పుట:Mana-Jeevithalu.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

288

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

నీళ్లు తాగింది. ఎంత నిశ్శబ్దంగా వచ్చిందో అలాగే మాయమైంది. ఆ ప్రదేశాన్ని నిశ్శబ్దం ఆవరించింది. అందులో అన్నీంటినీ ఇముడ్చుకున్నట్లుగా ఉంది.

చప్పుడు ఆఖరవుతుంది. కాని, నిశ్శబ్దం చొచ్చుకుపోయేటట్లుగానూ, అనంతంగానూ ఉంటుంది. చప్పుడు వినిపించకుండా మూసుక్కూర్చోవచ్చు. కాని నిశ్శబ్దాన్ని మూసివేయటానికేమీ ఉండదు. ఏ గోడా దాన్ని మూసివెయ్యలేదు. దాన్ని ప్రతిఘటించటానికి ఉండదు. చప్పుడు అన్నిటినీ కప్పివేస్తుంది. అది ప్రత్యేకంగా విడిగా ఉంటుంది. నిశ్శబ్దం ప్రేమ లాగే అభేద్యమైనది. అందులో చప్పుడు అనీ, నిశ్శబ్దం అనీ విభజన ఉండదు. మనస్సు దాన్ని అనుసరించలేదు. దాన్ని గ్రహించటానికి నిశ్చలంగా చేయబడలేదు. నిశ్చలంగా చెయ్యబడిన మనస్సు తన రూపాలనే ప్రతిబింబింపజేస్తుంది. అవి గీసినట్లుగా స్పష్టంగా ఉండి, ప్రత్యేకంగా ఉండాలని గొడవ చేస్తాయి. నిశ్చలంగా చెయ్యబడిన మనస్సు ప్రతిఘటిస్తుందంతే. ప్రతిఘటన అంతా ఆందోళనే. నిశ్చలంగా చెయ్యబడినది కాక, నిశ్చలంగా ఉన్న మనస్సు నిశ్శబ్దాన్ని ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటుంది. ఆలోచనా, మాటా అప్పుడు నిశ్శబ్దం లోనివే అవుతాయి - అవతలివి కావు. ఎలాటి చిత్రమో, ఈ నిశ్శబ్దంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది - కొనితెచ్చుకున్న ప్రశాంతత కాదు. ప్రశాంతత అమ్మకానికి వీలయేది కాదు. దానికి విలువలేదు. దాన్ని ఉపయోగించు కోవటానికి కుదరదు. దానిలో పారిశుధ్యం, ఏకాంతం ఉండే లక్షణం ఉంటుంది. ఉపయోగించటానికి వీలయేది త్వరలోనే అరిగి పోతుంది. ప్రశాంతత ఆరంభం అవదు, అంతం అవదు. ఆవిధంగా ప్రశాంతంగా ఉన్న మనస్సుకి ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. అది దాని కోరిక యొక్క ప్రతిబింబం కాదు.

ఆవిడ దేన్ని గురించో ఒక దాని గురించి ఆందోళన పడుతూనే ఉంటుందని చెప్పిందావిడ. కుటుంబం గురించి కాకపోతే పక్కింటివాళ్ల గురించి, లేకపోతే ఏదో సాంఘిక కార్యకలాపం. ఆందోళనతో ఆవిడ జీవితం నిండిపోయింది. నిత్యం ఇటువంటి కల్లోలాలు ఏకారణం వల్ల వస్తున్నాయో ఇంతవరకు కనుక్కోలేకపోయిందిట. ఆవిడకి ఏమీ ఆనందం లేదుట. ప్రపంచం అలా ఉంటే ఎవరైనా ఎలా ఆనందంగా ఉండగలరు? ఏదో