విజ్ఞానకోశము - 3
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
చంద్రగుప్త చరిత్రము నందును, విమలాదేవి అను నవల యందును శ్రీవారి లేఖనీ విన్యాసము ఎంతయో కల దనుట స్పష్టము.
శ్రీ వా రొక జంగమ విజ్ఞాన సర్వమనుట సహజోక్తియే. వీరికి తెలియని విజ్ఞాన విషయము ఏదియైన నున్నదా యని తర్కించినప్పుడు 'లేదు' అని గట్టిగా చెప్పవచ్చును. శ్రీవారికి ప్రకృతిశాస్త్ర విషయములు, అర్థశాస్త్ర విషయములు, భాషా కావ్యాలంకార విషయములు, లలితకళా విషయములు, చారిత్రక విషయములు మున్నగు నూరారు విజ్ఞానశాఖా విషయములలో కూలంకష ప్రజ్ఞ కలదు. అట్టి విషయములను గూర్చి నిర్దుష్టముగను, సాధికారముగను, సులలితముగను లక్ష్మణరావుగారు వ్రాయగలవారనుటకు ఆంధ్రభాషా ప్రపంచమందు వారి పెక్కు రచనలే దృష్టాంతములు. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలలో వీరేశలింగం పంతులుగారి స్వీయచరిత్రయు, చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రయు వెలువడుటకు శ్రీ లక్ష్మణరావుగారి ప్రభావమే ముఖ్యకారణము. శ్రీవారి సౌజన్యము, పరోపకారశీలము, ఆలోచనాసంపత్తి చిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రయొక్క ఆవిర్భావమునకు ప్రధాన హేతువులయ్యెను. ఇంతటి మేధావియొక్క సేవాసౌభాగ్యమును కోల్పోవుటచే విజ్ఞానచంద్రిక క్షీణించి క్షీణించి అంతరించినది.
విజ్ఞానమును వెదజల్లుట కై 1910 వ సంవత్సరము నందు విజ్ఞాన చంద్రికా పరిషత్తును ఏర్పాటు చేసిరి. ఈ పరిషత్సంఘపక్షమున, సాహిత్యములో, చరిత్రములో ప్రకృతిశాస్త్రములో పోటీ పరీక్షలు పెట్టి బహుమతు లిచ్చుచుండిరి.
లక్ష్మణరావుగారికి గల విజ్ఞానభాండారము అపారమైనది. ఆ భాండారములోని విజ్ఞానమును ఆంధ్ర జనులకు పంచిపెట్టవలయునను ఆకాంక్ష మెండుగా నుండెను. విజ్ఞాన చంద్రికారంగము శ్రీ వారికి తగినంత వ్యాసంగము నిచ్చుట లేదు. కావున వీరు “ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ” రచనోద్యమమునకు ఉపక్రమించిరి. ఇది కడుంగడు సాహసోద్యమము. ఇది వీరి అపూర్వ రచనా విధాన సంధానమునకును, సర్వంకష ప్రజ్ఞాపాటవ ప్రకటనమునకును గీటురాయి. అకారాదిగ విషయ నిర్ణయముచేసి నెలకు నూరు పుటల చొప్పున ప్రకటింపసాగిరి. సుమారు రెండువేల పుటల పరిమితిగల మూడు సంపుటములు ప్రకటితము లయినవి. ఈ మూడు సంపుటములలో సుమారు 1000 వ్యాసరాజములు కూర్పబడినవి. ఒక్క "అ" అను అక్షరము మాత్రమే పూర్తి అయినది.
శ్రీ లక్ష్మణరావుగారి రచనలు ఆంధ్రవిజ్ఞానసర్వస్వము నందలి మూడు సంపుటములలో 35 కలవు. ఇందు భాషా విషయక ములు 11, గణితవిషయకములు 2, ధర్మశాస్త్ర విషయకములు 9. జ్యోతిశ్శాస్త్ర విషయకము 1, చరిత్ర విషయకములు 7, ప్రకృతిశాస్త్ర విషయకములు 2, కళా విషయకము 1, రాజకీయశాస్త్ర విషయకము 1, తర్కశాస్త్ర విషయకము 1, ఈ 35 వ్యాసముల పరిమితి విజ్ఞానచంద్రికా గ్రంథముల రూపములో, 2500 పుటలగును. కొన్ని వ్యాసమంజరులుగను, కొన్ని ప్రత్యేక గ్రంథములుగను, విడివిడిగా ప్రకటించి ఆంధ్రభాషలో చిరస్థాయులుగాను నిలుపదగిన యోగ్యత కలిగి ఉన్నవి. వీ రప్పుడప్పుడు పత్రికలకు వ్రాసిన వ్యాసములలో కొన్ని “లక్ష్మణరాయ వ్యాసావళి" అనుపేర గ్రంథరూపమును దాల్చి యున్నవి. వీరి రచనల నన్నింటిని పది సంపుటములలో కూర్పనగును. ఆంధ్రభాషకు అలంకారముగా నుండు వాఙ్మయ మిది.
పరిశోధన కార్యము నందు లక్ష్మణరావుగారు ప్రజ్ఞా నిధులని నుడువుటకు ఎంత మాత్రము సందేహము లేదు. ఇది ఆంధ్రులు, ఆంధ్రేతరులు అంగీకరించిన విషయము. చారిత్రక పరిశోధనము నందు శ్రీవారు ఆరితేరినవారు. పురాతన శాసనములను చదువుట, అందలి అంశములను చర్చించుట, పరస్పర విరుద్దాంశములను సమన్వయించుట లక్ష్మణరావుగారికి వెన్నతో బెట్టిన విద్యయా అనిపించును. శ్రీవారు చేసిన నిర్ణయములను చరిత్ర పరిశోధకులు ప్రమాణముగా అంగీకరించి ఉదాహరించు చున్నారు. తమకు తెలిసిన అంశములను బహిరంగ పరచుట వీరిలో గల విశిష్ట గుణము. సత్యాన్వేషణము చేయుటయు, సత్యమును దాచకుండుటయు, శ్రీవారి పరిశ్రమ యందు రాజమార్గములు. వీరి శాసనపరిశోధన వాఙ్మయము కూడ ఒక బృహత్సంపుటము కాగలదు.
69