పుట:MaharshulaCharitraluVol6.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

మహర్షుల చరిత్రలు


సాధ్యము కాదు. మాయ గుణముల రూపము. దానిని దూరము తొలఁగింపఁగా, దివ్యజ్యోతి కాననగును. అది కనుటయే తన్నుఁ దాను గనుట. సత్త్వము, రజస్సు, తమస్సు అను మూఁడుగుణములు పెనవేసికొని ఆత్మఁబట్టుకొనును. వానిని ద్రించుట వైరాగ్య మనుగొడవలి చేతనే కాని మఱి యొకవిధమున సాధ్యము కాదు.

మఱియు, మణులతోను, బంగారముతోను, వెండితోను, మట్టి మున్నగు వానితోను జేయఁబడిన యనేకములగు పూసలలో దారమున్నట్లు భూతకోటు అన్నింటియందును పురుషుఁ డుండును. ఒకేభూమిమీఁద ననేక విధములగు ఓషధులు పుట్టునట్లె ఒకేబుద్ధివలన ననేకములగు కర్మలు కలుగును. జలము భూమికంటెఁ బెద్ద; తేజ మంతకంటెఁ బెద్ద; వాయు వంతకంటెఁ బెద్ద; దానికంటె నాకాశము పెద్ద; దానికంటె మనస్సు పెద్ద; దానికంటె బుద్ది పెద్ద; పృథివ్యాదిపంచభూతములకంటెను మనోబుద్దుల కంటెను కాలము పెద్ద. కాలాతీతుఁడై పురుషుఁ డి జగములకుఁ బ్రభువై యుండును. ఆతని కాది మధ్యాంతములు లేవు. ఆతఁ డవ్యయుఁడు. వేదములు, నానావిధవాదములు నతనినే కీర్తించును. ఆతఁడు భవ నాశకుఁడు. అనుభవాతీతమగుశాంతమువలనఁ గనుపట్టునది. సత్ప్రకాశము. అది తలఁపులకుఁ బలుకులకు దొరకదు. కర్మములకుఁ గానిపింపదు. ఈ ప్రకాశము అమృతము, అచ్యుతము, అమలము, అమేయము, అవ్యయము, అనంతము. యమాదుల కలవడినచిత్తము శమాతిరేకమును పొందగా దీనిని గాంచును.*[1]

బృహస్పతి అగస్త్యుని బ్రార్థించుట

ఇంద్రాదులకుఁ గాని దేవతలకుఁ గాని కష్టనష్టములు కలిగినపుఁడెల్ల బృహస్పతి వారికై యెవ్వ రెవ్వరిననైనఁ బ్రార్థించి వారికి క్షేమము నొనఁగూర్చువాఁడు. వింధ్యపర్వతము పెరిగి లోక వ్యవహారము తాఱు మాఱు చేయఁగా లోకోపద్రవము వాటిల్లెను. అప్పు డింద్రాదులను వెంటఁగొని బృహస్పతి బ్రహ్మకడ కేగి రక్షింపు మని కోరఁగా నాతఁడు

  1. *భారతము; శాంతిపర్వము.