పుట:Narayana Rao Novel.djvu/383

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

382

నారాయణరావు

రామచంద్రరావు స్నేహితులు, ఊరిలోని పెద్దలు రామచంద్రరావును ఎదుర్కొన్నారు. పూలమాలలు వేసినారు. రామచంద్రరావుమోము ప్రఫుల్లమయి పోయినది. అచ్చటనుండి అందరు కాకినాడ వెళ్ళినారు. కాకినాడ స్నేహితులు, ప్రముఖులు సామర్లకోట స్టేషనులో నెదుర్కొన్నారు. ఊరేగించెదమన్నారు. వలదని రామచంద్రరా వెంత వారించినను, నారాయణరా వెంత ప్రార్థించినను కాకినాడ పురవాసులు రామచంద్రరాయని నూరేగింపుచు, నాయన బసకడకు గొనిపోయిరి. కుమారుని నిర్బంధము, నారాయణరావు ప్రయత్నము, జమీందారుగారి సాయము భీమరాజుగారు, దుర్గమాంబగారు విని యెంతయు నానందించినారు. కుమారునకు ఖయిదు తప్పినదని యంతవరకు భీమరాజుగారు గాని దుర్గమాంబగారు గాని యెరుగరు. వారు సంతోషబాష్పములు విడుచుచునే యుండిరి.

దుర్గమాంబగారు కొడుకు విదేశములపా లయ్యెనను విచారమున కృశించి పోయినది. నేడామెకు వేయి యేనుగులబలము వచ్చినట్లయినది. భీమరాజుగారు, సుబ్బారాయుడుగారు సంతోషమున కాలముపుచ్చిరి. రామచంద్రరావునకు గార్యము చేయుటకు పురోహితుని రప్పించి శుభముహూర్తము మరల నిశ్చయింపవలసి వచ్చెను.

జానకమ్మగారు దుర్గమాంబగారిని కౌగిలించుకొని, తన ఆనందాశ్రువులు వియ్యపురాలి యశ్రువులలో గలిపివేసినది.

రామచంద్రరావు భార్య పరీక్షలో విజయమందిన సంగతి తెలిసి యెంతయు సంతసించినాడు. శాంతి యేమిటో? ఇంకను కొన్ని వెఱ్ఱియాచారముల మనవారు వదలలేదు. అయినను దేనిలో ఏమర్థ మున్నదో? ఈలోన సూరీడును చూడరాదే! ఇక నెన్నిదినాలు ఆమెతో మాట్లాడుటకు? పదిహేను దినము లెట్లు? ఛీ! తానెంత వెఱ్ఱివాడైనాడు!

మరచినాడు, రంగూనులో, జపానులో, అమెరికాలో, స్నేహితులందరికి గమ్మలు వ్రాయవలె. తా నెప్పుడును వారికి వ్రాయుచునేయున్నాడు. ఇంటికి జేరినట్లు వ్రాయవలె. లియోనారాకు సూరీడుచే నింగ్లీషున నుత్తరము వ్రాయించవలెను.

౨౧

సంబంధ నిశ్చయము

జగన్మోహనరావును సూర్‌చంద్–ప్రేమచందు కంపెనీవారు తమ అయిదువందల రూపాయల పైచిల్లర డిక్రీ బాకీకి చెన్నపురి వచ్చినప్పు డరెస్టుచేయించినారు. జగన్మోహనుడు అంతకంతకు అప్పులలో బడిపోయినాడు. ప్రతిచోటున బాకీలే. తన వివాహమునకై యనేకచోట్ల నప్పుచేసెను. సూర్‌చందు కంపెనీ వారికి వేయిరూపాయలు బాకీపడి, అయిదువందలు తీర్చినాడు. తక్కిన అయిదు