పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేతఁ గాని శ్రీహనుమానుల చేతగాని కఠినమయిన తాఖీదును పొందఁ గలవు.

    శ్లో॥యక్షరాక్షస దుష్టానాం మూషగా శ్శలభాశ్శుకా;
       క్రిమికీట పతంగానా మాజ్ఞాసిద్ది ర్విభీషణ॥"

అని చదివినతరువాత, యంత్రజ్ఞుడు ఏడు వి_స్తళ్ళను ఏడు చోట్ల వేయించి ఆ యేడింటిలోను కుంభము పోయించి, బండి తోలు కొని వచ్చిన వానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దాని రక్తమును కుంభముమీఁద పోయించి, "ఓ గ్రహమా! నీ వీ కుంభము పుచ్చుకొని కొండలమీఁదికి పో" అని యాజ్ఞాపించెను. అక్కడకు వెళ్ళినవారందఱును చెఱువులో స్నానముచేసి యిండ్లకు వెళ్ళిరి. సుబ్రహ్మణ్యమును బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను.

ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య మాసంగతియంతయఁ జెప్పిన తరువాత రాజశేఖరుఁడుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుఱించి యాలోచించి, ఇంతలో రుక్మిణి తలపున బాఱిన దుఃఖము వచ్చి దైర్యము తెచ్చుకోవలెనని యెంతసేపు ప్రయత్నము చేసినను చేతఁగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మఱచి పోవచ్చునని తలంచి పట్టణమును జూచుటకు బయలుదేఱిరి అతఁడు సత్రమునుదాఁటి నాలు గడుగులు నడచినతోడనే యొక యింటివద్ద దంపతులిద్దఱు వాక్కహల మున కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యెుకరీతి యుద్ధము క్రింద మాఱినది. భార్య తిట్లెక్కువ చేసిన కొలదిని భర్త దెబ్బ లెక్కువ చేయుచుండెను. మగని కేకలను భార్య యేడుపును విని వీధివారందఱును గుంపులుగుంపులుగా చూడవచ్చిరి. అంత మంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపవలెనని తలఁచు కొని వచ్చినవారు లేరు గనుక, అందఱును వేడుకచూచుచు మాత్రము నిలుచుండిరి. అంత రాజశేఖరుఁడుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకుసాగిరి. ఆవల మఱి నూరుబారలదూరము వెళ్ళఁగా ఒకచోట వీధి యరుగుమీఁద పదిమంది పెద్దమనుష్యులు చేరి సభతీఱి కూరు