విజ్ఞానకోశము - 3
కొరవి వీరభద్రుడు
అను పదమునందలి ఫలాని శబ్దమునకు 'అముక' అనుట ఇత్యాదులు ఉదాహరణములు.
లక్ష్మణరావుగారు సంస్కృతము, ఆంధ్రము, మహారాష్ట్రము, హిందీ, బెంగాలి, కన్నడము మొదలగు భాషలయందు ప్రవీణులై యుండిరి. “ద్రావిడ భాషలలోని ఉత్తమ పురుష వాచక సర్వ నామము” అను వ్యాసమువలన శ్రీవారు ఆయా భాషల మర్మములను గూడ తెలిసినవారని స్పష్టమగుచున్నది. ఈ వ్యాస చర్చ యందు తెలుగు, అరవము, కన్నడము, మలయాళము, తుళు, గోండు, కోదు, కురుఖు, సంస్కృతము, హిందీ, బెంగాలి, పాలి, ప్రాకృతము అను 14 భాషలలోని పద సామ్య విచారణ కావింపబడినది. ఇక అతి విస్తరమేల?
శ్రీ లక్ష్మణరావుగారు పూర్వుల మత విశ్వాసములను ఆక్షేపించుటకు మనకు అధి కారములేదని చాటియున్నారు. మత సహనము అను విషయములో లక్ష్మణరావుగారినే ముందుగ పేర్కొనవలయును. “ఒకరి మతము లొకరికి అసమ్మతములగుట స్వాభావికము. ఇంత మాత్రముచే నొకరి నొకరు నిందింప గూడదు. మైసమ్మను బూజసేయు వారిలో సజ్జనులు లేరా ? ఇంతయేల? నాస్తికులలోను సజ్జనులు లేరా ? అందరకును మతద్వేషాభావంబు ఉండ వలయును.” అని లక్ష్మణరావుగారు సూక్తీకరించి యున్నారు. అట్లు సూక్తీకరించుటయేగాదు. తమ రచనల యందు ఈ గుణమును ప్రస్ఫుటముగ జూపి యున్నారు. అద్వైతములు, అవతారములు, అధర్వవేదము, అష్టాదశ పురాణములు మున్నగు శ్రీ వారి రచనలు హిందూ ధార్మిక విషయములు. వీటి సందేశములు స్పెన్సరియ యజ్ఞేయ వాదుల పంథాకు చెందియున్నట్టి లక్ష్మణరావుగారికి విశ్వసనీయములు గానట్టివే. వీరు తలచియున్నచో వీటి చర్చయందు హిందూ ధర్మమును వెక్కిరించుటకు అవకాశములు దొరకకుండెడివి కావు. అట్లు వెక్కిరించుచు వ్రాసినవారు లేకపోలేదు. లక్ష్మణరావుగారు అట్టి నిరర్థక చర్చలనుమాని, తాత్త్వికదృష్టితో, శాస్త్రీయ పద్ధతిలో వాటిని చర్చించియున్నారు. లక్ష్మణరావుగారు ఆయా మతాభిమానులు గాకపోయినను వారి విషయ వివరణ కౌశల్యము నిరుపమానమైనది. అందుచే ఆయా మతానుయాయులు తాము గూడ స్వీయమతములను గూర్చి అందరికంటె ఎక్కుడు అభిమానపూర్వకముగా, పక్షపాతరహితముగా వ్రాయజాలమని తలచిమెచ్చుకొను నంత యోగ్యముగా ఆయా మత విషయక వ్యాసములను శ్రీవారు రచించియున్నారు. సర్వజన రంజకమైనది లక్ష్మణరావుగారి రచనా పద్ధతి. సత్యాన్వేషణమే వలయును కాని పక్షాభిమానము వలదు అనునదే శ్రీవారి సిద్ధాంతము.
లక్ష్మణరావుగారు ఎప్పుడును మహారాష్ట్రుల నేపథ్యమునే ధరించెడివారు. మెడ మూసిన పొడుగుకోటు. శిరో వేష్టనము, కుడిచంక క్రింది నుండి ఎడమ భుజము మీదికి వల్లెవాటుగా ఉ త్తరీయము, లాగు లేక పింజె పెట్టి కట్టిన ధోవతి. ఇది శ్రీవారి నేపథ్య విధానము.
శ్రీ లక్ష్మణరావుగారు పరిశోధన కార్య భారమున క్రుంగి ఆరోగ్యము చెడి రుధిరోద్గారి సంవత్సర నిజ జ్యేష్ఠ బ ౧౪ గురువారము నాడు రాత్రి (జులై 13,1923) రెండు గంటలకు భౌతిక కాయమును వీడి శివసాయుజ్యము నొందిరి.
శ్రీ లక్ష్మణరావుగారిని గూర్చి కొందరు మహనీయుల వాక్యము లీ దిగువ పొందుపరచ బడినవి:
"ఈయన వ్యక్తి కాదు. ఒక సంస్థ అనవచ్చు.”
"లక్ష్మణరావుగారు అనే సంస్థను పూర్తిగా అర్థం చేసుకోవడం హిమాలయాలకు జాగ్రఫీ వ్రాయటం వంటిది.”
'లక్ష్మణరావుగారు నవ్యాంధ్ర సంస్కృతీప్రవర్తకులు.’
కొరవి వీరభద్రుడు :
తెలంగాణములోని పుణ్యక్షేత్రములలో - వరంగల్లు జిల్లాకుచెందిన మహబూబాబాదు (మానుకోట) తాలూకా లోని “కొరవి” మేటియైనది. ఇది మహబూబాబాదునకు ఆరుమైళ్ళు దూరముననున్నది. ఇక్కడి జనాభా దాదాపు 5 వేల వరకుండును. ఇక్కడి దేవుడే వీరభద్రుడు. కొరవియను గ్రామము ప్రస్తుతము ఈ వీరభద్ర దేవాలయము మొదలుకొని తూర్పుగా వ్యాపించి యున్నది. పూర్వము ఈ గ్రామము దేవాలయము మొదలుకొని పశ్చిమదిశగా నుండి యుండెనట. కాని అది దగ్ధమయి పోవుటచే తూర్పుగా పెరిగినదని యందురు.
71