పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసన్న కుమార టాగూరు

ఈయన 1803 వ సంవత్సరమున జన్మించెను. ఈతనివలన టాగూరు కుటుంబమునకు మిగుల వన్నెయు వాసియు గలిగినవి. ఇంటివద్ద నతఁడు హిందువుల కట్టుబాటులలోనే బెరుగుచు నాకాలమునకుఁ దగినరీతిగా కొంచె మింగ్లీషుగూడ జదివెను. మొట్టమొదట నతఁడు చాందసుఁడెయున్నను తరువాత కొంతకాలమునకు రాజ రామమోహనరాయల వారిమైత్రి గలుగుటఁజేసి యతఁడు హిందువుల యాచారములలో నేవిమంచివి యేవి చెడ్డవని శోధింపనారంభించెను. ఇట్లు శోధించి శోధించి యతడు దేశస్థుల కొక విజ్ఞాపనము వ్రాసి ప్రకటించెను. అందులో విగ్రహారాధనము చేయుట యనుచిత మనియు సర్వలోక సృష్ఠికర్తయు సర్వనియామకుఁడునగు పరమేశ్వరుని మానసిక పూజచేయవలయుననియు నతఁడు నొక్కి వ్రాసెను. అతడు బుద్ధిస్వాతంత్ర్యమును గనబరచుట యొక్క మత విషయముననే గాదు. ఇంకననేక విషయములం జూపెను. తాను స్వయముగ జమీందారుఁడయ్యు జమీందారు లుద్యోగములు చేయగూడదను గర్వము లేక సామాన్యులవలెనే తానును శాస్త్రములఁ జదివి పరీక్షలయందు దేఁరి న్యాయవాది యయ్యెను.

ఈ పనిలోఁ బ్రవేశించునపుడు ప్రసన్న కుమారుని మిత్రుఁడొకడువచ్చి యట్టి గొప్పకుటుంబమున బుట్టిన సంపన్నునకు న్యాయవాదిగ నుండుట యవమానకరమనియు నిరర్ధకమనియుఁజెప్పి మందలించెను. ప్రసన్న కుమారుఁడప్పు డతనితో నిట్లనియె. "మనస్సు గృహమందు జరుగవలసిన యిన్నిపనులను జక్కపెట్టుకొను భార్య వంటిది. నాకు నీలిమందు తోటలు, ఆముదపు యంత్రములు చాల గలవు. అందులో నా కన్యాయముగ నష్టములు కలుగుచున్నవి.