పుట:Narayana Rao Novel.djvu/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెంపపెట్టు

395

‘శ్యామవదిన ఎప్పడువచ్చింది?’

‘మొన్న కొత్తపేటవచ్చింది. అక్కడే సంబంధం నిశ్చయం చేశాము. సూరీడు గంతులు వేసింది. నువ్వు బి. ఏ. లో, ఆమె ఎఫ్. ఏ. లో ఒకేసారి చేరాలి శారదా!’

శారదను శ్యామసుందరి కౌగిలించుకొనినది. నారాయణుని చెల్లెలికడకుపోయి ‘వదినగారూ, మాయింటికి ఎప్పడూ రారేమండి’ యని అడిగినది.

‘నువ్వు మాయింటికి యింతవరకు వచ్చావా వదినా? దొంగమ్మాయివి.’

‘రేపటినుంచీ రోజూ వస్తూఉంటానండీ.’

రెండుకార్లమీద అందరును బయలుదేరి రాజమహేంద్రవరం స్టేషనుకుబోయిరి.

‘రాజారావు తాను కూడా చెన్నపట్నం వెళ్ళకూడదురా నారాయుడు? దగ్గిర ఉండి రాబోయే మరదళ్లను, అత్తగారిని, బావమరదినీ వాళ్ళనూ తీసుకు రావచ్చుగా’ అన్నాడు పరమేశ్వరుడు.

‘ఫస్టురా! పరం’ అని నారాయణుడు.

‘చాలా బాగుంది’ లక్ష్మీపతి.

అందరును ఎంతయో మంచిదనిరి.

వారిద్దరికి రెండవతరగతి టిక్కెట్లు కొని జత సీటుల రెండవతరగతి పెట్టెలో నెక్కించినారు. శ్యామసుందరి శారదను హృదయాని కద్దుకొని ‘తల్లీ, నీ భర్త భగవంతుని అనుగుచెలికాడు. దివ్యుడు. నీ అదృష్టం తల్లీ! ఆయన్ని సర్వవిధాలా పూజచేయి’ అని యామె చెవిలో చెప్పి, శారదను చెక్కిళ్ళపై ముద్దులు గొనెను. శారద అప్రయత్నముగ శ్యామను మరల కౌగిలించి ‘వదినా, నీభర్తా దివ్యుడేసుమా! నా దగ్గరకు వస్తున్నావు. ఎంతో సంతోషంగా ఉంది, త్వరగా రా! అందర్నీ అడిగాను.’

రైలు కదలినది. నారాయణుడు, పరమేశ్వరుడు, శారదయు జమీందారుని ఇంటికి వచ్చినారు. రెండవకారులో లక్ష్మీపతి తన ఇంటికి బోయినాడు. జగన్మోహనునకు మతిలేదు. శారద చేతికి చిక్కినటులే చిక్కి ఇంతలో నా పరమ చండాలుడు వచ్చుటవలన జారిపోయినది. ఆ పశువునకు రసగ్రహణశక్తి యెక్కడున్నది? అతనికి ఆవేశ మెక్కువయైనది. రెండు మెతుకులు నోటిలో యెటులనో వేసికొని ఈవలకు వచ్చినాడు. అతని యొడలు వేడెక్కియున్నది. అతని తమస్సు సర్వాంగాలను సంపూర్ణముగ ఆవహించినది. అతనికి శారదాదేవి మోము, జవ్వనము, సౌందర్యముమాత్రమే ఆ చీకటిలో నుండి తళుక్కుమని మెఱయుచున్నవి.

ఇంతలో శారదయు, నారాయణరావును, పరమేశ్వరుడును కారునుండి దిగి లోనికి విచ్చేసిరి. భర్తను వెన్నంటివచ్చు శారదను చూచి జగన్మోహనుడు రౌద్రముచే కంపించిపోయినాడు.

శారద తిన్నగా లోనికిబోయి కాలిజోడులు విడిచి వంటింటిలో భోజ