విజ్ఞానకోశము - 3
కొండాపురము
మాటకు తలయూపువారు కారు. తనకు అసమ్మతమైన విషయమును ధైర్యముతో వ్యక్త పరచెడివారు.
హోంరూలు సమితి సభ్యులుగా పంతులుగారు డా. అనిబిసెంటుతో ఢిల్లీకి వెళ్ళి మాంటేగు - చెమ్స్ ఫర్డులను దర్శించిరి. ఉన్నవ లక్ష్మీనారాయణగారి నిర్బంధమునకు అసమ్మతిగా వర్తకులచే వారము దినములు జయప్రదముగా సమ్మెచేయించిరి. ఇది యొక అపూర్వసంఘటనము. ఆబ్కారీ పాటలను పాడవలదని గుంటూరు మేజిస్ట్రేటుగారి ఎదుట వర్తకులకు ప్రబోధించిరి. కాంగ్రెసు ఎన్నికలను బహిష్కరించిన సందర్భమున పంతులుగారు రాష్ట్రమంతటను ప్రచార మొనరించిరి. పంతులుగారి సహాయ నిరాకరణ ప్రచారము మూలముననే బులుసు సాంబమూర్తి వంటి వా రెందరో తమ న్యాయవాద వృత్తులను విసర్జించిరి. పన్నుల నిరాకరణోద్యమమును (1920), బార్డోలీ ఉద్యమమునకు దీటుగా పెదనందిపాడులో జరిపించిరి. ఆ యుద్యమమును విరమింపుడని గాంధిజీ వ్రాసినను, పంతులుగారు అది బహుదూరము సాగినదనియు, అట్టి దశయందు దానిని ఆపివేయుటయే సంభవించునెడల, ఆంధ్రదేశము కాంగ్రెసునుండి తొలగవలసి వచ్చుననియు ఖండితముగా చెప్పిరి. వారి ధైర్య సాహసము అట్టివి ! కాంగ్రెసు కార్య నిర్వాహకసభ అమృతసర్ లో జరిగినపుడు పంతులుగా రచటికి అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షులుగా వెళ్ళిరి. నాడు అకాలీల శాసనోల్లంఘనపు టూరేగింపులో కాంగ్రెసు కార్యవర్గమువారు కూడ పాల్గొనిరి. గాంధీజీ దండిగ్రామములో ఉప్పు సత్యాగ్రహము జరిపినపుడు పంతులుగారు నూరుమంది కాంగ్రెసు కార్యకర్తలచే తమ ఆవరణములో ఉప్పు తయారుచేయించి అమ్మించిరి. అఖిలభారత చరఖాసంఘపు శాశ్వత సభ్యుడుగా. ఆంధ్రరాష్ట్ర చరఖాసంఘపు అధ్యక్షుడుగా, ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సంఘపు అధ్యక్షుడుగా పంతులుగారి సేవ ఎంతయు ప్రశంసాపాత్రము. బాపుజీ ఖద్దరు నిధి కొరకు ఆంధ్రరాష్ట్రమున సంచారము చేసినపుడు పంతులుగారు వారికి కంటి రెప్పవలె వర్తించిరి. వీరు పెక్కుసారులు కారాగారశిక్ష ననుభవించిరి.
శాసన సభ్యత్వము : పంతులుగారు గుంటూరు, కృష్ణా, గోదావరిజిల్లాల ప్రతినిధిగా శాసనసభకు ఎన్నుకొనబడిరి. వీరు శాసనసభలో చాల కృషిసల్పి విషయములను సమగ్రముగ తెలిసికొని, ఆవశ్యకమగు అంశముల నన్నిటిని పూస గ్రుచ్చినట్లు శ్రుతపరచెడువారు. శాసనసభ యందు ప్రభుత్వ బలమే హెచ్చయ్యెను. అయినను వారు త్రికరణ శుద్ధితో, దేశ సేవా దీక్షతో గ్రంథాలయముల కొరకు ప్రభుత్వ సహాయ మర్థించుచు, ప్రతిపాదించిన బిల్లును ఆమోదించియు, స్త్రీలు విద్యాలయములందు చదువకయే పరీక్షలలో వ్రాయవచ్చునని ప్రతిపాదించిన బిల్లును మొదట వ్యతిరేకించినను, తుదకు ఆమోదించియు పంతులుగారిని బ్రిటిష్ ప్రభుత్వమువారు గౌరవించిరి. వారు 1936 లో శాసనసభ్యులై గుంటూరు నియోజకవర్గమునకు సేవచేసిరి. కాంగ్రెసులోని అక్రమములను గాంధి, నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులకు తెలియజేసి, కాంగ్రెసును పరిశుద్ధ మొనర్ప ప్రయత్నించిరి.
అట్టి మహనీయులు, వినయధనులు, ప్రతిభావిలసితులు, మానవసేవా ధురంధరులు, ధైర్యోత్సాహ, ఉదారాది ప్రశస్త గుణగణ విరాజితులు, దేశ హితైకతత్పరులు, ఆంధ్రోద్యమ జనకులు, 'దేశభక్త' బిరుద శోభితులుఅయిన శ్రీ వెంకటప్పయ్యగారు 1949వ సంవత్సరమున ఆగస్టు 15 వ తేదీయందు దేశ ప్రజలకు స్వాతంత్ర్యదిన సందేశ మొసగి, ఆ పర్వదినముననే దేశీయులను అపారశోకవారిధియందు ముంచి భౌతిక దేహమును త్యజించి నిరుపమ కీర్తి కాయముతో పరమపదమందిరి.
కొండాపురము :
మెదకు జిల్లా, కలబగూరు తాలూకాలో బిదరుప్రాంతమున కొండాపురమను చిన్న గ్రామము కలదు. దాని ప్రాంతమునందు అత్యంతప్రాచీనకాలములో, అనగా 2000 సంవత్సరముల క్రిందట వైభవోపేతమైన యొక నగరము ఆంధ్ర రాజధానిగా విలసిల్లి యుండెనని చరిత్రకారులు నిర్ధారణ చేసిరి. ప్రాచీనకాలములో ఆ మహానగరమునకు ఎట్టి పేరు ఉండెనో తెలియదు. కాని నగరశిథిలములు దొరకిన ప్రాంతము కొండాపుర గ్రామమునకు సుమారు అరమైలు దూరమున మాత్రమే ఉండుటచేత ఈ పురాతన నగరమును కూడ సౌకర్యార్థము కొండాపురమనియే వ్యవహరించు చున్నారు. ఈ పూర్వపు పట్టణము పేరు కూడ కొండాపురమో అట్టిదే వేరొక పేరో అయి యుండ
59