పుట:SamardaRamadasu.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యది పరమ పవిత్రమైనదని యా మతస్థులంద ఱచ్చటికి యాత్ర జేయుచుందురు. రామదాసుడు వచ్చినా డని విని యా మతస్థులు తక్కిన శ్రీనగరవాసులు వానితో వేదాంత చర్చలు చేయదలచి వాని నాహ్వానించిరి. ఆహ్వాన మంగీకరించి రామదాసు డక్కడకు బోయెను. వారు రామదాసుని క్లిష్టములైన వేదాంత సమస్యా సముద్రమున ముంచివైచిరి. ఆత డవి లెక్క సేయక సమస్యలన్నిటికి సమయస్ఫూర్తిగ యుక్తితోను నేర్పుతోను సమాధానము లిచ్చి వారిని జయించెను. వేదాంత శాస్త్రము యొక్క గుట్టు మట్టు తెలియక లోతు నందలేక పైపైనే వారీదులాడుచున్నా రని స్పష్టముగా నతడు వారికి దెలియ జెప్పెను. నానకు మతస్థులు వాదములో పరాజయము పొందితి మని యొప్పుకొని యంతటినుండి రామదాసును దమకు బరమ గురువుగా నంగీకరించితి మని చెప్పిరి. వా రందఱు తమ కుపదేశము చేయుమని ప్రార్థించిరి. అందు కతడు సమ్మతింపక వారితో నిట్లనియె. "మహాపురుషుడైన నానకు మత బోధ కత్తియంచువలె పదునైనది. మహమ్మదీయులుగూడ "రామ రామ" యనుచుందురు. దానికి గారణము నానకు నందు గల జ్ఞానజ్యోతియే కారణము. మీ రాయనకు నమ్మిన శిష్యులు. మీగురువైన నాన కే ధర్మముల నుపదేశించెనో నా యుపదేశములు నట్టివే. మతము మార్చుకొనుట మిక్కిలి యాక్షేపణీయమని నా యభిప్రాయము. నానకునే యనుసరింపుడు. అందుచేతనే మీకు శాశ్వతానందము కలుగును." అనంతరము రామదాసుడు బదరీ నారాయణమును, కేదారేశ్వరమును, హిమాలయపర్వత శిఖరముమీద నున్న మానస సరోవరమును గాంచెను. ఆ పర్వతముమీదనే శ్వేతమారుత విగ్రహము గలదని వినెను. మనుష్యమాత్రు డచ్చటికి బోలేడని కూడ నతడు వినెను. అక్కడకు వెళ్ళసాహసించిన మహానుభావుడు శ్రీ శంకరాచార్యుల వా రొక్కరు మాత్రమే యని యచ్చటి వారు చెప్పిరి. రామదాసు డా క్షేత్రమునకు బోయి మహాత్ముని దర్శించి వర్షకాలము నాలుగు నెలలు గడగడ వడకించు చలిలోను మంచులోను గడపెను. హిమాలయ పర్వతములు దిగి శ్రీ జగన్నాథ క్షేత్రమునకు బోయి యచ్చటి నుండి తూర్పుసముద్రతీరమున బ్రయాణముచేసి రామేశ్వరము పోయి