పుట:Naajeevitayatrat021599mbp.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బాయ్‌కాట్

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన విషయంలో ఏర్పాటయిన బహిష్కరణ ఉద్యమం చాలా ఘనంగా సాగింది. ఆఖరికి రైల్వేపోర్డర్లు కూడా వైస్రాయిగారి సామానులుగాని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సామానులుగాని ముట్టనయినా ముట్టలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా యీ ప్రకారం గానే చుక్క ఎదురయింది. ఇంతకంటే ఘనమయిన నిరసన ప్రపంచం మొత్తంమీద యే జాతీ చూపించి ఉండదు. ఇటువంటి పరిస్థితులను గమనించే లార్డ్ రీడింగ్ తాను నిజంగా విస్తుపోయాయనీ, చైతన్య హీనుణ్ణే అయ్యాననీ వెల్లడించాడు. అంతేకాదు, భారతదేశానికి నిజంగా కావలసినదేమిటో కూడా తాను నిర్ణయించలేని స్థితిలో ఉన్నానన్నాడు.

లార్డ్ రీడింగ్

వైస్రాయ్ కాకపూర్వం లార్డ్ రీడింగ్ న్యాయవాదిగా మంచి నేర్పరితనాన్ని కనబరిచేవాడు. పంజాబుప్రాంతం తనదేననీ, దానిని తనకు ఒప్పగించి తీరాలనీ లండను హైకోర్టులో "దిలీప్‌సింగ్" ప్రభుత్వం వారిమీద తీసుకువచ్చిన దావాలో నేను లార్డ్ రీడింగ్‌తో కలిసే దిలీప్‌సింగ్ తరపున పని చేశాను. అప్పటి పరిస్థితులనుబట్టి మున్ముందు లార్డ్ రీడింగ్ హిందూదేశానికి వైస్రాయిగా వస్తాడనిగాని, చాలా చాకచక్యంగా రాజ్యాంగాన్ని నిర్వహిస్తాడనిగాని నేనెప్పుడూ కలలో కూడా తలచి వుండలేదు. జన్మత: ఆయన "యూదు" జాతికి చెందినవాడు అవడం చేతనే అట్టి క్లిష్ట పరిస్థితులలో సహజంగా ఆజాతికి చెందిన జిత్తులమారి తనంతో, నేర్పుగా ఆ పరిస్థితులను ఎదుర్కోగలిగాడు.

బెంగాలులో క్రిమినల్ లా ఎమెండ్ మెంట్ యాక్ట్ క్రింద అనేకమందిని నిర్బంధించ గలిగాడు. వారు ఇస్తూన్న ఉపన్యాసాలను గమనిస్తూ, మహమ్మదాలీ,షౌకత్ ఆలీ సోదరులనూ, డాక్టరు కిచులూనూ కూడా నిర్బందించాడు. వీరినేగాక అనేక మంది "ఫత్వా"లనూ నిర్బంధించాడు.

సత్యాగ్రహపు తొలిమెట్టుగా అమలు పరచిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణ ఉద్యమం, అనుకున్న దానికంటె ఎంతో ఘనంగా కొన