Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్రికెట్

సి. కె. నాయడు ప్రముఖుడు. ఇతడు ప్రతిభావంతుడైన క్రికెట్ కెప్టెన్. బాట్‌ను చాకచక్యముగ ప్రయోగించి, బంతిని విసరికొట్టుటలో ఇతడు కడు గడుసరి. భారత క్రికెట్ ఆటగాండ్రలో ఇతడు అద్వితీయుడైన యోధుడు. దేవధర్, జయ్, రామ్‌జీ, వజీరాలీ, నజీరాలి, నెవెలీ అను ఆటగాండ్రు క్రికెట్ యందలి అన్ని అంశములలోను ఆరి తేరిన దిట్టలు. వీరిలో నెవెలీ అను నతడు ఇంగ్లీషు ఆటగాండ్రను సహితము 'వికెట్ కీపింగ్' (Wicket-keeping) లో భయచకితులను చేసెను. ఇదేతరుణములో ఇంగ్లీషు క్రికెట్ చరిత్రలో దిలీప్ సింగ్, పట్వాడీ నవాబుల నామములు సువర్ణాక్షరములలో లిఖింపబడెను.

1930 నుండి 1946 సం. నడుమ విజయ్ మర్చంట్ అను ఆటగాడు బాటును ప్రయోగించుటలో ఇతరులకంటె మిన్న యని పేరుగాంచెను. ఇతడి బాటింగ్ ప్రదర్శనమును వర్ణించుటకు ఒక గ్రంథము సరిపోవును. హజారే యను నతడు మర్చంటునకు కొలదిగ మాత్రమే తక్కువస్థాయిలో నుండెడివాడు. అమరనాథ్ అను మరియొక ఆటగాడు క్రికెట్ ఆటయందలి కళాకౌశలమును ప్రదర్శించుట యందును, ముస్తాఖ్ అలీ అను నతడు బాటును లాఘవముగ ప్రయోగించుటయందును ఆరితేరినవారు. బౌలింగ్ చేయుటలో నిస్సార్, అమరనాథ్, అమరసింగ్ వ్యక్తిగతముగను, సమష్టిగను సమకాలిక ప్రపంచములో ఏ ఇతర బౌలర్లకును తీసిపోవువారు కారు.

'మంకాడ్ ' అను మరియొక ప్రసిద్ధికెక్కిన క్రికెట్ క్రీడాయోధుడు భారతదేశమునకు అఖండమైన కీర్తి నార్జించిపెట్టెను. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్ట్‌ఇండీస్, పాకిస్థాన్, న్యూజిలెండ్ దేశముల జట్టులతో ఆడిన అటలలో ఇతడు సర్వతోముఖమైన ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులనుగా చేసి వైచెను. 'రోడ్స్' (Rhodes) దేశపుజట్టును మినహాయించినచో, ఇతర జట్టులతో ఆడిన క్రికెట్ టెస్ట్ పందెములలో 2000 పై గా పరుగులు, 100 వికెట్లు సాధించిన మొనగాడు ఇతడొక్కడే.

భారతదేశములో క్రికెట్ అభివృద్ధి చెందుటకు 1934 వ సంవత్సరములో 'రంజీట్రోఫీ ఛాంపియన్ షిప్ 'ను స్థాపించుట మరియొక కారణమైయున్నది. ఈ టూర్నమెంట్‌లో ఉమ్రిగర్, గుప్త, రాయ్, కృపాల్ సింగ్, కాంట్రాక్టర్, వంటివారు సుప్రసిద్దులయిన మేటి క్రికెట్ ఆటగాండ్రుగా సర్వత్ర గణుతికెక్కిరి. క్రికెట్ ఆట ఆర్జించుకొన్న సుసంప్రదాయములకు ఈ భారతీయ ఆటగాండ్రు అర్హతగల వారసులుగా ప్రశంసల నందుకొనిరి.

'గుంటూరు రిక్రియేషన్ క్లబ్' వారి దోహదముతో గుంటూరు నగరమునందు 1953 లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడెను. ప్రసిద్ధికెక్కిన 'రంజీ ట్రోఫీ టోర్నమెంటు'లో పాల్గొనుటకై ఈ అసోసియేషన్ సమర్థులైన క్రికెట్ ఆటగాండ్రను ఏటేటా ఎన్నుకొని పంపుచుండును. క్రికెట్ క్రీడారంగమున అద్వితీయమైన ప్రతిభనార్జించి ప్రపంచ విఖ్యాతి గడించిన మేజర్ సి. కె. నాయుడును, చాలకాలము అఖిలభారత క్రికెట్ కంట్రోలు బోర్డుకు అధ్యక్షులుగా నుండిన విజయనగరం మహారాజ కుమారుడును, వెంకటగిరి కుమార రాజాయును, మరియొక తెలుగు క్రికెట్ యోధుడైన సి. యస్. నాయు డును ఆంధ్ర క్రికెట్ అసోసియేషనుకు సర్వవిధముల సహాయపడి, దాని అభ్యున్నతికి ప్రధాన కారకులైరి.

క్రికెట్ నియమావళి :

1. క్రికెట్ పందెమున ఒక్కొక్క పక్షమందు పదునొకండుగురు ఆటగాండ్రు పాల్గొందురు. ప్రతి పక్షమువారు తమ కెప్టెన్ నాయకత్వముక్రింద ఆడుదురు.

2. ఆట (Innings) ప్రారంభించుటకు పూర్వము, బాటింగ్ లేక ఫీల్డింగ్ ను ఎవరు ముందుగా ప్రారంభింప వలయునో కోరుకొనుటకు ఒక నాణెమును ఎగురవేసి (Toss) నిర్ణయింతురు. దీనికి ముందుగా, ఆటను పర్యవేక్షించి న్యాయము నిర్ణయించు ఇద్దరు అధికారులు (Umpires)నియమింపబడుదురు. నియమము ననుసరించి ఈ అధికారులు రెండు వికెట్లవద్ద స్థానముల నేర్పరచుకొని న్యాయము పాలింతురు.

3. చేసిన పరుగులను లెక్కించు లేఖకులు (Scorers) ఈ కార్యక్రమమునకై ప్రత్యేకముగ నియమింపబడుదురు. బంతిని కొట్టువాడు (Batsman) బంతిని కొట్టిన పిదపగాని లేక ఆటయందు అవకాశము చిక్కినప్పుడుగాని, (స్వపక్షీయులు) తనకెదురుగా తనను దాటుచు ఒక

133