శ్రీ ర స్తు.
వాఙ్మయపరిశిష్టభాష్యం.
తత్త్వజిజ్ఞాసాధికరణం.
వేదాంతం.
ఈకాలపు కృతుల్లో తత్వకవిత్వమంటూ కొంత కనబడుతున్నది. కవిత్వం తత్వజిజ్ఞాసా, చాలా సంబంధంకలవి.
"నానృషిః కురుతే కావ్య" మని భారతీయులు చెప్పుతున్నారు.
భగవద్గీతవంటి తత్వగ్రంథాన్ని కవి వ్యాసుడు తనకృతిలో యేకదేశం చేశాడు. అసలీ తత్వజిజ్ఞాసలకు కవులే బీజావాపకులు.
"నాసదాసీత్ నో సదాసీ త్తదానీం నాసిద్రజో నోవ్యోమాప రోయత్"
(ఋ. మ10. అ 11. సూ 1. ఋ. 1)
ప్రళయదశలో అసత్తులేదు, సత్తులేదు, భూమి పాతాళం మొదలైనవిలేవు. అంతరిక్షంలేదు. (విద్యా. భా.)
"కో అద్దా వేద క ఇహ ప్రవోచత్ కుత ఆజాతా కుత ఇయం సృష్టికి
అర్వాగ్దేవా అస్య విసర్జనేనాధాకో వేద యత ఆబభూవ."
(ఋ. మ 10. అ 11. సూ 1. ఋ 6)
యేవుపాదానకారణంచేత యేనిమిత్తకారణంచేత ఈసృష్టి సకలం ప్రాదుర్భవించిందీ యెవడికి వాస్తవంగా తెలుసును? యెవడు చెప్పగలడు? ఈభూతసృష్టికి పిమ్మటివారుగా దేవతలుచేయబడిరి. జగత్తేకారణంవల్ల పుట్టిందో యెవడికి తెలుసు? (విద్యా . భా.)
అని వినిపించిన ఋగ్వేదకవివాక్కులు ఈతత్వజిజ్ఞాసలను విశదం చేస్తున్నవి.
"కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత మోహితాః" (భగవ) అని వ్యాసుడు కవుల కీ తత్వజిజ్ఞాసలతోటి గల సంబంధాన్ని విశదంచేస్తున్నాడు. బాదరాయణుడికి పిమ్మట వచ్చిన కాళిదాసాదులు