Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొల్లేరుసరస్సు

మును పడవేయుచు బోవలెననియు స్వప్నమున ఆ బ్రాహ్మణున కాదేశమిచ్చెను. మరునాడు ఆ బ్రాహ్మణుడు అట్లే వెడలిపోవుచు కొలదిదూరముపోయి వెనుకకు తిరిగి చూడగా పురమంతయు అగాధమగు జలమయమయ్యెనట ! అప్పటినుండి అది కొల్లేరు అని వ్యవహరింపబడు చుండెనట ! ఇది యొక స్థానిక గాథ.

కొల్లేరునందలి పెక్కు దీవులలో నొక దానిని స్వాధీనపరచుకొనదలచిన సేనాని యొకడు ఆ సరస్సులోని నీటిని వెడలగొట్ట దలచెను. అందుకొర కాతడు ఉప్పు టేరును త్రవ్వించెను. ఈ సేనాని కూతురి పేరు “పరెంటలు అవ" అందుచే ఉప్పుటేరు కాలువలలో నొకదానికి “పరెంటలు అవ" అని పేరిడబడెనట !

II

కొల్లేటి సరస్సు చరిత్రాత్మకమయిన జలదుర్గము. ఈ దుర్గము నూటఅరువది రాజహస్తముల వెడల్పును, ఏడు నిలువుల లోతును, మూడుక్రోశములు చుట్టుకొలతయు కలిగిన అగడ్తయు కలిగి మిగుల భయంకరమై యుండును.

మృత్యుదేవతకు భృత్యతతి యనదగిన ముదుసలి మొసళులు అడుగడుగునకు ఒక్కటి చొప్పున అగడ్తయం దుండు చుండును. కోటగోడలు మిగుల బలిష్ఠములై నలువది రాజహస్తముల యెత్తున గగన చుంబితములై యుండెను. గవనులు కుడియెడమలయందు కంచు తలుపులతో తేజరిల్లు చుండెను. శత్రుభీకరమై, దుస్సాధ్యమై, దుర్నిరీక్ష్యమైయున్న యీ జలదుర్గము చాళుక్య నృపాలురలో నొకడగు రెండవ పులకేశి 'అయిహోలు' శాసనమున "కొలనువీ"డని పేర్కొనబడినది. అవ్విధముగ పేర్కొనబడిన శాసనములలో "అయిహోలు" శాసన మొకటి. కునాలశబ్దమే 'కులను', 'కొలను' గా పరిణామ మందినదని శబ్దతత్త్వజ్ఞులు అనుచుందురు. 'కొలను'శబ్దము సంస్కృతీకరింపగా “సరస్సు” అయినది.

రెండవ పులకేశి తన బాహుబల దర్పము వలన వైరివీరులను చీల్చి చెండాడి ఆరక్త మాంసములచే కుణాలుని నీరమును ర క్తిమనుదాల్చి తత్ప్రదేశమంతయు విల్లు నంబులతోడను, మారణాయుధములతోడను వ్యాప్తి కాంచుటచే అప్పటినుండియు అది జలదుర్గమై యొప్పెడిని. ఈ పులకేశి యశశ్చంద్రికలు పశ్చిమమున దూరస్థమైన పర్షియా వరకు ప్రాకినవి. అందుచే, పర్షియారాజు పులకేశి దర్బారునకు కాన్కలతోను, పసదనములతోను రాయబారుల నంపెను. ఇమ్మహానృపుని దండయాత్రల నుండి 'కొలను' విడివడి వేంగీ మహామండలేశ్వరుల స్వాధీనమయ్యెను. తూర్పు చాళుక్య రాజగు బాదపుని నాట బాలాదిత్యుని కుమారుడగు నృపకాముడు ఈ “కొలనువీడు"ను పరిపాలించుచుండెనని విదితము. ఆ పిమ్మట చాళుక్య చోడుని కాలమునను, ప్రథమ కుళోత్తుంగచోడుని కుమారుడగు విక్రమ చోడదేవుని నాటను మాత్రమే కొలనుదుర్గము వినుకలియైనది. ఆ తరువాత విక్రమచోడదేవుని యధికారము అపేక్షించి తెలుగు భీముడు స్వతంత్రుడై స్వతంత్ర పరిపాలనము నెరపెను. వెలనాటిచోళుడు కొలనుపై దండెత్తి ఈ తెలుగుభీముని పరిమార్చి దానిని కైవస మొనర్చు కొనెను. అప్పటి నుండియు తెలుగు నాయకుల పరిపాలనమందే 'కొలను' శబ్దముండుచుండెను. శక వర్ష ములు 1042 - 1054 ( క్రీ. శ. 1120 - 1132) రాజేంద్రచోడుడు కొలనును పరిపాలించిన మొదటి తెలుగునాయకుడని తెలియుచున్నది.

ఇతని పిమ్మట రెండవ కుళోత్తుంగచోళుని సేనానియగు కొలని కోటయ రాజ్యమునకు వచ్చెనని శక వర్షములు 1055 నుండి 1073 వరకుగల శాసనములు అవగతమొనర్చుచున్నవి. శక వర్షములు 1118 నుండి 1153 వరకు (ముప్పదియైదేండ్లు) రాజ్యముచేసిన కొలను కేశవ దేవరాజు కాలమునందే ఇందులూరి సోమయ్య కొలను దుర్గమును జయించి 'కొలనుసోమ' అని విఖ్యాతిచెందినట్లు గనపడుచున్నది. ఈ సోమయ్య కాకతీయ గణపతి చక్రవర్తియొద్ద దండనాథుడును, సచివోత్తముడునై చెలగెను. క్రీ. శ 1228 వ సంవత్సరమున ఓరుగల్లునకు ప్రాగ్భాగమున గల దేశములను - కళింగరాజ్య భాగములను కొన్నిటిని - ఇతడు జయించెనని “శివయోగసార" మందలి-


ఇల బహుసైన్యము ల్గొలువ
         నేకశిలాపురి తూర్పుదిక్కునం
గల రిపుభూము లెల్లఁ గొని
         గర్వముమై...... కాడిమండలీ

93