కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు
సంగ్రహ ఆంధ్ర
భూమిదానము, దాని అధికారము ఆ పూజరి వంశజులకు నిలచి యుండుటయు తెలియజేయు చున్నది. ఆ భూమికి గల పవిత్రత యెట్టిదోగాని, దానికి సమీపముననే గల పొడగట్లపల్లి గ్రామములో నుండిన వేదాధ్యయన సంపన్నులందరు నేటికి కూడ వసిష్ఠానదిలో గ్రుంకి, జుత్తిగపాడు భూమి నంటిన ఘట్టములో నిలచి అనుదినము ప్రశ్న ప్రయజ్ఞ విధానమున వేదపాఠముచే ఆ ప్రదేశము నంతను ప్రతిధ్వనింప జేయుచుందురు.
పలివెల గ్రామములోని శ్రీ కొప్పులింగేశ్వర క్షేత్రమును పేర్కొనుచు, శ్రీనాథ మహాకవి ఈ క్రింది పద్యమును రచించెను:
సరిసామంతుడు శ్రీ కుమారవని కా
చాళుక్య భీమేశ్వరే
శ్వర దేవుండుపకంఠ బాంధవుడు శ్రీ
సంవేద్య రాడ్భైరవుం
డిరువుం బొర్వును బిల్వలేశుడు మృకం
డేశుండుగా నేలె ని
ద్ధరణీ మండలి భీమనాథుడు నిరా
తంక ప్రతాపోన్నతిన్.
పలివెల కొప్పులిం గేశ్వరక్షేత్రము దక్షారామ, కుమారారామములతోడను, రాజమహేంద్రవర రుద్రపాదతీర్థ క్షేత్రము తోడను సమాన ప్రతిపత్తి గలదని ప్రాచీన శాసనములు కూడ తార్కాణించుచున్నవి,
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు :
కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారి వంశమునకు మూలపురుషుడు కొమఱ్ఱాజు అను పేరుగల ఒక మహాశయుడు. ఈతని పేరే ఇంటి పేరుగా మారిపోయినది. ఈ కొమఱ్ఱాజు అను ఆయన క్రీ. శ. 1530 వ సంవత్సరమున కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పెనుగంచి ప్రోలు నివాసులుగా నుండిరి.
కొమఱ్ఱాజు వంశములో ఎనిమిదవ తరుమువా రగు వేంకట నారాయణగారు చాలకాలము వరకు సంతతి లేనివా రగుటచే, శ్రీశైలమునకు మూడుసారులు ప్రదక్షణములు చేసి, శైవమతమును స్వీకరించి లింగధారు లయిరి. వేంకటనారాయణగారు పంచపాండవులవంటి అయిదుగురు కొడుకులకు జనకు లైరి. వారి నాలుగవ కుమారుడు రాజన్న. రాజన్న కుమారుడు లక్ష్మారాయడు. లక్ష్మారాయని కుమారుడు వేంకటప్పయ్య. వేంకటప్పయ్య కుమారుడు యీ వ్యాస నాయకుడు లక్ష్మణరావుగారు. ఈ విధముగా కొమఱ్ఱాజు వంశములో లక్ష్మణరావుగారు పండ్రెండవ తరమువా రగుచున్నారు. వీరు ఆరువేల నియోగిశాఖా బ్రాహ్మణులు.
లక్ష్మణరావుగారి తండ్రియైన వేంకటప్పయ్యగారిది పెనుగంచిప్రోలు గ్రామకరిణికములలో (కొమఱ్ఱాజు, కొమరగిరి, పర్చావారలకు) ఒక కరణికము కలదు. వేంకటప్పయ్యగారికి ఇద్దరు భార్యలు. రెండవ భార్య యగు గంగమాంబా గర్భమున ఒక కుమారుడును, ఒక కుమార్తెయు జనించిరి. ఆ కుమారుడే లక్ష్మణరావుగారు. ఆ కుమార్తెయే భండారు అచ్చమాంబ.
లక్ష్మణరావుగారు ధాత సంవత్సరమునందు, వైశాఖ బహుళ నవమి గురువారమునాడు అనగా క్రీ. శ. 1876 మే నెల, 18 వ తేదియందు జనన మొందిరి. చిన్నతనముననే పితృపాదులు కైలాసవాసులయి యుండుటచే లక్ష్మణరావుగారు తమ మేనమామయు, అచ్చమాంబ యొక్క భర్తయు నయిన భండారు మాధవరావుగారి పోషణలో నుండిరి. మాధవరావుగారు నాగపూరులో పి. డబ్ల్యు. డి. లో ఇంజనీరుగా నుండిరి. అందుచే లక్ష్మణరావుగారి బాల్యము మహారాష్ట్రములో గడచెను. పునహా, నాగపూరు కళాశాలల యందు విద్యా బుద్ధులను వీరు గడించిరి. వీరి విద్యా వ్యాసంగమంతయు మహారాష్ట్ర భాషయందే జరిగినది.
మహారాష్ట్ర దేశమునందున్న కాలములో మహారాష్ట్ర భాషయందే విద్యా వివాదములు లక్ష్మణరావుగారు సలిపి యుండిరి. మరాటిపత్రికలకు వ్యాసములు వ్రాయుచుండెడివారు. మరాటిభాషలో కవిత్వము గూడ చెప్పినారు. ప్రాచీన మహారాష్ట్ర కవిపుంగవుడైన మోరో పంతు రచించిన భారత కావ్యమును పరిశోధించి, సరిదిద్ది, శుద్ధప్రతిని సిద్ధముచేసి ప్రకటించిరి. మొట్టమొదట వీరు సంపాదక పదవి వహించినది ఈ భారత కావ్యమును ప్రకటించు సందర్భముననే.
66