పుట:Konangi by Adavi Bapiraju.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధనలాభం ఎక్కువ. ఉద్యోగం స్త్రీ వల్లనే కలుగుతుంది. స్త్రీయే నీకు ఉద్యోగం” అని చెప్పడంవల్లనే కదా తాను వరుడు కావాలి, అన్న ప్రచురణలు చూస్తో ఉండేవాడు.

ఇంతకూ, కోనంగి మొదటి సంపాదన స్త్రీవల్లనే వచ్చింది. నువ్వు పెళ్ళికొడుకుగా, నాకు పనికిరావు అని నిర్మొహమాటంగా తియ్యగా చెప్పి సీతాదేవి, కాస్త కోనంగి అంటే కరుణ జనించి తనే అతనికి బందరుకు ఇరవైరెండు రూపాయల పై చిల్లరపెట్టి రెండవ తరగతి టిక్కెట్టుకొని ఇచ్చింది.

తోలుపెట్టి ఒక స్నేహితునిది, హోల్డాలు ఇంకో స్నేహితునిది, దుప్పటి ఇంకోరిది. కోటు ఒక ప్రాణస్నేహితునిది. మదరాసు ప్రయాణానికి మరో ముఖ్య ప్రాణస్నేహితుని దగ్గర పదంటే పదిరూపాయలే బదులు పుచ్చుకు బయలుదేరాడు. బందరుబండిలో టిక్కట్టుకొనే వ్యవధి చాలాలేదు. రైలు కదులుతూ ఉండగా ఎదురుగుండా ఉన్న రెండవతరగతిలో ఎక్కి బెజవాడ చేరుకున్నాడు.

బెడవాడలో మెయిలుకు పద్దెనిమిది రూకలు పెట్టి రెండవ తరగతి కొనాలి. యుద్ధంరోజులు: రెండవతరగతి టిక్కెట్టు కొనేందుకు తన దగ్గర డబ్బులేదు.

అసలు రెండవ తరగతి విషయం ఏలా వచ్చిందీ అంటే “కావాలి వరుడు” అని 'హిందూ' లో ప్రచురించిన వధువు తండ్రి బాక్సు నెంబరు 134 'హిందూ' గారికీ తనకూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వధువు తండ్రి “మీరు రెండవతరగతిలో వస్తున్నారు కనుక అక్కడకు మాడ్రైవరు వచ్చి మిమ్మును గూర్చి వాకబు చేస్తాడు. మా కారు నెంబరు ఎం. సి. ఏ. 3004, కారు చెవ్రలెట్, డైవరు పేరు మురుగేశం” అని వ్రాశాడు.

టిక్కెట్టు లేకుండా సెకండుక్లాసులో ప్రయాణం చేయడం వట్టి దురన్యాయం తాను అబద్దం ఆడదలచుకోలేదు, అయితే “ఆశ్వద్దామా హతఃకుంజరః” అని ధర్మరాజుగారన్న చిన్న తెల్ల అబద్దం "వారిజాక్షులందు, వైవాహికములందు” ఆడవచ్చునని శుక్రుడు అన్నాడు.

థర్టుక్లాసు కొన్నాడు. మెయిలు వచ్చింది. గబగబ సామాను సెకండు క్లాసులో ఎక్కించాడు. తాను మాత్రం మూడవ తరగతిలోనే, యమయాతనపడి ప్రయాణం సాగించాడు. బేసిస్బ్రిడ్జి దగ్గిర టిక్కెట్లు వసూలు చేశారు. బయలుదేరబోయే ముందు మాత్రం సెకండుక్లాసులో ఎక్కికూర్చున్నాడు. మదరాసులో సెకండు క్లాసులోనే ఉన్నాడు. మురుగేశం వచ్చి కోణంగిరావుగారూ అని పిలిచే సరికి ఎవరన్నా అడిగితే సెకండు క్లాసులోనే వచ్చాను అని పైకి అని బేసిన్ బ్రిడ్జినుంచి మదరాసుకు అని లోపల అనవచ్చును.

ఇక ఇప్పుడు అతని దగ్గర ఉన్న ఆస్తి ధనం ఇరవై ఆయిదు రూపాయల పై చిల్లర.

తానే సామాను పట్టుకు ఈవలికి వచ్చాడు. ట్రిప్లికేన్ బస్సు ఎక్కాడు. బస్సు పైక్రాఫ్ట్స్ లో దిగినాడు. ఒక రిక్షాకు అణాడబ్బులిచ్చి నల్లతంబిలో ఉన్న నెల్లూరు ఆంధ్రలాడ్జికి చేరినాడు. అక్కడ గదులు కాళీలు లేవు. ఉన్న గదులే మూడు. కోనంగి దిగాలు పడిన మోము చూచి హెూటలు యజమాని కేశవప్ప మెత్తపడి “మా సామాను గదిలో మీ సామాను పెట్టించండి. మీరు వరండాలో పండుకొనండి. ఎల్లుండి ఒకగది కాళీ అవుతుంది, స్వామీ!” అన్నాడు.

“ఓ అంతకన్నానా!” అన్నాడు ఉప్పొంగిపోతూ కోనంగి. ఆ రాత్రి అతను సీతాదేవి ఇంటిలో భోజనంచేసే, రైలుకు బయలుదేరాడు.