Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొక్కొండ వేంకటరత్నము పంతులు

కలదు. ఈ నాణెములు చేసెడు అచ్చు దిమ్మెలు కూడ దొరకినవి. ఈ నాణెములలో శాతవాహన వంశజులయిన గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులమావి, శివశ్రీ పులమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి అను సమ్రాట్టులకు చెందినవిగా నాలుగు నాణెములు స్పష్టముగా కన్పట్టు చున్నవి. ఇంతవరకు చరిత్ర కారులకు తెలియని నాణెములు ఇచ్చట దొరకినవి. రాజముద్రికలును దొరకినవి. అందలి అక్షర స్వరూపమును బట్టి అవి క్రీ. శ. మొదటి శతాబ్దికి చెందినవని తెలియుచున్నది.

దక్షిణాపథము పూసల పరిశ్రమకు కేంద్ర మని విజ్ఞుల అభిప్రాయము. కొండాపురము కూడ అట్టి కేంద్రములలో నొకటి యని తోచును. ఇచ్చట 23,391 పూసలు దొరకినవి. ఇందు 22,000 మట్టిపూసలే. మరియు రాగి, స్ఫటికము, శంఖము, కెంపురాయి, సూర్యకాంతము, ఎముక మొదలగు వాటితో చేయబడిన పూసలే గాక ఇంద్రనీలము, కురువిందము, వైఢూర్యము, గరుడ పచ్చ, మరకతము మున్నగు రత్నమయములగు పూసలుకూడ లభించినవి. ఇవి సుమారు మూడు వందల ఆకార భేదములను కలిగియున్నవి. ఈ పూసలలో వృషభాకారపు పూస బేర్కొన దగి యున్నది. బుద్ధుడు వృషభ రాశిలో జన్మించి యుండుటచే ఆ చిహ్నము పవిత్రమైనదిగా ఆ బౌద్ధులు భావించి యుందురు. రావియాకు, త్రిరత్న రూపములు కూడ అట్టివియే. స్వస్తికము, శ్రీవత్సము, గజలక్ష్మి, చురకత్తి, మొదలగు వాటి రూపములలో కొన్ని యున్నవి. పూసలు కూడ కాల నిర్ణయములో తోడ్పడును. ఇచ్చట దొరికిన పూసలను బట్టి క్రీ. పూ. మొదటి శతాబ్దము నుండి, క్రీ. శ. రెండవ శతాబ్దము వరకు గల మూడు వందల సంవత్సరములలో కొండాపురము వైభవ శిఖరము నంది యుండెనని చరిత్ర పరిశోధకులు నిశ్చయించి యున్నారు.

శాతవాహనులు ప్రతిష్ఠానములో రాజ్యము చేయుచున్న కాలములో వారికి ప్రాకార పరిఖావృతములగు ముప్పది నగరము లుండెనని మెగస్థనీసు క్రీ. పూర్వము 302 లో వ్రాసినాడు. ఆ ముప్పది పురములలో ఈ కొండాపురము ఒక మేలి పురమయి యుండవచ్చునని అనుకొనుచున్నారు. భారత ప్రభుత్వపు పురావస్తుశాఖకు డైరెక్టర్ జనరల్ అగు రావుబహద్దూర్ కె. యన్, దీక్షితులుగారు కొండాపురమును గూర్చి ఇట్లు చెప్పినారు :

“ఇది నిజముగా మహాస్థలము. దక్షిణాపథములో శోధించదగిన స్థలము. ఆంధ్ర రాజయుగపు వైభవ శిఖరమునకు గొంపోవు విస్తృత యోగ్యతలుగల నగర ప్రదేశము మరియొకటి నాకు దక్షిణమున కనబడ లేదు. ఇచ్చట కనుగొన్న వస్తుసంపద అసాధారణ విశిష్టత గలది. కొండాపురమును నేను దక్షిణ భారతపు 'తక్షశిల' అనుచున్నాను."


కొక్కొండ వేంకటరత్నము పంతులు:

తొట్టతొలుత 'మహామహోపాధ్యాయ' బిరుదమును సంపాదించిన పండితులు కొక్కొండ వేంకటరత్నము పంతులుగారు. వీరు వినుకొండలో 1842 వ సంవత్సరమున జన్మించిరి. గుంటూరిలో

చిత్రము - 15

విద్యాభ్యాసము కావించిరి. చిత్తూరు మండలాంతర్గత మగు 'తిరువల' అను గ్రామమున వెలసిన శ్రీ తనుమధ్యా బిల్వనా థేశ్వరుల నారాధించితత్కరుణా కటాక్ష ప్రభావమున కవితావిద్య నార్జించినారు. వీరు కొంతకాలము చెన్నపురి రాష్ట్రీయ కళాశాల యందును, చాలకాలము రాజమహేంద్రవర కళాశాలయందును ఆంధ్ర పండితస్థానము నలంకరించి పెక్కుమంది కళార్థులకు విద్యాభిక్ష పెట్టినారు.

విద్వత్పరిషత్తులు 'కవిబ్రహ్మ' అనియు, 'అక్షరసంఖ్యాచార్యు' లనియు పంతులుగారికి బిరుదములు ప్రసాదించినవి. 'ఆంధ్రభాషా సంజీవిని' అను పేరుగల తెనుగు పత్రికకు సంపాదకులుగా నుండి వేంకటరత్న కవిగారు చేసిన సారస్వతసేవ చిరసంస్మరణీయ మైనది. వీరు రచించిన కృతులలో ప్రసిద్ధము లైనవి "ఆంధ్ర ప్రసన్న రాఘవ నాటకము, పంచతంత్రము, సింహాచల యాత్ర,

63