కుమారుడు తండ్రిని భక్తి గౌరవాలతో చూడ్డం కంటె అతడి భార్య మామగారిని అతడికంటె భక్తి ప్రపత్తులతో చూడ్డం విశేషం. లక్ష్మిశ్రీ క్రమశిక్షణలోను, కుటుంబ నిర్వహణలోను పెట్టింది పేరు. ముఖ్యంగా నేను తీవ్రమైన రుగ్మతతో మూడునెలలపాటు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆమె అహోరాత్రులు నన్ను కనిపెట్టుకుని ఉండి, సేవచేయడం నన్ను పరామర్శించడానికి వచ్చిన ప్రముఖ నాయకులెందరో ప్రశంసలు పొందింది. ఆదర్శప్రాయురాలైన కోడలని పేరు గాంచింది. భార్యా వియోగంలో ఉన్న నన్ను నా కుమారుడు, కోడలు, మనుమడు కృష్ణ కుమార్, మనుమరాలు కృష్ణ సుప్రియ ఆప్యాయంగా చూడ్డంవలెనే నేను కడచిన మూడు దశాబ్దాలుగా నా జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తూ వచ్చానని చెప్పక తప్పదు.
"గాంధీజీకి నేను అయిదు రూపాయిలు బాకీ" :
అది 1946. మహాత్మాగాంధి మద్రాసులో జరుగుతున్న దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాలకు రైలులో వెడుతూ మార్గం మధ్యలో