Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్రికెట్

క్రి

క్రికెట్ :

ప్రప్రథమమున క్రికెట్ ఆట ఇంగ్లండులో గిల్ట్‌ఫర్డ్ నగరమందలి ఫ్రీస్కూల్ విద్యాసంస్థలోని బాలురచే 1550 వ సంవత్సరమున ప్రారంభింప బడినట్లు తెలియుచున్నది. 1666 వ సంవత్సర ప్రాంతమందే సెయింట్ ఆల్బన్స్‌వద్ద నొక క్రికెట్ క్లబ్ గూడ వెలసినట్లు చెప్పబడు చున్నది. మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్ లో సస్సెక్స్ నగరమున 1697 లో క్రికెట్ పందెము జరిగినట్లును, ఒక్కొక్క పక్షమున పదునొకండుగురు ఆటగాండ్రు పాల్గొనినట్లును లిఖితపూర్వకమయిన ఆధారము కలదు. లండన్ నగరము ఈ యాటకు పుట్టినిల్లుగ ప్రసిద్ధి చెందినది. ఇక్కడి ఆటగాండ్రు ఈ ఆటయందు విశేషమయిన ప్రతిభా నైపుణ్యములు ప్రదర్శించినట్లు తెలియుచున్నది. ప్రారంభదశయందు లండన్‌ సమీపముననున్న గ్రామ సీమలలో బాలురు క్రమబద్ధముకాని క్రికెట్ ఆటను చెట్లకొమ్మలను క్రీడా పరికరములుగా నొనర్చుకొని అప్పుడప్పుడు ఆడుచువచ్చిరి. క్రమముగా ఈ యాట అభివృద్ధియై సుశిక్షితమైనదిగా రూపొందినది.

17 వ శతాబ్దిలో క్రికెట్ ఆటను కొన్ని వర్గములవారు చిన్న చూపుతో చూచిరి. ఆదివారములందును, చర్చి ఆవరణములందును ఈయాట ఆడిన వారిపై జరిమానాలు విధింపబడెను. 1656 సం. లో క్రాంవెల్‌యొక్క అధికారులు క్రికెటును నిషేధించిరి. కాని అనతి కాలములో ధనిక వర్గమునకును, కులీన వర్గమునకును చెందిన యువకులు ఈ యాటయందు ఆసక్తి కలిగించుకొనిరి. అధికధనమును పణముగపెట్టి వీరు క్రికెట్ పందెములాడు చుండిరి. ఈ పందెములు వేలకొలది ప్రేక్షకులను ఆకర్షించెడివి.

ఇంగ్లండు యువకులు తాము మెట్టిన నూతన ప్రదేశములకెల్ల క్రికెట్ ఆటను కొంపోయి దానిని అధికముగ ప్రచారములోనికి తెచ్చిరి. 1747 వ సంవత్సరములో జరిగిన క్రికెట్ పందెమున స్త్రీలజట్లు పాల్గొనినట్లు లిఖిత పూర్వకమయిన ఆధారము కలదు. 19 వ శతాబ్ధియం దంతటను ముఖ్యముగ ఉత్సాహముగల స్థానిక యువకులు ఈ ఆటలలో పాల్గొనుచుండిరి. 1890 లో ఒక్కొక్క జట్టునందు 11 మందిగల స్త్రీలు క్రీడా ప్రదర్శన పందెములలో పాల్గొనుచుండిరి. ఈ యాటయందు ప్రావీణ్యము గడించినవారు యువతులను తర్ఫీదు చేసెడివారు. ఈ శతాబ్ది మధ్యభాగమునాటికి ఆధునికమయిన క్రీడాకారిణులగు క్రీడా స్త్రీ సంఘ మొకటి ఏర్పడినటుల తెలియుచున్నది. ఈ సంఘమునకు క్రమముగా 200 అనుబంధ సంఘము లేర్పడెను.

కనీసము 18 వ శతాబ్ది ప్రారంభము నుండియైనను నిర్ణీతములయిన నియమములకు లోబడి క్రికెట్ ఆడబడు చుండెను. క్రికెట్ ఆట ప్రారంభమయిన తొలిదినములలో సాంప్రదాయికమయిన అలవాట్ల ననుసరించి మాత్రమే నియమములు, నిబంధనలు నిస్సందేహముగ అమలునం దుండెను. కాని 1744 వ సంవత్సరములో లిఖితపూర్వక మైన నిబంధనావళి రూపొందెను. 1788 వ సంవతర్సము నుండి లండన్ నగరమందలి 'మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్' సాధికారమయిన క్రికెట్ నిబంధనావళీ కేంద్రముగ ప్రపంచమంతట పరిగణింపబడెను. 20 వ శతాబ్ది మధ్య భాగమున జరిగిన క్రికెట్ ఆటలన్నియు 1947 వ సంవత్సరపుక్రికెట్ నియమావళి ననుసరించియే నిర్వహింపబడెను. పైనుదాహరించిన మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్బు ఈనియమావళిని ప్రకటించెను. ఈ నియమావళి పెక్కు వివరణములతో నిర్వచింపబడెను.

మొట్టమొదటిసారిగా భారతదేశమున క్రికెట్ ఆట ఏనగరమున ఎప్పుడు జరిగినదియు ఇదమిత్థముగా చెప్పుట కష్టసాధ్యము. అస లీ ఆట భారతదేశమునకు అపరిచిత మైనదియా, కాదా అని చెప్పుటకూడ కష్టమే. శతాబ్దములకు పూర్వము మొరటయిన క్రికెట్ ఆటను పోలిన దేశవాళీ ఆటయొకటి మనదేశమున ఆచరణములో నుండినట్లు బలమయిన కొన్ని ఆధారములు చాటుచున్నవి. ఈ ఆటయొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి చరిత్ర కారులు ఊహాగానము చేయుచునే యున్నారు. టర్కిస్తాన్ లో మారుమూలనున్న 'హుంజా' అను ప్రదేశమున, ప్రప్రథమమున పర్షియాలో ఉద్భవించిన 'పోలో' అను

129