పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెరటిలోనికి బోవుదుము. అక్కడ సున్నముతోను ఇటికలతోను కట్టిన తులసికోటయొకటి నాలుగయిదడుగుల యెత్తున నందమై యుండెను. ఆ కోటలోపల లక్ష్మితులసియు కృష్ణతులసియు శ్రద్ధాభక్తులతో బెంపఁబడుచుండును. ఆ సమీపముననే కొంచెము దూరమున తులసివనమును ఆవల నిత్యమల్లెచెట్టును వాని చేరువనున్న నందివర్ధ నపు చెట్టుమీఁద నల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుడు నిత్యమును దేవతార్చనకయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆ పైని రుక్మిణియుఁ జెల్లెలును ప్రేమతో బెంచుకొనుచున్న బంతి చెట్లను బొగడ బంతిచెట్లును, చంద్రకాంతపుచెట్లును గోడ పొడుగు నను వరుసగా నుండును. పడమటింటి నంటియే దక్షిణపువైపున నున్న వంటయింటి దొడ్డిలోపల నరఁటిబోదెలు పిలకలతో నిండి యుండి చూపుపండువుగా నుండును. రాజశేఖరుడుగారు ప్రత్యహమును ఆ బోదె మొదలనె స్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసి వచ్చి గోదావరి నుండి చెంబుతో దెచ్చిననీళ్ళను తులసికోటలోబోసి మ్రొక్కి, తడి బట్టలతోనే చుట్టును మూఁడు ప్రదక్షిణములు చేసి, లోపలికిఁ బోయి తడి బట్ట వదలి పట్టుబట్ట కట్టుకొని యెడమచేతితో గుంకుమ బరిణియు, రెండవ చేతిలో నక్షతలను బసుపును బియ్యపుపిండియునుగల గదుల పెట్టెయును బట్టుకొని వచ్చి, తులసికోటలో నంటియున్న ముందఱి వేదికమీద నీళ్ళు చల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపు పిండితో పద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమనడుమ జిత్రముగా గుంకుమతోను పసుపుతోనునలంకరించుచుఁ గూర్చుండి, మధుర స్వరముతో మెల్లగా, "లంకాయాగము"ను పాడుకొనుచుండెను.

ఈలోపుగా రాజశేఖరుడుగారు వెంటనున్నవారితో నానా విషయములను ముచ్చటించుచు నడుమనడుమ వారి కిఱ్ఱుచెప్పుల జోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలను మరల నడుగుచుఁ బలువురతోఁ గలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలో విడిచి

45