శ్రీనివాస: ఇందిరానెహ్రూ పెళ్ళివంటిదయిదే నాయికా నాయకులు తెరముందరే ఉంటారన్నమాట.
కోనంగి: అద్దదీ విషయం!
రామా: ఉపనాయకులూ, నాయికలూ, ప్రతినాయకులూ, నాయకులు ఉండవచ్చు గాదాండీ?
కోనంగి: ఆ! లేకపోతే కావ్యం ఎల్లాగ? ఒక్కొక్కప్పుడు వార్త భావకావ్యం వంటిది కావచ్చును. అప్పుడు అలాంటి వగయిరాలు ఉండకపోవచ్చును.
రామారావు: బొమ్మ సంపాదించి ఏమి చేయమంటారు?
కోనంగి: దాని అతిముఖ్యత, పరమముఖ్యతలనుబట్టి మన పత్రికలో ప్రచురించే కొలత నిర్ణయించాలి రామారావుగారూ!
శ్రీనివాస: మీరు 'గిలిగింతలు' అని ఒక ప్రత్యేక “శీర్షిక” కాలం వ్రాస్తున్నారే! దాన్ని లోకం అంతా మెచ్చుకుంటున్నదండీ!
కోనంగి: హాస్యంగా, మధురంగా దెబ్బకొట్టడం, అభినయంలో నాయిక జడచివర పూలకుచ్చుతో కొట్టటంవంటిదండీ!
రామా: మనం పూర్తిగా కాంగ్రెసుపక్షం అవకూడదా అండీ?
కోనంగి: మనం ఎల్లాగా కాంగ్రెసుపక్షమే. కాని అది వ్యక్తం చేయకుండా నిఖారసయిన జాతీయపక్షం. అందులో కాంగ్రెసు ఒక సంస్థ అన్నట్లు చూపాలి!
శ్రీనివాస: “హిందూ” పక్షం అదేకదా అండీ?
కోనంగి: కాదండీ. హిందూ కొంచెం, సాంబారు పక్షందా. ఖారంజాస్తి ఉండదుగా, పంచదార అసలే లేదుకదా!
(అందరూ పకపకమని విరగబడి నవ్వుతారు)
3. మా పత్రిక
“పత్రికాసంస్థ దేశంలోని ముఖ్యసంస్థలలో నాలుగవది. మొదటిది ప్రజలు, రెండు శాసనసభలు, మూడు ప్రభుత్వకార్యవర్గం, నాలుగు పత్రికాసంస్థ, అయిదు న్యాయస్థానాలు, ఆరురాజకీయ సంస్థలు, ఏడు సారస్వతము, ఎనిమిది సాంఘిక సంస్థలు.
“అలాంటి పత్రికా సంస్థలలో దినపత్రిక రాణి. దినపత్రిక సంపాదకీయం ఆరాణికి మకుటం. వార్తలిచ్చే విధానం భూషణాలు, వార్తాహరులు భోజనం. రాజకీయాలు వ్యక్తిత్వం.
“ప్రజల అభిప్రాయాలు ప్రజలకే వ్యాఖ్యానంచేసి పత్రిక చెప్తుంది. ప్రజల భావాలను మార్చగల నాయకుడౌతుంది పత్రిక. తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రజలను పొగుడుతుంది. బ్రతిమాలుతుంది.
"శాసనసభలకూ ప్రభుత్వానికీ మార్గాలు చూపిస్తుంది. వానిని విమర్శిస్తుంది, ఖండిస్తుంది, పొగుడుతుంది, ప్రభుత్వానికి వెరవకుండా సంచరిస్తుంది. ప్రభుత్వం శిక్షిస్తే అనుభవిస్తుంది. పొరపాట్లకు క్షమాపణ అడుగుతుంది. గూడుపుఠానీలు, కుట్రలు బయటపెడ్తుంది. లోకులను మాయచేసే వంచకులను చీల్చి చెండాడుతుంది పత్రికాసంస్థ.
ప్రజోద్యమాలకు కోటివిధాల సహాయం చేస్తుంది. అభ్యుదయ మార్గాలను అన్వేషిస్తుంది. చందాలు వసూలుచేసి పెడుతుంది. బాధపడే మారుమూల ప్రజలకు