పుట:Narayana Rao Novel.djvu/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

నా రా య ణ రా వు

ఏమన్నాసరే ఉంటే పరిహరించి ఎక్కడైన రేఖలరాగంలో సంపూర్ణత లేకపోతే, ఏ చెట్టో, పుట్టో, పడవో సరియైన స్థలములో కల్పించి చిత్రంచేస్తాడు, అది చూచి ఆనందిస్తాము.

‘కవీ అంతే.

‘మనము ప్రకృతిని చూసి అనుకరిస్తున్నామనుకున్నారేమో! కాదు. ప్రకృతిదృశ్యం చూసినప్పుడు ఆనందం పొంది, ఆ ఆనందం శ్రుతిలోఉంచి, అట్టి శ్రుతులు నాలిగింటిని కలియజేసి, ఒక చిత్రం సృజింపవచ్చును.’

‘కళావిషయం ఇది ప్రకృతియేనా అని భ్రమింపజేసేదికూడా కావచ్చును. కుక్క కూత నేను కూశాననుకోండి, మీరంతా సంతోషిస్తారు. కాని ఆ ఆనందం చాలా హీనమైనది. కుక్క కూతలోంచీ అపశ్రుతి తీసివేసి శ్రుతియుక్తం చేసి గానకళకు చేర్చవచ్చును. అపశ్రుతి తీసివేయడం, ప్రకృతిలో దొరికిన కొవ్వురాయి అగు వజ్రమును సానబెట్టి తళ తళ మెరయు రత్నమును చేయుటవంటిది.’

ఈ రీతిగా నారాయణరావు గంభీరోపన్యాసము గావించెను. ఆనందము నాలుగు రకములుగ నుండునట. భౌతికము, మానసికము, హృదయజనకము, పారలౌకికము, చక్కని బాలికను పొంకములగు నవయవములతో, దిసమొలతో రచించినచో శరీరానందము కలుగునట. లతలు, పండ్లు అలంకారములుగా చిత్రించినచో వాని యద్భుతమునకు మనస్సు సంతోషించుననియు, అట్టిదే స్వరకల్పనయనియు అతడు వచించినాడు. కరుణ, భయానకము, విషాదము మొదలగు రసము లుప్పతిల్లు చిత్రవిషయములు హృదయమును కలంచును. భగవంతుడు, మహాత్ములు, అవతారముల చరిత్రలు, ఉత్తమచరిత్రలు, గాథలు, సాంఖ్యము, కర్మయోగము, భక్తియోగము మొదలగునవి పారలౌకికములు ఆత్మానందము నిచ్చునని నారాయణరా వనెను.


౨౦ ( 20 )

క్లిష్ట సమస్య

సభలన్నియు పూర్తియైనవి. కార్యక్రమ మంతయు సర్వోచ్చముగ జరిగినదనియు, చిత్రకళాప్రదర్శనము, కవులకూటమి, బొబ్బిలికథ, భాగవతము, తోలుబొమ్మలు, నాటకము లుత్కృష్టములై యున్నవనియు ఆంధ్ర, హిందూ, స్వరాజ్య, భారతి మొదలగు పత్రిక లన్నియు వాకొన్నవి.

చిత్రపటములలో అత్యుత్తమచిత్రమునకొకటి, పౌరాణిక చిత్రములలో నుత్తమమగుదాని కొకటి, మానవజీవిత విషయములు రచించిన చిత్రములలో నుత్తమమున కొకటి, మొత్తము మూడు బహుమానములు, రెండువందలు, నూరు, నూరురూపాయల చొప్పున నిచ్చినారు. ఆంధ్రనారీమణులలో నుత్తమచిత్రము