పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాల]

కవితాప్రణయిని

43


'నీవు వసియించుసీమకు నేనుగూడ
వచ్చెదనువేగఁ గొనిపొమ్ము వలపులాఁడి,
శీతలామృతవర్షంబుఁ జిందు నీదు
సరస వీక్షా ప్రసాద భిక్షంబు నెట్టి.'

అని యువకుండుపల్క విని, యాకవితాలలితాంగి ముద్దు మో
మునఁ జిఱునవ్వుదొంతరలు పొంపిరివోవఁగఁ బాణిపల్లవం
బున వలిపంపుఁబయ్యెదను బొల్పుగనొత్తుచుఁగాలియందె ఘ
ల్లని రవళింప నేలపయి నల్లనఁ దా బొటవ్రేలు రాచుచున్.

వలపుల తేనెతుంపరలఁ బచ్చనిమోసులనెత్తు చిత్తపుం
గలఁతను దోఁపనీక కలకంఠమునా వచియించె: 'మోహనా,
పలికెదవోయి నీప్రణయబంధము; నెవ్వఁడవీవు? స్వర్గపుం
బొలముల సంచరించు మముబోఁటుల సంగతిఁ గోరినచ్చితే?

'నాదు బహిరాకృతిఁ గని యానందవార్ధి
నోలలాడిన వారెందరో గలారు
గాని, యెడలేని ప్రేమ శృంఖలలఁ జిక్కి
నామనముఁగొన్న ప్రియులు గానంగ నరుదు.