కవితాప్రణయిని.
'సరస కవిత్వ శారద, నిశాముఖచుంబి సుధాంశుమండిలీ
కిరణతతుల్ శరజ్జలద కీర్ణములై మెలమెల దిక్కులన్
నెఱసెడి రాత్రివేళ రమణీయ సముజ్జ్వల తారకావళీ
భరిత నభంపుఛాయలఁ గృపామతిఁ జేరెరె నన్నుఁగూడఁగన్?
'కలయన్ స్వర్గమునందు నీదు రుచిరాకారంబు వీక్షించి చం
చలమై ద్రిమ్మరు నామనంబు నినుఁ గాంచం గ్రమ్మఱం గోమలీ,
కలకంఠంబులు గూసినం, గిసలయాగ్రంబుల్ పిసాళించినన్,
వలపుంజిల్కెడిపూవు పూచినను నీ నామంబె చింతించుదున్.
'పల్లవకోమలంబులగు పాదము లీవలమెట్టుచుండు నా
చల్లనిచప్పుడుల్ హృదయ సంచలనంబుల శబ్దమట్లు రం
జిల్లఁగఁ జేయునుల్లమును; సిగ్గగు నా ప్రణయంబుఁదెల్పికోఁ
బల్లవపాణి, నీకృపకుఁ బాత్రుఁడనంచుఁ దలంచి వేఁడెదన్.
'తళుకున్ బంగరుటేటి సైకతములం దావుల్ గుబాళించు పూ
వులగుత్తుల్, వెదచల్లు పుప్పోదులసొంపుం జిల్కు నీపాదచి
హ్నాల వీక్షించి ప్రమోదబాష్ప సలిలస్నాతంబులంజేసి ము
ద్దులు వర్షించితిఁ జంచలాక్షి, మదియందుం బ్రేమ చిప్పిల్లఁగన్.