పుట:SamardaRamadasu.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

హిందూదేశ సంచారము

అతడు మహారాష్ట్ర దేశము విడచి యుత్తర హిందూ స్థానమునకు బోయి గయాక్షేత్రముచేరి యచ్చట పూర్వము బుద్ధదేవుడు తపస్సు చేసిన మఱ్ఱిచెట్టు క్రిందనే కూర్చుండి పండ్రెండు సంవత్సరములు ఘోరతపస్సు చేసి సాటిలేని యింద్రియ నిగ్రహమును, యసమానమైన యాత్మజ్ఞానమును సంపాదించెను. అత డంతతో దనివి నొందక భరతఖండమున గల నానా భాగములకు బోయి యచ్చటి జనుల వేషభాషలను వివిధాచారములను గ్రహించి, సమస్త పుణ్యస్థలములను జూచి, తీర్థయాత్రలు సేవించి లోకానుభవము నార్జించి, పిదప స్వదేశమునకు బోవలె నని సంకల్పించెను. తాను లే నప్పుడు తకిలీ గ్రామములో స్థాపించిన మారుతీ దేవాలయమునకు నిత్యపూజా కైంకర్యములు నీమముతో నడుపుటకు సర్వవిధముల నుద్ధవుడే యర్హుడని వాని నా యాలయమున నుంచి పోయెను. కాలినడకను కాశీపట్టణమునకు పోయెను. అచ్చట నతడు శ్రీవిశ్వేశ్వరస్వామివారి యాలయము ప్రవేశింప బోవుచుండ నచ్చటి బ్రాహ్మణులు వాని నడ్డుపెట్టిరి. ఆతని లంగోటీ చూచియు జడలు చూచియు మలినమైన బట్టలను జూచియు నత డెవడో తక్కువజాతి వాడని వారు భావించి యట్లు చేసిరి. అడ్డు పెట్టగానే యతడు వారితో వివాదపడక తిన్నగా నత డటనుండి వెడలి పోయెను. రామదాసు డట్లు వెడలి పోగానే విశ్వేశ్వరాలయములో నున్న శివలింగమదృశ్య మయ్యెనట. అర్చకులు ధర్మకర్తలు మొదలయినవారు మిక్కిలి యాశ్చర్యపడి కళవళపడి యా వింతకు గారణము రామదాసుని రానీక వెడల గొట్టుటయే యని నిశ్చయించిరి. వారు తొట్రుపడి వానివెంట పరుగులెత్తి వానిని గలసికొని, తమ్ము క్షమించి యాలయమునకు దయచేయు మని ప్రార్థించిరి. రామదాసుడు మారు