పుట:Narayana Rao Novel.djvu/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

నారాయణరావు

‘వారికి మేమెంతయు కృతజ్ఞులము’ అని తాను కొనివచ్చిన పూవులమాలలు, నాలుగు వెండికప్పుల దొంతర ఆయనకు బహుమతి నిచ్చినాడు నారాయణరావు.

దారిలో వారిని జమీందారు గారి కుటుంబము కలిసినారు. వారంతయు సంతోషమున చెన్నపురి చేరినారు. చెన్నపురిలో జమీందారుగారి యింట నందరు మకాముచేసినారు. మధుర నుండియే విజయవార్తలు కాకినాడకు, కొత్తపేటకు, అమలాపురమునకు బంపబడినవి.

చెన్నపురిలో పరమేశ్వరుడును, నారాయణరావును, రామచంద్రరావును స్నేహితులందరి యిళ్ళకు వెళ్ళిరి. అచ్చట వారెంతయో సంతోషమున కాలము పుచ్చిరి.

మధ్యాహ్నము భోజనములయినవెనుక వారందరు శ్యామసుందరీదేవి గారి యింటికి వెళ్ళిరి. అక్కసెల్లెళ్ళందరు రామచంద్రరాయని నమితముగ గౌరవముచేసిరి. ఈతడా సూరీడు భర్తయని వారు సంతోషించిరి.

ఆ రాత్రియే బయలుదేరి కాకినాడకు వెళ్ళవలె ననుకొన్నారు. కాని నారాయణరావునకు నమితానందదాయక మును, మహత్తరమునగు నొకయాలోచన తట్టినది. అందుకై మరునాడుకూడ వారు చెన్నపురిలో నాగిపోయిరి.

రాజారావు ఉత్కృష్ట పురుషుడు; శ్యామసుందరి పవిత్రచరిత్ర. వీరిరువు రేల వివాహమాడరాదు? ఇరువురు వైద్యవృత్తియం దారితేరినారు. ఇరువురు సేవజేయుటయే జన్మకు పరమార్థమని సంకల్పించుకొన్నారు. శ్యామసుందరి యొప్పుకొనునా? అతనికి ఒక నాటిరాత్రి జరిగిన యుదంతమంతయు దృశ్యమువలె గోచరించినది. ఆమె హృదయములో నేమున్నదో? తనపై ప్రేమ సోదరుని ప్రేమయైయున్నది. ఆ సోదరప్రేమయే ఉత్కృష్టమైనదట. దివ్యకరుణావేశ యైనదట. అంతియ!

నారాయణరావు శ్యామసుందరిని మరునాడు కలిసికొన్నాడు. ఆమెతో తన కోరిక ప్రసంగించుట యెంతకష్టము! ‘చెల్లీ, నా కొక దివ్యమగుస్వప్నము ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది.’

‘ఏమిటది అన్నా?’ – ఆమెమాటలు చిరువెండి గంటలవలె మ్రోగినవి.

‘నువ్వు దేశసేవ, మానవసేవయు చేసి తరింప సంకల్పించుకొన్నావు. తరిబీతు లన్నియు పూర్తియైనవెనుక సబర్మతీ యాశ్రమమునకు బోయి సేవచేయు నధికారము సంపాదించుకొంటా నన్నావు.’

‘అవును అన్నయ్యా, ఆమహాత్ముని పాదాలకడ సేవచేయుట నేర్చుకొని నా జన్మము సేవలో ఐక్యము సేయవలెనని నేను నిశ్చయించుకొన్నాను. నే నెంతవరకు తగుదునో? నే నందుకు తగుదునా అన్నా?’

‘నీవు అన్యధా తలచనంటే నే నొక ప్రశ్న అడుగుతాను.’