కోడి రామమూర్తి నాయుడు
సంగ్రహ ఆంధ్ర
జనాకర్షణ యంత్రము - అష్టదిగ్బంధనములు : ఈ కోటప్పకొండదేవాలయము తదితర దేవాలయములవలె మిక్కిలి ప్రశస్తముగా నుండకపోవుటచే శాలివాహన శకము 1681 ప్రమాదినామ సంవత్సర మాఘ శు ౧౫ వ తేదీనాడు శ్రీ రాజా మల్రాజుగుండరాయనింగారి అనుజ్ఞచే బ్రహ్మశ్రీ పినపాటి యేలేశ్వరం అయ్యంగారనువారు ఈ జనాకర్షణయంత్రమును స్థాపనచేసి యీ స్థలరక్షణార్థమై అష్టదిగ్బంధనములను చేసినట్లు తెలుపు శాసనములు మనకు గాన్పించుచున్నవి. అప్పటినుండియీ క్షేత్రమును వేలకు వేలు జనులు దర్శించుచున్నారు.
ధర్మసత్రములు : కొండపైనను, క్రిందను బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, ఆర్యవైశ్యులు మొదలైన కులములవారికి వేరు వేరుగా ధర్మసత్రములున్నవి. వీనిలో యాత్రికులకు ఉత్సవసమయములో ఫలహారములు, భోజనములు పెట్టుచుందురు.
బసవమందిరములు, మఠములు : యాత్రికుల సౌకర్యార్థమై నిర్మింపబడిన బసవమందిరములు, మఠములు ఇక్కడ నున్నవి. చెఱువులు - కుంటలు - బావులు మొదలైన నీటివసతులను యాత్రికుల సౌకర్యార్థమై చాలమంది భక్తులు నిర్మించినారు.
దానధర్మములు : స్వామికి అనేకమంది భక్తులు నిత్యధూపదీప నైవేద్యములకొరకు అనేకభూములను దానము చేసియున్నారు. వీటివలన ప్రతిసంవత్సరము స్వామికి చాలా ఆదాయము వచ్చుచున్నది. దానితో స్వామికి నిత్య సేవలు, ఉత్సవములు, నిరంతరము అఖండదీపము, అభిషేక పూజాదులు జరుగుచుండును.
దేవాలయ పరిపాలన: ఈ దేవాలయ పరిసాలనము 1935 సంవత్సరము వరకు నరసరావుపేట జమీందారుల పాలనక్రింద నుండెను. కాని ఆ తరువాత దీనిని ప్రభుత్వపు ఎండోమెంటుబోర్డువారు తమస్వాధీనములోనికి తీసికొని ఒక మేనేజరును ఏర్పాటుచేసినారు. తద్వారా దేవాలయ నిర్వహణము సాగుచున్నది.
తిరునాళ్ళ : ఆంధ్ర దేశమున జరుగు ముఖ్యమైన పెద్ద తిరునాళ్ళలో కోటప్పకొండ తిరునాళ్ళ యొకటి. ప్రతి సంవత్సరము శివరాత్రికి ఇచ్చట బ్రహ్మాండమైన జాతర జరుగును. దాదాపు రెండుమూడు లక్షలమంది యాత్రికులు వత్తురు. పల్లెగ్రామములనుండి యీ ఉత్సవములను తిలకించుటకును, మ్రొక్కుబడులు తీర్చుకొనుటకును, పెద్ద పెద్ద ప్రభలను గట్టుకొని వత్తురు. ఆ ప్రభలు ఆకాశమునంటుచున్నవో యన్నట్లుండును. అవి చిత్రవిచిత్రపు అలంకారములతో, రంగులతో చూచుటకు కనుల పండువుగా నుండును. వీరంగములు, కోలాటములు, హరి కథలు, పురాణములు మొదలైన కాలక్షేపములు జరుగును. తిరుణాళ్ళసమయమున దాదాపు రెండు మూడు మైళ్ళవరకు జనులు కొండక్రింది భాగమునంతయు ఆక్రమింతురు.
తిరునాళ్ళసమయమున ఇచ్చట బ్రహ్మాండమైన కలప వ్యాపారము, పశువుల సంత జరుగును. భక్తులు స్వామిని సేవించి గృహనిర్మాణమునకును, వ్యవసాయమునకును, పనికివచ్చు సామానులను, పశువులను, క్రయముచేసి తీసికొని పోవుచుందురు.
ఉత్సవ సమయములలో కలపసామానులు మిఠాయి దుకాణములు, బట్టల దుకాణములు, పండ్లదుకాణములు, బొమ్మల అంగళ్ళు, వినోదశాలలు, కాఫీక్లబ్బులు మొదలైన వానితో ఈ ప్రదేశమంతయు ఎంతో కోలాహలముగా నుండును. ఆ సమయమున ఈ ప్రాంతమున మత్తు పదార్థముల విక్రయము నిషేధింపబడును. మంచి పోలీసు బందోబస్తు ఉండును. “కోటప్పకొండ” ప్రసిద్ధ పుణ్యస్థలములలో నొక్కటి.
పు. వెం.
కోడి రామమూర్తి నాయడు (1885-1938):
విశాఖపట్టణము (ఇప్పుడు శ్రీకాకుళం) జిల్లాలో వీరఘట్టము అను గ్రామములో శ్రీ కోడి రామమూర్తి నాయడు 1885 లో జన్మించెను. పోలీసు ఆఫీసరుగా పని చేయుచున్న తన పెదతండ్రియగు కోడి నారాయణ స్వామి నాయడు దగ్గర ఈయన పెరిగెను. ఇతడు చెన్న పట్టణములో వ్యాయామాధ్యాపకుడుగా క్రమమగు శిక్షణము పొందెను. శరీర వ్యాయామము ద్వారమున బలసంపన్నుడగుటయందు ఈతనికి చిన్నతనమునుండి అభిలాష మెండుగ నుండెను, ప్రతి దినము ఇతడును, ఇతని కొందరు మిత్రులును కలిసి గ్రామమునకు బయటనున్న తటాకము నొద్ద వ్యాయామము చేసి తరువాత