పుట:Narayana Rao Novel.djvu/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

నారాయణరావు

‘లే మిజరబ్లే.’

‘ఏమిటీ!’

‘ఈమధ్యే హ్యూగో కవి రచించిన నవలలు చదువుట ప్రారంభించాను.’

‘హ్యూగోకేమిగాని, అలెగ్జాండరు డ్యూమాసు, వెల్సు నావెల్సు చదివినవా?’

‘డ్యూమాసు మాంటిక్రిష్టో చదివాను.’

అక్కడున్న నవలల నన్నియు నాతడు పరికించి చూచినాడు. అన్నియు మంచిరకమువి. బంగారు బైండు, మొరాకో తోలు, చక్కని కాగితములుగలిగి ‘శారదకు – నారాయణరావు‘ అని వ్రాసియున్న గ్రంథములే.

ఏమిటి, నారాయణరావుకు టేస్టుగూడా ఉన్నది! అచ్చా! ఈ యపహాస్యమంతకన్న నంతకన్న నెక్కువగుచున్నదే అని యాత డనుకొనెను.

నారాయణరావు వెళ్ళినవెనుక, జగన్మోహనుడు శారదహృదయము సంపూర్ణముగ లాగివేయ ప్రయత్నములు చేసెను. తంతిమీద నిరువదిరూకల ఖరీదుగల ఒమారుఖయ్యాం గ్రంథము తెప్పించి బహుమతియిచ్చెను. ఆమెతో నవలల గురించి, ఇంగ్లీషు కవిత్వమును గూర్చి చర్చ ప్రారంభించెను. ఇప్పు డింగ్లీషుభాషలో వెలువడు కవిత్వమే నిజమయిన కవిత్వము అని యొక గ్రంథమును చూపెను.

అందు స్త్రీ పురుష సంబంధ క్రియలన్నియు రహస్యములేక వర్ణింపబడి యున్నవి. శారద ఆశ్చర్యపడి ఇది నాకు వలదని తిరిగి ఇచ్చివేసినది. ఎంతయో అసహ్యించుకొన్నది.

వారమురోజులు శారదను బొగడినాడు. మెచ్చుకొన్నాడు. నీవు ఇంగ్లీషు భాషలో కవిత్వము వ్రాయుమన్నాడు. సంగీతము పాడుమన్నాడు. ‘సరియైన ఉన్నత కుటుంబములవారు గాని సంగీత తత్వం గ్రహించలేరు శారదా. కంసాలి నగలు చేస్తాడు. ధరించేవాళ్ళం మనం. ఆడవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. మొగవాళ్ళలో తక్కువజాతి వాళ్ళు నేర్చుకోవాలి అంతే’ అని యాతడన్నాడు.

శారద కొంచెము విసుగుపడినది.

వారిద్దరు వివిధవిషయములు చర్చించినారు. సంగీతము, చదువు, ఆంధ్రవిశ్వవిద్యాలయం; ఆ చర్చలలో నొకసారి జమీందారుగారు, విశ్వేశ్వరరావుగారుకూడ పాల్గొన్నారు.

జమీం: ఏది ఎట్లయితే ఏం, బెజవాడ వదలి విశాఖపట్టణం వెళుతోంది.

విశ్వేశ్వరరావు: తెలుగుదేశానికి ఎంతో దూరాన పెడితే ఎలాగండి? కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం వాళ్లూ మా నెల్లూరి వాళ్లూ గోల.

జగ: విశాఖపట్టణం సముద్రతీరం, కొండలు ఉన్నాయి. విశాఖపట్టణం ముందు ముందు ఆంధ్రదేశానికి రాజధాని అవుతుంది. రేవు కట్టుట మొదలు పెట్టారు. అల్లాంటిచోట ఉండగూడదా ఏమిటి?