కూడా నిలబడే బాపతుకాదు. ఆయన ఎప్పుడూ రాజీ ప్రతిపాదనలకు సుముఖుడు.
ఎప్పుడూ కలహానికి కాలు దువ్వి, తిరుగుబాటును వాంచించే బెంగాల్ రాష్ట్రం కూడా, ఆ 1925 లో చిత్తరంజన్ దాస్గారి మరణం కారణంగా, వెనక్కి జంకింది. దాస్గారి మరణం ఒక పెద్ద కధ. దానిని గురించి ప్రత్యేకంగా చెపుతాను. బెంగాల్, అనేక కారణాలవల్ల, మదరాసు కాంగ్రెస్వారు 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని ప్యాసుచేసిన సమయంలో, ఒక రకమయిన నిరుత్సాహ స్థితిలో పడిపోయి ముందుకు రాలేక పోయింది.
బెంగాల్వారు 1928 కాంగ్రెస్ను కలకత్తాకు ఆహ్వానించారు. ఎల్లా గయినా కాంగ్రెసు అధ్యక్షునిగా పండిత మోతీలాల్ నెహ్రూగారినే ఎన్నుకుని, చెన్నపట్నంలో ఆయన కుమారునిచేతనే ప్రతిపాదించబడి ప్యాసయిన 'స్వాతంత్ర్య' తీర్మానాన్ని బుట్ట దాఖలు చేయించాలని 'బెంగాల్' వాంఛించింది.
కమిషన్ బహిష్కరణ తీర్మానం
సైమన్ కమిషన్ బహిష్కరణ తీర్మానాన్ని గురించి మళ్ళీ కాస్త చర్చిద్దాం. మొట్టమొదటి కాంగ్రెసు దినాలనుంచీ బ్రిటిష్వారు భారతీయులపట్ల ప్రదర్శిస్తూ ఉన్న వైఖరీ, అవలంబిస్తూ ఉన్న దగా పద్ధతీ, మోసకారి విధానమూ గమనించి గ్రహిస్తూన్న భారతీయులు ఆంగ్లేయ విధానాలతో విసుకుజెంది ఉన్నారు. నాయకులూ, దేశంలోని చిన్న పెద్దలూ - అందరికీ బ్రిటిష్ విధానం పట్ల విముఖతే కలిగింది. ఆ కారణంచేత బహిష్కరణ తీర్మానం విస్తారం తర్జన భర్జనలు అవసరం లేకుండానే అంగీకరించబడింది.
తీర్మానం ఆమోదించబడిన వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెసు కమిటీలకీ, ప్రజానీకానికీ కూడా సైమన్ కమిషన్ బహిష్కరించవలసిందనీ, పూర్తిగా హర్తాలు చేయవలసిందనీ ఆదేశాలు ఇవ్వ