పుట:MaharshulaCharitraluVol6.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

మహర్షుల చరిత్రలు


సమీపమున నొకయప్సరస అతిమనోహరదేహసౌందర్యము దిశలఁ బ్రకాశింప దిగంబరయై కానవచ్చెను. ఆమెను జూడఁగనే మంకణునికి వీర్యస్థలనము కా నుండెను. మహాతపుఁ డగునాతఁడు వీర్యము నొక కలశమున విడిచి తీసికొనిపోయి కాపాడెను. ఆ కలశమున నా వీర్య మేడు శకలము లయ్యెను. క్రమముగా నందుండి వాయువేగుఁడు, వాయుబలుఁడు, వాయుఘ్నుఁడు, వాయుమండలుఁడు, వాయుజ్వాలుఁడు, వాయు రేతుఁడు, వాయుచక్రుఁడు అను నేడుగురు మహర్షులు జనించిరి. వీరే తరువాత మరుద్గణములకు జనకు లయి విలసిల్లిరి. దీనితో మంకణుని మహిమ ముల్లోకముల వ్యాపించెను.*[1]

మంకణుని మహిమ నృత్యము

తపః ప్రవణుఁ డగుమంకణుని శరీరమున కొకప్పుడొక దర్భ గ్రుచ్చుకొనెను. దానినుండి యాశ్చర్యకరముగా శాకరసము స్రవింపఁ దొడఁగెను. అది చూచి యాతఁడు మిగుల సంతోషించి తన తపము మిక్కిలి శక్తివంత మైనదని యానందాతిరేకమున గంతులు వేయుచు నృత్యము చేయఁ దొడఁగెను. ఆతనితోపాటు జంగమస్థావరము లన్నియు నొక్క పెట్టున ముగ్ధమై నృత్యముచేయ మొదలిడెను. దానితో గొప్పకోలాహలము బయలుదేఱెను. తెగతెంపు లేని యా మహర్షినృత్యము, దాని ననుసరించిన యావజ్జంగమస్థావరకోటినృత్యము కారణముగా లోకములు తల్లడిల్లఁ జొచ్చెను. దేవతలు గజగజలాడిరి. అపుడు బ్రహ్మాదులు మహర్షులఁ దీసికొని మహాదేవుఁ డగుశివుని దర్శించి యా మహర్షి నృత్యము నాతనివెంట సకలస్థావర జంగమనృత్యము, దానివలనఁ గలిగిన లోకోపద్రవము విన్నవించుకొని యానృత్య మాఁగిననే కాని లోకమున స్తిమిత ముండదని ఘోషించిరి.

మహేశ్వరుఁడు వారి కభయ మిచ్చి వెంటనే మంకణుఁడు తపము చేయుప్రదేశమునకు విచ్చేసి దేవహితముఁగోరి “మహాత్మా ! తపః

  1. *భారతము ఆరణ్యపర్వము, శల్యపర్వము.