పుట:SamardaRamadasu.djvu/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డనని మాత్రము పలికెను. పెండ్లిపీఁటలమీఁద గొంతసేపు గూర్చుండి పెండ్లికూతునకుఁ దనకు నడుమఁ దెఱ పట్టువఱకైనను నుండు మనియామె కోరెను. ఆ మాటలు విని బంధుమిత్రులు నారాయణుఁడు కట్టకడకుఁ దల్లిమాటలకు నంగీకరించె నని సంతోషించిరి. కాని, శ్రేష్ఠుఁడు మొదటినుండియుఁ దమ్ముని తత్వ మెఱిఁగిన వాడగుచే నతని మాటలు విశ్వసింపఁ డయ్యెను. వివాహ ప్రయత్నములు విసవిస జరుగజొచ్చెను. ఎట్టకేలకు వివాహమహోత్సవదినము వచ్చెను. చుట్టములు మిత్రులు చేరిరి. నారాయణునకుఁ బెండ్లికొడుకు సింగార మంతయుఁ జేసిరి. పెండ్లికూతునకు నెదురుగాఁ బెండ్లి పీఁటలమీద నతఁడు కూర్చుండెను. వధూవరుల నడుమ బ్రాహ్మణులు తెఱ పట్టిరి. పురోహితుఁడు బిగ్గరగా మంత్రములు చదువఁ జొచ్చెను. అంతలో సావధానుఁడవై యుండుమని పురోహితులు నారాయణుని హెచ్చరించిరి. ఇంకొక గడియలో వివాహమైపోవును. పెండ్లికూఁతున కెదురుగఁ బీఁటలమీద కూర్చుందునని తల్లితోఁ జెప్పినమాటయతఁడు నిలుపుకొనెను. కాని, పెండ్లికూఁతు యొక్క దురదృష్టము చేతను మహారాష్ట్ర దేశస్థుల యొక్క యదృష్టము చేతను నతఁడు మఱియొక దారి త్రొక్కదలఁచెను. అంతట నతఁ డకస్మాత్తుగాఁ బీఁటలపై నుండి లేచి పెండ్లికూతును బ్రియబంధువులను మాతృదేవతను సోదరుని విడిచి పెండ్లిపందిరిలోనుండి యావలకుఁ బాఱిపోయెను. ఆలోక సామాన్యమైన యీయధ్బుతచరిత్రవల్లఁ బెండ్లిపందిరిలో గొప్ప గొడవ బయలుదేరెను. 'పెండ్లికొడుకు పాఱిపోయెను; పట్టుకొనుఁడు, పట్టుకొనుఁడని కేకలు వినఁబడెను. పెక్కండ్రు నారాయణుని వెంటఁ బఱుగెత్తిరి. కాని యతఁ డెవ్వరికిని జిక్కలేదు. మెఱుపుఁదీవ వలె నతఁడు క్షణములో మాయమయ్యెను. అంవేషింపఁ బోయినవా రాశాభంగ మొంది వెనుకకుఁ దిరిగి వచ్చిరి. ఈ వింతపని పెండ్లికొమారుని యింటను పెండ్లికొమార్తె యింటను విశేషదుఃఖము కలిగించెను. శ్రేష్ఠుఁడు నారాయణుని స్వభావమెఱిఁగి యుండుటచే నతనికి నిర్బంధ వివాహము చేయుట పొరపాటని చెప్పెను. ఆ కాలపు దేశాచారమునుబట్టి జరుగుచున్న నిర్వ్హంధవివాహ పద్ధతుల నతఁడు నిష్ఠురముగ ఖండించెను. ఈ విధముగ నాశాభంగ