పుట:Naa Kalam - Naa Galam.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుంచి నేను శీర్షికను ప్రారంభించి, " ఆంధ్రజ్యోతి"లో నాలుగు సంవత్సరాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా రాశాను. ప్రతిరోజు ఒక ప్రముఖుని జీవిత విశేషాలను సేకరించి రాయడం ఎంత కష్టం ! కాని, వాగ్దేవి ఆశీస్సులు. గురువరేణ్యుని ప్రోత్సాహంతో క్రమం తప్పకుండా రాశాను. అయితే, మధ్యలో నాకు అస్వస్థత ఏర్పడినందున, కొంతకాలం సెలవుపై వెళ్లాను. అప్పుడు మాత్రం రాయలేదు. అయితే, నేను తిరిగి "ఆంధ్ర జ్యోతి"కి రాగానే నార్లగారు నన్ను పిలిచి, "వార్తలలోని వ్యక్తి"ని వదిలి పెట్టవద్దు. అది మీకే సాధ్యం. అందువల్ల, ప్రతి రోజూ వద్దు కాని, ప్రతి వారం రాయండి, చాలు" అన్నారు. అక్కడి నుంచి ఆ శీర్షికను అలాగే కొనసాగించాను. నేను "ఆంధ్ర జ్యోతి" నుంచి 1992లో రాజీనామా చేసిన తరువాత కూడా రాశాను.

"ఆంధ్రజ్యోతి" 1999లో ఆగిపోయినప్పుడు "వార్తలలోని వ్యక్తి" కూడా కనిపించ లేదు! అదే సమయంలో "వార్త" దిన పత్రిక సంపాదకులు శ్రీ కె.రామచంద్రమూర్తి నన్ను తమ పత్రికలో ఆ శీర్షికను రాయవలసిందిగా కోరారు. "వార్త" దిన పత్రిక ఆవిర్భవించినప్పటి నుంచి "వార్తలలోని వ్యక్తి" ఇప్పుడు ప్రతి సోమవారం సాక్షాత్కరిస్తూనే ఉన్నాడు. ఎవరైనా "వార్తలలోని వ్యక్తి" ఎప్పుడు వస్తాడు? అని అడిగినప్పుడు, నేను చమత్కారంగా అంటూవుంటాను. "సోమవారం అనేవారం ఆ రోజున వస్తుందో, లేదో కాని ఆ రోజున "వార్తలలోని వ్యక్తి" వస్తాడని అంటూవుంటాను! అలా, 1960 లో జన్మించిన "వార్తలలోని వ్యక్తి" వయస్సు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటినాయి! ఇన్ని సంవత్సరాలు ఒక శీర్షికను ఒకే పాత్రికేయుడు నిర్వహించడం బహుశా జర్నలిజం చరిత్రలో అరుదేమో!

ఈ శీర్షికలో సాక్షాత్కరించాలని ముఖ్యమంత్రులైన వారే కోరిన సందర్భాలు లేకపోలేదు! ఇక, ప్రముఖ వ్యక్తుల సంగతి చెప్పేదేమున్నది ?