పుట:Naa Kalam - Naa Galam.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్రగణ్యులైతే, విజయవాడలో నేమి, ఇతర పట్టణాలలో నేమి నాకు అండదండలు అందించిన శ్రీ చెట్లపల్లి మారుతి ప్రసన్న వంటి ఆత్మీయ మిత్రులు ఎందరో, ఎందరెందరో ! అందరికీ నావందనాలు. బహుశా ఇంతటి ఆత్మీయ, అభిమాన "మిత్ర సంపద" లభించడం నా మహా భాగ్యమేనని చెప్పాలి. వారితో ఏ ఒక్కరితో కాని నాకు పొరపొచ్చాలు కాని, అభిప్రాయ భేదాలు కాని రాలేదని చెప్పవచ్చు. వారే నన్ను "అజాత శత్రువు " అని ఆప్యాయంగా పిలుస్తుండగా, ఇక ఏ ఒక్కరినైనా దూరం చేసుకునే అవకాశం వారు నాకెలా యిస్తారు?

"వార్తలలోని వ్యక్తి"

ఇందరు మిత్రులను గురించి ప్రస్తావించి నా సాహితీ జీవితంలో నాకు అత్యంత ఆప్తమిత్రుడు, కడచిన 50 సంవత్సరాలుగా నాకు పేరు ప్రఖ్యాతులు, పెద్దలు, ప్రముఖులతో పరిచయాలు సాధించిన వ్యక్తిని గురించి ఇక్కడ ప్రస్తావించకపోతే, అది నాకు నేనే అన్యాయం చేసుకోవడమే కాగలదు! నాకు తోడుగా, నీడగా వెన్నంటి నిలిచిన ఆ వ్యక్తి పేరు "వార్తలలోని వ్యక్తి"!

1960లో నేను "ఆంధ్ర జ్యోతి"లో చేరగానే దాని ఎడిటర్‌, జర్నలిజంలో నా ద్రోణాచార్యుడు శ్రీ నార్ల వెంకటేశ్వర రావు నన్ను పిలిచి, "ఇంతకు పూర్వం "హిందూ" పత్రికలో "మ్యాన్‌ ఇన్‌ ది న్యూస్‌" అన్న శీర్షికలో ఆ వారం ప్రముఖ వ్యక్తిని పరిచయం చేసేవారు. ఇప్పుడు వారు ఆ శీర్షికను ప్రచురించం లేదు. మనం "ఆంధ్ర జ్యోతి"లో "వార్తలలోని వ్యక్తి " అన్న శీర్షికతో ప్రతిరోజు ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేద్దాం. ఆ పనిని నేను మీకే అప్పగిస్తున్నాను. బాగా చేయండి. మంచి పేరుతెచ్చుకోండి". అని చెప్పారు.

"అది ఎలా ఉండాలో మీరొకటి రాసి చూపించండి" అని నేను ఆయననను కోరాను. ఆయన శ్రీ వావిలాల గోపాల కృష్ణయ్యను గురించి మొట్టమొదటి "వార్తలలోని వ్యక్తి" గా రాసి నాకు చూపించారు. అక్కడి