థలముగా ప్రకటించి సంరక్షించుచున్నారు. ఒకప్పుడు ఇక్కడ రాతిపెట్టె ఒకటి దొరికినదనియు, అందులో రత్నములు, బంగారురేకులు మొదలైనవి యుండెననియు తెలియుచున్నది. 1870 లో 'బాస్వెల్' అను దొర దీనిని చూచి, దీనికిని అమరావతి దిబ్బకును సన్నిహిత సంబంధ ముండవచ్చునని అభిప్రాయపడెను. 1878 లో 'సీవెల్ ' దొర ఈ దిబ్బను సందర్శించి, ఇక్కడి శిథిలములకు సాంచీస్తూప సామ్యమున్నట్లు పేర్కొనెను. తెలుగు దేశములో ఉన్న 'సానిదిబ్బ' 'లంజదిబ్బ' అను స్థలములు పూర్వము బౌద్ధభిక్షురాండ్రుగు స్వామినులకు నివాసములై ఉండెడిననియు, సంఘములో కట్టుబాటులు సడలి పోయి వారు అవినీతిపరులైన పిమ్మట నిరసన పూర్వకముగా ప్రజలు ఆప్రదేశములకు ఈ పేర్లు పెట్టినట్లు చారిత్రకుల అభిప్రాయము. ఇవికూడ అట్టి బౌద్ధస్తూపముల అవశేషములే యనుటలో సందేహము లేదు. ఇక్కడకూడ కొన్ని రోమక నాణెములు దొరకినవి.

384