Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొలంబసు క్రిస్టాఫర్

సంగ్రహ ఆంధ్ర

తయారు చేయలేకుండిరి. యూరపులోని శ్రీమంతులు ఇండియాలో తయారగు వస్త్రములనే గాక ఇక్కడి సుగంధద్రవ్యములను కూడ కొని ఉపయోగించుచుండిరి. అందుచేత హిందూదేశము నుండి యూరపు ఖండమునకు వివిధ పదార్థములను తెచ్చుకొనవలె నన్నచో ఇచటికి సముద్ర మార్గమును ఏర్పరచుకొనవలె నన్న కోరిక యూరపుఖండ వ్యాపారులకు మిక్కుటముగా నుండెను. ఇండియాకు తూర్పుమార్గమున పోవువారిని మహమ్మదీయు లాటంక పరచుచుండిరి. కావున పశ్చిమ మార్గము ననుసరించి ఇండియాకు పోవుట సాధ్యము కాదా యని పశ్చిమదేశస్థులు ఆలోచింప మొదలిడిరి. కొలంబసు తన ఇరువది యేడవయేట పశ్చిమముగా సముద్రపయాణము చేసి ఇండియా మున్నగు ప్రాచ్యదేశములను చేరవలెనని సంకల్పించెను. తెలివితేటలను బట్టి, ధ్రైర్య విశ్వాసములను బట్టి, నావికావృత్తిలో నేర్పును బట్టి ఈ పని కాతడు సమర్ధుడే, కాని ఇది యెంతో వ్యయముతో కూడుకొన్నపని. ఆతనివద్ద డబ్బులేదు. ఆతని ననుసరించు నావికులు లేరు. పైగా ఈ ప్రయాణము క్రొత్తదేశములను కనుగొనుటకు ఉపయోగవడునదేగాని వ్యాపారరీత్యా లాభించునది కాదు. కనుక ఎవరేని రాజును ఆశ్రయించవలెను. తన జన్మస్థలములో సహాయపడువా రాతని కెవరును తటస్థపడలేదు. పోర్చుగీసు రాజకుటుంబమునకు చెందిన హెన్రీ ది నావిగేటర్‌. (Henry the Navigator) అను నాతనిని గూర్చి కొలంబను విని యుండెను. హెన్రీ ఆ కాలమున ఆఫ్రికా తీరమునకు సముద్ర యానములను ఏర్పాటు చేయించి క్రొత్త భూభాగములను కనుగొనుటలో పసిద్ధికెక్కియుండెను. పోర్చుగీసు రాజధానియైన లిస్బను పట్టణమునకు కొలంబసు వెళ్ళి అచ్చట పదేండ్లు నివసించి పటములు, చార్టులు గ్లోబులు తయారుచేసి జీవనము గడుపుచు తన లక్ష్యము సిద్ధించు సదవకాశము కొరకు ఎదురు చూచుచుండెను. ఇచటనే అతడు వివాహము చేసికొనెను. ఆతనికి ఒక కుమారుడు కలిగెను.

కొలంబసు, అతని సోదరుడును స్పెయిన్‌ రాజైన ఫెర్డినాండును సందర్శించి తూర్పు దేశములకు పోవలెనన్న తమ యభిలాషను వెలిబుచ్చిరి. కాని అది తెలివి తక్కువ పనియని రాజుగారి మతవిషయక సలహాదారులు నిరుత్సాహపరచిరి. రాజేమియు సహాయము చేయలేక పోయెను. ఇంగ్లండు వారేమయిన సహాయము చేయుదు రేమోయని కొలంబసు చూచెను. ఫ్రాన్సువారి సహాయమునుగూడ అత డపేక్షించెను. కాని లాభము లేక పోయెను. స్పెయిను రాజుభార్య ఇసబెల్లాకు కొలంబసు ప్రయత్నముపట్ల మొదటి నుండియు సానుభూతి యుండెను. కాని భర్త విముఖుడుగా నుండుటవలన చాలకాలము వరకు ఆమె కొలంబసుకు దర్శనమిచ్చి ఆతని ఊహలను, ప్రతిపాదనలను ఎంతో ఇష్టముగా వినుచుండెనేగాని ఏమియు సహాయముచేయజాలక పోయెను. చివర కామె తన నగలను అమ్మజూపి ధనమును సేకరించి ఇచ్చుటకు సమ్మతించెను. ఫలితముగా కొలంబసుకు మూడు ఓడలు లభించెను. వాటిలో పెద్దదానిపేరు “శాంతమేరియా”. అది నూరుటన్నుల నావ. 52 మంది మనుష్యులను అది తీసికొని పోగలదు. మిగిలిన రెండు ఓడల పేర్లు “పింటా,” “నినా”. ఈ విధముగా కొలంబసు. తన అనుచరులతో 1492 అగస్టు 3 వ తేదీన సముద్ర యానమునకు బయలు దేరెను. ఎంతో దూరము పోయినను వారికి భూమి కన్పించలేదు. మార్గ మధ్యములో అతని అనుచరులు ధైర్యము కోల్పోయి తిరుగుబాటు చేయుచు కొలంబసుకు ప్రతి బంధకములు గల్పింప జొచ్చిరి. కాని కొలంబసు వజ్ర సంకల్పముతో అట్లాంటిక్‌ మహా సముద్రము మీదుగా రెండు నెలలు ప్రయాణముచేసి ఒక ద్వీపమునకు చేరెను. దాని కాతడు శాన్‌ సెల్వడార్‌ అని పేరు పెట్టెను. కొలంబసు తాను ఇండియా చేరినట్లూహించెను. కాని అది ఇండియాకాదు. అది బహామా దీవులలో నొకటి. అచటి మనుష్యులు ఎరుపు, గోధుమ వర్ణము కలిసిన దేహచ్ఛాయ గలవారగుటచే కొలంబసు వారికి 'ఎర్ర ఇండియనులు' అని పేరు పెట్టెను. 1493 ఫిబ్రవరిలో కొలంబసు తిరిగి న్వదేశమునకు ప్రయాణమై వెళ్ళెను. స్పెయిను రాజుకు బహుమానములుగా అతడు బంగారమును, ప్రత్తిని యూరపులో లేని కొన్ని జంతువులను, పక్షులను తీసికొని వెళ్లెను. స్పెయిను ప్రజలు కొలంబసుకు, అతని అనుచరులకు ఘనముగా స్వాగత మిచ్చిరి.

86