Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరియాదేశము (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర

పెక్కు గాథలు, ఐతిహ్యములు ప్రచారమందుండెను. ఒక ఐతిహ్యము ననుసరించి, సృష్టికర్తయొక్క కుమారుడైన హ్వానంగ్ అనునతడు భూమండలమునకు దిగివచ్చి, ఎలుగుబంటుగా నుండి అప్పుడే మానవాకారమును ధరించిన ఒక అందగత్తెయగు స్త్రీని వివాహ మాడగా, ఆమెకు టాంగాన్ అను నొక పుత్రుడు జనించె ననియు, అతడే కొరియా దేశమునకు మొదటి ఏలిక యయ్యెననియు తెలియుచున్నది. ఈ రాజవంశము క్రీ. పూ. 1122 వ సం॥ వరకు కొరియాను పాలించి అంతరించెను.

చరిత్రాత్మకమైన మరియొక గాథను బట్టి 'కిజ' అను ఋషితుల్యుడైన ఒక చైనా విద్వాంసుడు 5,000 మంది అనుచరులతో కొరియాలో ప్రవేశించి, ప్రస్తుతము ఉత్తర కొరియాకు రాజధాని నగరమైయున్న 'ప్యోంగ్‌యాంగ్ ' కేంద్రముగా కొరియాను కొంతకాలము పాలించి, రెండవ రాజవంశమునకు మూలపురుషుడయ్యెనని విదిత మగుచున్నది. ఈరెండవ రాజవంశము క్రీ. పూ. 193 వ సం॥ వరకు కొరియాను పాలించెను. ఈ కాలమున కొరియా ఉన్నతమైన నాగరిక దశ ననుభవించినట్లు ఆధారములు కలవు.

'కిజా' రాజవంశముచే పాలింపబడిన ప్రాంతమంతయు క్రమముగా చైనా యోధుడగు 'వై మాన్' అనునతనికి అధీనమయ్యెను. అది తుదకు క్రీ. పూ. 108 వ సం॥లో చైనా ప్రభుత్వమునకు వశమయ్యెను. చైనీయు లారాజ్యమును ఉత్తర కొరియా యందలి నలుమూలల వరకు విస్తృత మొనర్చి, దానిని నాలుగు మండలములుగా విభజించిరి. 'ప్యోంగ్ యాంగ్' రాజధానిగా ఏర్పడిన 'లోలంగ్' అను మండలము ఆనాల్గింటిలోను అత్యంత వైభవమనుభవించి నట్లు తెలియుచున్నది. అనంతర కాలమున, ఈ మండలము సర్వస్వతంత్రమైన రాజ్యముగా పరిణామము చెందినది.

దక్షిణ కొరియా, ఆదినుండియు 'హాన్' అనబడు విభిన్నములైన మూడుజాతులచే పాలింపబడుచువచ్చినది. ఈ జాతులు చైనా వారి అధికార ప్రభావమునకు లోబడక స్వతంత్ర ప్రతిపత్తి ననుభవించుచుండినవి. ఐనను చైనావారి సంస్కృతి వలన వీరు అధికముగ ప్రభావితు లయిరి. మాహాన్, చిన్ హాన్, ప్యోన్‌హాన్ అను నామములతో ఈజాతులు వ్యవహరింపబడుచుండెడివి. ఒక్కొక్క జాతిలో పెక్కు తెగలు, కుటుంబములు గర్భితములై యున్నను, మూడును మూడుప్రత్యేక మైన సమాఖ్యలుగా అధికారము చలాయించు చుండెను.

త్రిరాజ్యయుగము : గ్రంథస్థమైన కొరియా ప్రాథమిక చారిత్రకదశ 'త్రిరాజ్యయుగమ'ని వ్యవహరింపబడు చున్నది. ఈ యుగము క్రీ. పూ. 57 వ సం. తో ఆరంభమైనట్లు తెలియుచున్నది. కారణమేమన, ఆ సంవత్సరమందే దక్షిణకొరియా యందలి 'చిన్‌హాన్' మండలమున 'సిల్లా' అను పేర ఒక రాజ్యము స్థాపింపబడినది. క్రీ. పూ. 37 వ సం. లో 'ప్యోన్ హాన్' సమాఖ్య ప్రభుత్వము ‘సిల్లా’ లో విలీనమయ్యెను. ఉత్తరకొరియాలో పూర్వము చైనీయుల అధీనమందుండిన మండలమందు క్రీ. పూ. 37 వ సం. న 'కోగుర్యో' అను పేరుతో మరియొక రాజ్యము స్థాపితమయ్యెను. క్రీ. శ. 300 వ సం. లో 'లోలాంగ్' అను చైనావలస ప్రాంతము 'కోగుర్యో' రాజ్యముయొక్క అంతర్భాగమయ్యెను. 'పాక్చే' అను మూడవరాజ్యము నైరృతి కొరియాలోని 'మాహాన్’ మండలమందు క్రీ. పూ. 18 వ సం. లో ఏర్పడెను. కాగా, క్రీ. శ. 42 వ సం. నుండి, 562 వ సం.రము వరకు కొరియాయొక్క దక్షిణాగ్రమున (నేటి 'పూసాన్’ నగర పరిసరములలో) 'కరక్' అను నాల్గవరాజ్యము నెలకొని యుండెను. ఇది కొంతకాలమువరకు జపాను సామ్రాజ్యము క్రింద వలసప్రాంతముగ నుండి తుదకు ‘సిల్లా'లో లీనమయ్యెను.

ఈ మూడు రాజ్యములు 700 సంవత్సరములకు పైగా ఎడతెగక ఒండొంటితోయుద్ధములు చేయుచునేయుండెను. ఇట్లుండగా అదే సమయములో 'సిల్లా' పై జపాను పెక్కు పర్యాయములు దాడులు సల్పెను. అనంతరము క్రీ. శ. 660 వ సం. లో ‘పా క్చే’ రాజ్యమును, 668 లో 'కోగుర్యో' రాజ్యమును 'సిల్లా' అధికారముక్రిందికి పోయెను. సాటి రెండు రాజ్యములపై దాడి వెడలిన ‘సిల్లా' ప్రభుత్వమునకు చైనా అధికముగ సహాయమొనర్చెను. 'సిల్లా' అను పేరుతో కొరియా ద్వీపకల్పమంతయు ఒక అఖండ రాజ్యముగ క్రీ. శ. 935 వ సం. వరకు వర్థిల్లెను. ఈ కాలమున కొరియాలో బౌద్ధమత సమన్వితమైన చైనాసంస్కృతి

76