పుట:Naa Kalam - Naa Galam.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యమంత్రిపై ఒత్తిడి :

నా ఉపన్యాసంలో నేను తెలుగు భాషోన్న తిని ఉగ్గడించి, తమ భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి, రెండవ జాతీయ అధికార భాష హోదా సాధించడానికి తమిళులు చేస్తున్న కృషిని వివరించి, "మనం చూస్తూవుంటే, వారు మేస్తూపోతా"రని అన్నట్టు, మనరాష్ట్ర ప్రభుత్వం మిన్నకుంటే, ప్రాచీన, భాషాప్రతిపత్తి, రెండవ జాతీయ అధికార భాష ప్రతిపత్తి న్యాయంగా రావలసిన తెలుగు భాషకు లభించకుండా పోతాయని, అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ త్వరపడాలని, ఈ విషయంలో కేంద్రంపై ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని, ఆయన ఆ సభా ముఖంగా హామీ యివ్వాలని గట్టిగా అభ్యర్థించాను.

ఆ తరువాత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ "శ్రీ తుర్లపాటి చెప్పిన ఈ విషయాలు ఇప్పడే తమకు తెలిశాయని, ఆయన చెప్పినట్టు, అవసరమైతే కేంద్రంతో పోరాడి అయినా,తెలుగు భాషకు రావలసిన ప్రతిపత్తి, అధికార హోదా సాధించగల"నని సభాసదుల హర్ష ధ్యానాల మధ్య హామీయిచ్చారు.

అంతటితో నేను ఆ విషయాన్ని వదిలి పెట్టలేదు. తిరుపతి నుంచి విజయవాడ వచ్చిన తరువాత నాలుగైదు సార్లు ముఖ్యమంత్రిగారికి ఆయన హామీ గురించి జ్ఞాపకంచేశాను. చివరికి నేనిచ్చిన సమాచారం ఆధారంగా ఆయన తెలుగుకు ప్రాచీన భాషా ప్రతిపత్తి, ద్వితీయ అధికార భాష హోదా యివ్వాలని కోరుతూ ప్రధాని వాజ్‌పేయికి లేఖ రాసి, దాన్ని పత్రికలకు విడుదల చేసే బాధ్యత నాకే అప్పగించారు. నేను విజయవాడలో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి ప్రధానికి రాసిన లేఖను విడుదల చేశాను. అన్ని పత్రికలు ఆ లేఖకు విస్తృతంగా ప్రచారమిచ్చాయి.