పుట:SamardaRamadasu.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులను బీడింపగూడదు.వారు నడచిన త్రోవలనే నడచుచు వారి సంభాషణాను సారముగానే భాషించుచు వారి హృదయముల జూఱ గొనవలెను. పిల్లలకు బోధింపవలసినప్పుడు వారి గ్రహణశక్తిని జ్ఞానమునుబట్టి బోధింపవలెను. ఎవరికి బోధించినను వారి జ్ఞానమును బట్టియే బోధనము చేయవలయును. మీరేమి చేయదలచినను జనహృదయములను రంజింపుచునే చేయవలెను. వారి నెప్పుడు పీడింపగూడదు. ఈ విధముగ రామదాసుని శిష్యులు జన సామాన్యముతో గలసిపోయి వారి విశ్వాసమునకు బాత్రులై రామదాసు యొక్క సంకల్పము నెఱవేర్చిరి. శిష్యులు సంచారము చేయుచు నీ క్రింది పద్ధతులను శ్రద్ధగా నాచరించుచుండిరి. 1. వైరాగ్యము. మూడు లోకముల సామ్రాజ్యము వారి కర్పించినను వారు దానిని గడ్డి పరకగ జూడ నారంభించిరి. 2. వేద శాస్త్ర పఠనమును, స్నాన సంధ్యా ద్యనుష్ఠాన నిర్వహణమును వారికి ముఖ్యములు. 3. ప్రతి గ్రామము నందును శిష్యులు భజన కీర్తనలు తప్పక చేయుచుండవలెను. శిష్యుడొక గ్రామమున గొన్ని గంటల కన్న నెక్కువగ నుండగూడదు. ఏ విధమగు బహుమానమును స్వీకరింపగూడదు. 4. పరోపకారము తప్పక చేయుచుండవలెను. శిష్యులు మతబోధయందేగాక వైద్యము మంత్రశాస్త్రము గూడ నేర్చుకొని చేతనైనంత సాహాయ్యము జనులకు జేయుచుండెడివారు. ఈ శరీరము పరులమేలు కొఱకే యుపయోగింపవలెను.పరోపకారార్థ మిదం శరీరమ్," అను మాటను జ్ఞప్తిలో నుంచుకొనవలెను. కాని శిష్యులు "శరీర మాద్యం బలుధర్మసాధనమ్" అను మాట గుఱిజేసికొని తమ శరీరములను సంరక్షించుకొనుట మానరాదు. ఆరోగ్యము చెడగొట్టుకొన గూడదు. శిష్యులు జనుల హృదయముల యొక్క లోతు తెలిసి కొనవలెను. ఇది స్వకార్యనిర్వహణమున నతని కెంతో సాయపడుచు వచ్చెను. జనులయొక్క హృదయముల నెఱిగినవాడు దేశకాల పరిస్థితులను గ్రహించి తన ధర్మమును సంతుష్టికరముగ నెఱవేర్చుకొన వచ్చును. తన సంచారములో లభించిన సమాచార లేశములను సంచారాంతమున నెమరు వేసికొని శిష్యుడు కార్యసాధనమునకు వినియోగించుకొనవలెను. ఈ పరిశోధనమున నెవరు తనకార్యమునకు