కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
సంగ్రహ ఆంధ్ర
వీథిని నిర్మించుకొనుచు ఉవ్విళ్ళూరు చిత్తవృత్తి లక్ష్మణరావు గారికి లేకుండెను.
మహారాష్ట్ర దేశమున విద్యాసంపాదన కృషి పూర్తియయి, ఎం. ఏ. పరీక్షయందు కృతార్థులయినతోడనే లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును ఆంధ్రదేశమునకు మార్చిరి.
కృష్ణా జిల్లాలోని మునగాల జమీందారికి లక్ష్మణరావుగారి జనకులగు వేంకటప్పయ్యగారు దివానుగానుండి కార్యదక్షతతో జమీందారీ వ్యవహారములను నిర్వహించి యుండిరి. తండ్రిగారి మరణానంతరము కొంతకాలమునకు లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును మహారాష్ట్రమునుండి ఆంధ్ర దేశమునకు మార్చినప్పుడు మునగాల పరగణా జమీందారులగు శ్రీ రాజా నాయని వేంకటరంగారావు బహద్దరువారు శ్రీ లక్ష్మణరావుగారిని ఆహ్వానించి తమ సంస్థానమునకు దివానుగా నియమించుకొనిరి. రాజు వివేకశాలి; నూత్నభావ సమన్వితుడు. మంత్రి విద్యాధికుడు; నూత్నవిజ్ఞాన శోభితుడు. వీరిద్దరును రాజు, మంత్రివలె గాక కృష్ణుడు, అర్జునుడు వలె గాఢమైన మైత్రి కలవారుగా నుండిరి. శ్రీ రాజా వారు లక్ష్మణరావుగారి ఆంధ్ర వాఙ్మయ వికాసోద్యమమునకు సంబంధించిన ప్రయత్నారంభములకు విశ్రాంతి స్వేచ్ఛల నొసగుటయేగాక మానసికముగను, ఆర్థికముగను సంపూర్ణమైన సహకార మొనర్చిరి. లక్ష్మణరావు సాహచర్యమున శ్రీ రాజావారు ఆంధ్ర భోజుడుగా వర్తించి కీర్తిసముద్రులైరి.
శ్రీ రాజావారికిని లక్ష్మణరావుగారికిని నిజాంరాష్ట్రములోని తెలంగాణముతో పెక్కు సంబంధము లుండెను. హైదరాబాదునకు వచ్చినపుడు వీరిద్దరికిని శ్రీ రావిచెట్టు రంగారావుగారితో పరిచయము కలిగెను. ఈ త్రిమూర్తులును తెలంగాణములోని ఆంధ్ర భాషాస్థితిని బాగుపరచుటకు మంతనములు సలిపిరి. తత్ఫలితముగా శ్రీకృష్ణ దేవరా యాంధ్రభాషా నిలయము హైదరాబాదులో 1 - 9 - 1901 లో స్థాపితమయ్యెను. అఖిలాంధ్ర దేశములో అధునాతన పద్దతులమీద స్థాపితమయిన మొట్టమొదటి ప్రజా గ్రంధాలయ మిదియే. ఈ గ్రంథాలయ స్థాపనకు స్ఫూర్తి నిచ్చినవారు లక్ష్మణరావుగారు ; ధనమునిచ్చిన వారు శ్రీ రాజావారు; కార్య నిర్వాహకులు శ్రీ రావిచెట్టు రంగారావుగారు. శ్రీ లక్ష్మణరావుగారు ఆంధ్రదేశమందు అడుగిడగనే మొట్టమొదట చేసిన మహాకార్య మీ ఆంధ్రభాషా నిలయ స్థాపనమే. ఈ ఆంధ్రభాషా నిలయము ఈ అరువది సంవత్సరములలో క్రమాభివృద్ధి చెంది దివ్యమై, తేజోవంతమై ప్రఖ్యాతి కెక్కియున్నది. ఇది తెలంగాణము నందలి ఆంధ్రులకు కనువిప్పు చేసి విజ్ఞానభిక్ష పెట్టి మహోద్యమములకు దారి తీసినది. ఇప్పటికిని ఈ ఆంధ్ర భాషానిలయము ఆంధ్ర భారతికి ప్రధాన నర్తనశాలగా ప్రకాశించుచున్నది.
ఆంధ్రభాషా నిలయ స్థాపనతో తృప్తిపడక లక్ష్మణరావుగారు విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను కూడ హైద్రాబాదునందే ప్రారంభించిరి (1905). తరువాత హైదరాబాదులోని రాజకీయ పరిస్థితుల మూలమున మద్రాసునకు మార్చిరి (1908). ఈ తొలి రెండు సంస్థలు చేసిన ఆంధ్రభాషా ప్రచారము నిరుపమానమైనట్టిది. లక్ష్మణరావుగారి దూరదృష్టి ఎంత గొప్పదో చూడుడు !
ఆంధ్రులకు ఆంధ్రబాషలో రచనా కౌశల్యము లేదను భ్రాంతిని, నిస్పృహను లక్ష్మణరావుగారు పటాపంచలు చేయ సమకట్టిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను స్థాపించిరి. గ్రంథకర్తలను సృష్టించిరి. ఆంగ్లేయ భాషా కోవిదులకు ధైర్యము కల్పించిరి. గ్రంథరచనలు చేయసాగిరి. దేశ చరిత్రములు, జీవిత చరిత్రలు, పదార్థ విజ్ఞానశాస్త్రము, రసాయనశాస్త్రము, అర్థశాస్త్రము, జంతుశాస్త్రము, భూగర్భ శాస్త్రము మున్నగు వాటిపై అపూర్వ గ్రంథములు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల యందు వెలువడెను.
శ్రీ లక్ష్మణరావు గారికి ఆంగ్ల విద్యా వ్యాసంగ సందర్భమున “తత్త్వశాస్త్రము” పరీక్షా విషయముగా ఉండియున్నను, వీరికి అభిమానవిషయముమాత్రము చరిత్రయే. వీరు మొట్టమొదట 'శివాజీ చరిత్రము' ను రచించి ఆ మహారాష్ట్ర వీరునకు జోహారు లర్పించిరి. విజ్ఞానచంద్రికా గ్రంథమాలలో హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము అను రెండు చరిత్ర గ్రంథములను రచించిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలకు సంపాదకు లగుటచే అందు ప్రచురితమయిన ప్రకృతిశాస్త్రముల యందును,
68