Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొరవి వీరభద్రుడు

సంగ్రహ ఆంధ్ర

ప్రస్తుతము కొరవి యనునది గ్రామమే. కాని పూర్వ మది పెద్ద పట్టణముగా నుండెనని తెలియుచున్నది. ఈ ప్రాంతమంతయు ‘కొరవి దేశము'గా వ్యవహరింపబడు చుండెడిది. ఈ కొరవిదేశము కొరవి, గూడూరు శాసనములలో పేర్కొనబడి యున్నది. తొమ్మిదవ శతాబ్దములో కొరవిదేశము వేంగీ సామ్రాజ్యభాగముగా నున్నట్లును, అప్పుడు చాళుక్యభీమ విష్ణువర్ధనునితో (898-918) “రణమర్దాన్వయ కులతిలకుడైన కుసుమాయుధుని పెద్దకొడుకు అర్థరాజ్యంబు చేయుచున్నట్లు"ను కొరవి శాసనము తెలుపుచున్నది.

విరియాల వంశజుడగు ఎఱ్ఱ నరేంద్రుడు బొట్ట బేతరాజు పక్షము వహించి, అతనిని కొరవి దేశమునకు ప్రభువుగా చేసినట్లును, తరువాత ఎఱ్ఱ భూపతి భార్య కామసానమ్మ బేతరాజును కాకతికి ప్రభువుగా చేసినట్లును, పద్యమయమగు గూడూరు శాసనము తెలుపుచున్నది. ఈ బొట్ట బేతరాజు మొదటి బేతరాజుగా గనుపడు చున్నాడు. మొదటి బేతరాజు కాలము క్రీ. శ. 975-1050 కాన ఈ శాసనము ఆంధ్ర మహాభారతమునకు పూర్వము పుట్టినదిగా భావింపవలెను.

“కొరవి" పట్టణము రాజధానిగా నుండుటబట్టియే ఆ ప్రాంతమునకు కొరవిదేశమని పేరువచ్చియుండెను. కొరవి పట్టణనివాసులగు కొందరకు “కొరవి” అనునది గృహనామముగా ఏర్పడినది. కొరవి శాసనములో కొరవి నల్లజెఱెయ, అతని కొడుకులు పెద్దన, భీముడు, గాణగయ్య అనువారినిగూర్చి ప్రశంసకలదు. పెద్దన కొరవిలో శిలా స్తంభము ప్రతిష్ఠించినట్లు ఆ శాసనము నందు గలదు. 'ద్వాత్రింశత్సాల భంజిక ' ను రచించిన కొరవి గోపనామాత్యుని ఇంటిపేరు ఈ గ్రామమును బట్టియే వచ్చియుండును.

కొరవి పట్టణము తొమ్మిదవ శతాబ్దినుండి చారిత్రక ప్రసిద్ధి కలదిగా గనబడుచున్నది. కొరవి పట్టణమునుండి రాజధానిని కాకతిపురమునకు మార్చిన నాటినుండి కొరవి పట్టణ ప్రాధాన్యము క్షీణించినట్లు తేలుచున్నది. ఈశాసనములలో ఎంతమాత్రమును వీరభద్రదేవుని ప్రసక్తి లేదు.

వీరభద్ర ప్రసక్తి గల శాసన మొకటి యున్నది. కాకతీయ పురవరాధీశ్వరు డగు గణపతిదేవ చక్రవర్తి వేయించిన శాసన మది. వరంగల్లుజిల్లాలో ఖాన్‌సాహేబ్ తోట వద్ద అది యుండినది. దానిలో శ్రీ గణపతిదేవ చక్రవర్తి సర్వధారి సంవత్సర శ్రావణ శుద్ధ పంచమీ యుక్త గురువారమునాడు శ్రీ వీరభద్రేశ్వర దేవరకు అంగరంగ వైభవముల నిమిత్తమయి, సరకులమీద తాను విధించిన సుంకమును అర్పణము గావించిన ట్లున్నది. సరకుల సుంకముల వివరములు ఆ శాసనములోనే యున్నవి. అయితే శాసనగత వీరభద్రుడే కొరవి వీరభద్రుడనుటకు ఆధార మందులో లేదు. కాని ఈ వీరభద్రునివలె సుప్రసిద్ధుడును, విశిష్టుడును అయిన మరొక వీరభద్రుడు ఎచ్చటను లేకపోవుటచే, ఈ వీరభద్రుడే శాసనగతు డయిన వీరభద్రుడని భావింపబడుచున్నది. మరియు ఈ వీరభద్రునే ఈ ప్రాంతములో కాకతీయుల నాటి వానినిగా భావించుచున్నారు.

ఈ సందర్భమున ప్రస్తావింపబడతగిన విషయ మొకటి కలదు. ఇక్కడి వీరభద్ర దేవాలయమునకు వెనుక భాగమునందు కొంచెము కుడిప్రక్కగా ప్రస్తుత మొక దిబ్బ యున్నది. దానిని ఇక్కడివారు 'త్రిశంకు దిబ్బ' లేక 'త్రిశంకు గద్దె' యని వ్యవహరింతురు. ఈ దిబ్బ చాళుక్య వంశములోని 'త్రిశంకు' డను రాజుయొక్క శిథిలమయిన దర్బారు గృహమని చెప్పుదురు. దీని కాధారముగా ఈ దిబ్బకు చుట్టు పూడిపోయిన ఒక పెద్ద పురాతనమైన ఇటికల గోడ యున్నది. మరియు ఈ దిబ్బ నానుకొని యున్న యొక కొండరాతిపై విఘ్నేశ్వర, దత్తాత్రేయ, శివ విగ్రహములును, మరి రెండు విగ్రహములును దాదాపు ఒక అడుగు వెడల్పు, మూడడుగుల పొడవుగల స్థలములో చెక్కబడి యున్నవి. (శివ విగ్రహముయొక్క వక్షము, ముఖము చెక్కి వేయబడి యున్నవి). వీటి చెక్కడము పురాతనత్వమునే సూచించు చున్నది. కాని త్రిశంకుడను వ్యక్తి చాళుక్యవంశములో గాని, ఆంధ్రచరిత్రలో గాని ఉన్నట్లు చరిత్రకు సంబంధించిన ఆధారములు కనిపించుట లేదు.

అయి తే సందర్భ మిట్లయి యుండును. కార్తికేయుడు, గణపతి, వీరభద్రుడు మొదలయిన దేవతలు, శివాలయముతో అనుబంధములేని ప్రత్యేక స్థలములం దుండెడి యాచారము లేదు. ఇక్కడ వీరభద్రాలయ మొక్కటే

72