పుట:MaharshulaCharitraluVol6.djvu/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

59


వారి నగస్త్యుని బ్రార్థింపుఁ డని పంపెను. బృహస్పతివెనుక దేవతలెల్లరు భూలోకమునకు దిగి కాశీ పట్టణముఁ జేరి యగస్త్యాశ్రమమును సమీపించి యా మహర్షికి మ్రొక్కి నిలిచిరి. అగస్త్యుఁడు వారి క్షేమ మడిగి బృహస్పతిని బహూకరించి వచ్చినపని యడిగెను. లోపాముద్రాపతిని బృహస్పతి స్తుతించి “ ఋషివర్యా! నీవు ప్రణవమవు. లోపాముద్ర వేదవిద్య. నీవు తపస్సువు. లోపాముద్ర శాంతి. ఈమె సత్కియ. నీవు ఫలము, నీవు సూర్యుఁడవు. ఈమె చై తన్యలక్ష్మి. నీ యందు బ్రహ్మతేజము, ఈ మెయందుఁ బతివ్రతాతేజము ప్రజ్వరిల్లుచు లోక క్షేమముఁ గూర్చుచున్నవి. ఈ రెండుతేజములు కలిసి మాకు క్షేమ మొసఁగుఁగాక " యని పలికి అగస్త్యునిచే వింధ్యగర్వాపహరణముఁ గావించి లోక శ్రేయముఁ గూర్చెను. *[1]

బృహస్పతి శుక్రాచార్యుఁ డగుట

తొల్లి యొకప్పుడు దేవతలకు విజయము పై విజయము రాక్షసులకు పరాజయముపైఁ బరాజయము కలుగుచుండుటఁ గని రాక్షసులు తమగురువగు శుద్రాచార్యునికడ కేఁగి మొఱ్ఱపెట్టిరి. శిష్యవత్సలుఁ డగు శుక్రుఁ డుపాయ మూహించి శంకరుని గుఱించి తప మొనరించి యాతని కరుణ వడసి మంత్రశక్తులు సంపాదించి వానివలన రాక్షసులకు విజయము దేవతలకుఁ బరాజయము సమకూర్ప నిశ్చయించుకొనెను. పిదప నాతఁ డేగి శివుని మెప్పించి యాతని సూచన ననుసరించి యుగ్రతప మొనరించుచుండెను. ఇంద్రుఁ డీసంగతి యెఱిఁగితపోభంగమునకై తనకూఁతురగు జయంతినిఁ బుత్తెంచెను. మహాసౌందర్యవతి, యౌవనవతి, గుణవతి యగు జయంతి శుక్రాచార్యునిఁ జేరి యాతనికి శుశ్రూష లొనరించుచు ననేక సంవత్సరములు గడపెను. తుట్టదుద కాతఁ డామెఁ గనికరించి కావలసినది కోరుకొను మనఁగా నామె యాతనితోడి చిరకాల సంగమసౌఖ్యముఁ గోరుకొనెను. అన్నమాట కా దనఁ జాలక శుక్రుఁడు సంకేతమందిరమున నామెకోరికఁ దీర్చుచు వేలకొలఁది సంవత్సరము లుండిపోయేను.

  1. *స్కాందపురాణము. కాశీఖండము.