Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొరియాదేశము (చరిత్ర)

గురిలో నొకరు కార్యదర్శిగా నెన్నుకొనబడుదురు. దేవాలయమునకు చెందిన సర్వవిషయములను ఈకమిటీయే నిర్వహించుచున్నది. వచ్చిన ఆదాయములో మూడింట నొకవంతు పూజారుల కీయబడును. వ్యయమంతయు కాగా మిగిలిన ధనము కమిటీ స్వాధీనములో నుండును. ఇట్టి ధనముతో క్రొత్తగదులు, దేవాలయము ముందున్న కోనేరు బావికి రాతికట్టడము, యాత్రార్థమై వచ్చిన స్త్రీలకు స్నానార్థము మరుగుగా నుండుటకు గదికివలె నిలువెత్తు గోడలు, వాటిమధ్య విశాలమయిన 'హవుజు' (తొట్టి) మొదలయినవి కట్టబడినవి. అద్దాల మండపనిర్మాణము, దేవాలయావరణ విస్తరణము, ముందు ముందొక సంస్కృత పాఠశాల నిర్మాణము, గ్రంథాలయ నిర్మితి మొదలయిన ప్రజోపయోగకరమైన కార్యములను చేయుతలంపు ఈ కమిటీవారికి కలదు.

ఇక్కడ శివరాత్రి మొదలుకొని వారమురోజులవరకు జాతర యొకటి జరుగును. కళ్యాణోత్సవములు, ఇతరోత్సవములు ఉగాదిదాక సాగుచునే యుండును. ఈ వీరభద్రస్వామివద్దకు ఎక్కువగా రోగములుపోగొట్టుకొనుట కొరకును, సంతానము పొందుటకొరకును యాత్రికులు వచ్చుచుందురు. ఈకోర్కెలుగలస్త్రీలు, పురుషులు స్నానము చేసి, దేవాలయమునందలి ధ్వజస్తంభమునకు ముంగిట ప్రాణాచారములు పడియుందురు. ఇది నిత్యకృత్యము. భక్తులకు స్వప్నదర్శనమువలన కాని, ఆవేశితులయిన వారి వలన కాని, స్వామి ఆజ్ఞ లభించును. ఆజ్ఞ లభించువరకు భక్తులు తమ తమ ఇండ్లకు వెళ్ళు నాచారములేదు.

జాతర దినములలో ఆదాయము ఎనిమిదివేలకు తక్కువకాకుండ నుండును. ఈ ఆదాయము వస్తురూపమున, పశురూపమున, ధనరూపమునకూడ నుండును. దేవునికి మ్రొక్కుల రూపమున కోడె లెక్కువగా లభించుట ఇక్కడి ప్రత్యేకత. సంతానము పొందినవారును, దేవునికి విశేషముగా కోడెలను సమర్పింతురు. కోడెలను విక్రయించుటచే వచ్చిన ధనము, 'డబ్బీ'లో పడు ధనము, హారతి పళ్ళెములో లభించుధనము చేరి పైని పేర్కొనబడిన ఆదాయము ఏర్పడుచున్నది. ఇతర దినములలో భక్తుల వలనను, ఏటేటా భూములమీదను వచ్చు ఆదాయము దాదాపు నాలుగైదువేల రూప్యముల పరిమితి కలదిగా నున్నది. అనగా సాలునకు ఈ దేవాలయాదాయము పన్నెండువేల నుండి పదిహేనువేల పరిమితిగలదై యుండును.

జాతరజరుగు దినములలో సువిశాలములును, సుదీర్ఘములును అయిన పందిళ్ళు వేయబడును. యాత్రికుల కొరకు కొన్ని దడులు, చలివేంద్రలును కూర్చబడును. దేవాలయమునకు ముందున్న విశాలమయిన మైదానము జాతర జరుగు సమయమున బండ్లతో నిండియుండును. ప్రకృతి సిద్ధమైన పందిళ్ళవలె పెద్ద పెద్ద వృక్షములు గూడ అచట నున్నవి. దేవాలయము మొదలుకొని దాదాపు రెండు మూడు ఫర్లాంగుల దూరమువరకు దారికి ఇరువైపులను వివిధములైన 'దుకాణములు' వ్యాపించి యుండును. కొండపల్లినుండియు, తదితర ప్రదేశముల నుండియు బొమ్మలసామగ్రి ప్రచురముగా ఇచ్చటికి దిగుమతి యగును. ఆలయమునకు కొద్ది దూరముననే ఉన్న పెద్దచెరువు యాత్రీకుల స్నానపానములకు నీటి సమృద్ధిని కల్పించుచున్నది. తియ్యని నీటి బావులు గూడ చుట్టుప్రక్కల నున్నవి. జాతర జరుగునాడు రథోత్సవము జరుగును. ఆనాడు కొరవియంతయు జన సముదాయముతో పిక్కటిల్లిపోవును. ఆనాటి జనసంఖ్య పదివేలకు మించును. జాతరలలో రథోత్సవమునాడే అధికాదాయము లభించును. ప్రభలుకూడ ఇక్కడకు విరివిగా వచ్చును. జాతరలు జరుగునపుడు హరికథలు, బుఱ్ఱకథలు మొదలయిన వినోదక్రియలు సాగుచుండును. కవి సమ్మేళనాది సాహిత్య సమావేశములును సాగును. ఈ జాతర జరుగు కాలమున మహబూబాబాదునుండి బస్సులు అధికముగా నడుపబడును. బండ్ల సందడికూడ అపరిమితముగనుండును. మహబూబాబాదులోని జనులెల్ల జాతర దినములలో కొరవిలోనే వసింతురు. ఇంత భవ్యమైన జాతర తెలంగాణములో మరెక్కడను జరుగదు.

ఈ ఆలయాదాయ మింకను ముందు ముందు పెరిగినచో తిరుపతివలె ఇదికూడా ఒక విద్యాపోషక సంస్థగా మారగలదని తోచును.

కె. సం. ఆ.


కొరియాదేశము (చరిత్ర) :

ప్రాచీన చరిత్ర : కొరియాదేశము యొక్క ప్రాదుర్భావమును గూర్చి క్రీ. పూ. 2333 వ సం॥ నుండియు

75