పుట:SamardaRamadasu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కమహాశయులు గ్రహింపవలయును. ఈ బాలకుని తపస్సు చూడ భాగవతములో చెప్పబడిన ధ్రువుని తపస్సు జ్ఞప్తికి వచ్చును. అట్టి మహాతపస్సు చేసినవారిలో చాలమంది జీవింపక నశింతురు. మహోత్సాహము, మనోనిశ్చయము, ధైర్యముగలవానికి నేదియు నసాధ్యము గాదు. ఈ తపస్సు వల్లను నేర్చిన మంత్రశక్తి వల్లను రామదాసుడు క్రమక్రమముగ యోగి యయ్యెను. అతని మొగమున బ్రహ్మవర్చస్సు తాండవమాడజొచ్చెను. లోపలనున్న దివ్యజ్ఞానము శరీరమంతట బ్రతిఫలింప జొచ్చెను. ఆతని కద్భుత శక్తులలవడెను. సంభాషణము - గంభీరమయ్యెను. చేత నొక దండమును చంక నొక జోలెయు మొలకొక లంగోటియు నతడు ధరించు చుండెను. అతడు రెండు గ్రంథముల రచియించెను. ఒకటి మానసిక శ్లోకములు. రెండవది దాసబోధ. అతడా గ్రంథములలో ముట్టని విషయము లేదు. ఆనాడు నేటివలె గొప్ప విద్యాభ్యాసములకు నవకాశములు లేవు. లేక పోయినను నేటికాలపు వారికి మహాశ్చర్యము గలిగించు విషయములు భావములు నాగ్రంథములలో నున్నవి. రామదాసుకడ గూడ నద్భుతశక్తులు కలవందురు గాని యా యద్భుతశక్తులను నతడెప్పుడు నుపయోగింప లేదు. ఉపయోగించుటకు నిష్టములేదు. అయినను తప్పినది కాదు. ఆతడు తకిలీ గ్రామములో నొక గుహలో దపస్సు జేయుచున్న కాలమున నచట నొక యువకుడు క్షయరోగ పీడితుడై మృతినొందెను. ఆతని భార్య సహగమనము చేయదలంచి శ్మశానమునకు బోయెను. కాడు పేర్చబడెను. అంతయు సిద్ధమయ్యెను. అప్పుడా యిల్లాలు సమీపమున నొక గుహలో మహాపురుషు డొకడు తపస్సు చేయుచున్నా డని విని యాతని దర్శనము చేయుటకై పోయి రామదాసునకు నమస్కరించెను. ఆమె నతడు దీవించి "ఎనమండుగురు బిడ్డలు నీకు గలుగుదురుగాక" యని యాశీర్వదించెను. స్వామీ! యీ జన్మముననా? మఱియొక జన్మముననా?" యని యామె యడిగెను. "మఱియొక జన్మ మేల? ఈ జన్మమునన" యని యతడు బదులు చెప్పెను. అంతకు ముందే తన భర్త కాలధర్మము నొందె నని మనవి చేసెను. భయము లే దని రామదాసు డభయ మిచ్చిలేచి శ్మశానమునకు బోయి శవమును జూచి రామ నామము స్మరించుచు