పుట:Narayana Rao Novel.djvu/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

160

నా రా య ణ రా వు

వచ్చినప్పుడు, వారికి నిజమైన పూర్వసాంప్రదాయవిద్య గరపుటకు వీలేమో’ అని యాతని తండ్రి యనును.

ఇంతలో నలువురు బాలికలతో మంగేశ్వరరావు లోపలినుండి మందిరములోనికి వచ్చినాడు.

నలువురు బాలికలు మెరపుతీగెలు, నలువురు బాలికలు గౌతమీనదీ చిరు కెరటాలు.

వారి సౌందర్యమున ఆర్యత్వము నిండియున్నది.

‘నారాయణరావు! వీరు శ్యామసుందరీదేవిగారు, వీరు రోహిణీదేవిగారు, ఈమె సరళాదేవిగారు, ఈమె నళినీదేవిగారు, వీరు నారాయణరావుగారు’ అని నటరాజన్ స్నేహితునకు నా బాలికలకు పరిచయము గలుగచేసెను. అందరు ఒకరి కొకరు నమస్కృతులిడి, నాసనములపై నధివసించిరి.

‘నారాయణ్! శ్యామసుందరీదేవిఫిడేలును; రోహిణీదేవి వీణను; సరళాదేవి జలతరంగము పియానో, యిస్ రాజ్ చిరతారు, సారంగి మొదలయినవెన్నో వాద్యాలను; నళిని మురళిని అద్బుతముగా వాయించగలరుదా. వీరి తండ్రిగారు చూస్తివా పింఛను పుచ్చుకొన్నవెనక మైసూరులో జాలకాలముండిరి. అక్కడ ఆస్థానవిద్వాంసులుదా కుమార్తెలకు నేర్పినారూ చూస్తిరా? శ్యామనుందరీదేవిగారూ, ఈ నారాయణరావుదా చాల జాగ్రత్తగా, దీక్షగా విద్య అభ్యసించాడు. చిన్నతనాన్నుంచి రామస్వామి అయ్యరికిదా నూరురూపాయలిచ్చి యీ ఊరిలో నెలలు నెలలు విద్య నేర్చుకున్నాడు. ఇట్టి మీ రిద్దరుదా కూడపలుక్కుంటే, ఇద్దరివిద్యా చాలా బాగుగా వృద్ధి అవునుదా నా ఆశయం’ అని నటరాజన్ సంతోషమున జేతులు నులుముకొనుచు పలికెను.

శ్యామసుందరి యిరువదిరెండేండ్ల మిసిమిపసందుల చంపకీసువర్ణగాత్రి. నారాయణరావును చూచి ‘కొంచెమాలస్యం కావడం చూచి మీరీ రోజున వచ్చుటకు వీలుకాదేమో అనుకున్నాము’ అన్నది.

నారా: నేనే మా ఆలస్యానికి గారణము. క్షమించండి. మంగేశ్వరరావుగా రేవాద్యమన్నా వాయించగలరా?

నట: వాయించకేమి! అత నెప్పుడున్నూ నేర్చుకోలేదు కాని, అప్పచెల్లెళ్లు నలుగురూ నేర్చుకొనేవి వినికిడివల్ల చూస్తిరా, అవి పట్టుకొని అన్ని వాద్యాలమీదా వాయించగలడుదా.

నారా: అలాగా! బాగుంది. మీరు చాలా అదృష్టవంతులండీ, మంగేశ్వరరావు గారూ!

మంగే: మా నటరాజన్ ఏదో ఒకటి అంటూ ఉంటాడులెండి.