పుట:Naa Kalam - Naa Galam.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడుసార్లు తప్పిన శాసన మండలి సభ్యత్వం :

1978లో నేను విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి ఆ క్లబ్‌ సమావేశంలో ప్రసంగించారు. నా పట్ల ఆయనకు ఎంతో గౌరవాభిమానాలుండేవి. ప్రెస్‌క్లబ్‌లో ఆయన సమావేశాన్ని నేను నిర్వహించిన తీరును హర్షించిన మఖ్యమంత్రి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో శాసన సభావ్యవహారాల మంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావుతో కలిసి విమానంలో హైదరాబాద్‌ వెడుతూ నన్ను శాసన మండలికి సభ్యుడుగా గవర్నర్‌ నామినీగా పంపితే బాగుంటుందని అన్నట్టు, ఆ తరువాత శ్రీ నాదెండ్ల నాతో చెప్పారు. 1978లో ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి - శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, డాక్టర్ బోయి భీమన్న, శ్రీమతి సంయుక్త బుల్లయ్య, నా పేరు శాసన మండలికి గవర్నర్‌ నామినీలుగా పంపాలని నిర్ణయించి, ప్రధాని ఇందిరా గాంధికి జాబితా పంపగా, అక్కడ మరో రాజకీయ ప్రముఖడు చేసిన "చాణక్యం" ఫలితంగా శ్రీ అక్కినేని, నా పేర్లకు బదులు వేరే అభ్యర్ధులిద్దరి పేర్లు గవర్నర్‌ నామినీల జాబితాలో చోటు చేసుకున్నాయి! అలా 1978లో ఆ అవకాశం తప్పిపోయింది.

డాక్టర్ చెన్నారెడ్డి పట్టుదలకు, మాట నిలకడకు పెట్టింది పేరు. ఆయన పట్టు విడవని విక్రమార్కునివలె నన్ను ఏవిధంగానైనా శాసనమండలికి పంపాలని పట్టుదలతో తిరిగి 1980లో నా పేరును ఆమోదానికి ప్రధాని ఇందిరా గాంధికి పంపారు. అయితే, అక్కడ ఈ సారి అప్పటి విదేశాంగ మంత్రి శ్రీ పి.వి నరసింహారావు సన్నిహిత బంధువుకు ఆ అవకాశం దక్కింది. రెండవసారి కూడా ఇలా జరిగినందుకు నాకంటె తాను ఎక్కువగా బాధపడుతున్నట్టు డాక్టర్ చెన్నారెడ్డి నాకు లేఖ రాశారు.

తరువాత శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి 1982లో ముఖ్యమంత్రిగా