పుట:Naa Kalam - Naa Galam.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పార్లమెంటులో ప్రశ్న

దానితో నేను సంతృప్తి పడలేదు. కొంత కాలమైన తరువాత అప్పటి రాజ్యసభ సభ్యుడు శ్రీ రామ మోహనరావు చేత పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయమై ప్రశ్న వేయించాను. తమకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రాసిన లేఖ చేరిందని, తెలుగుకు రెండు హోదాలు యిచ్చే విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు.

2004లో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డికి ఈ సమస్యను నివేదించగా, దాన్ని తప్పక పరిశీలిస్తామని ఆయన తరపున ఆయన సలహాదారు డాక్టర్ కె.వి.పి.రామచంద్ర రావు నాకు ప్రత్యుత్తరమిచ్చారు.

ఆ తరువాత 2005-2006లో తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వవలసిందిగా కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించాలని ఒక టి.వి. చానల్‌లో రెండు నెలలపాటు ప్రతిరోజు "ప్రజానాడి"లో నా పేరుతో స్క్రోలింగ్‌ లైన్‌ వచ్చేట్టు చూశాను!

ప్రసాద్‌త్రయం :

కాగా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వాలని కేంద్రాన్ని కోరుతూ 2006 ప్రారంభంలో రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తరువాత "ప్రసాద్‌త్రయం" (శ్రీమండలి బుద్ధ ప్రసాద్‌, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, శ్రీ ఎ.బి.కె ప్రసాద్‌) ఎంతో శ్రమతోఎట్టకేలకు తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి యివ్వడానికి కేంద్రాన్ని ఒప్పించారు. ఈ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగాను,పరోక్షంగాను చేసిన కృషి ఎంతైనా అభినందనీయం. అలా ఎన్నో సమస్యలు అడ్డుపడి, ఎందరో శ్రమపడి, కృషి చేస్తేకాని తెలుగు భాషామ తల్లికి ప్రాచీన భాషా ప్రతిపత్తిరాలేదు.